కేంద్రంపై చంద్రబాబు కారాలు, మిరియాలు.. ఘాటుగా లేఖ

రాష్ట్రం విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఒకపక్క తెలంగాణ రాష్ట్రం మిగులుబడ్జెట్ తో ఉండగా ఏపీ మాత్రం లోటు బడ్జెట్ తో మిగిలింది. అయితే ఏపీకి ఆర్ధిక సాయం అందిస్తామని చెబుతున్న కేంద్రం మాత్రం అప్పటినుండి ఇదిగో సాయం చేస్తాం.. అదిగో సాయం చేస్తాం అంటూ గడుపుతూ వస్తుంది తప్ప.. సరైన సాయం చేసింది లేదు. ఇప్పటివరకూ పావలా వంతు కూడా సాయం అందలేదు. ఇక మొదట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సర్దుకుపోయారు కానీ ఇప్పుడు మాత్రం కాస్త కేంద్రం తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నట్టు తెలుస్తోంది.  ఈనేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కారును నిలదీసేందుకు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి ఘాటుగా లేఖ రాయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. ఈ రోజు జరిగే కేబినేట్ మీటింగ్ లో దీనిపై చర్చించి ఆయన ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినేట్ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ-బీజేపీలు మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంపై సీరియస్ అయితే రెండింటి మధ్య ఉన్న మైత్రి ప్రమాందలో పడే అవకాశం ఉంది. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఒకే కారులో హరికృష్ణ, కొడాలి నాని.. ఏం విశేషం లేదన్న నాని..

  ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  విజయవాడలోని బందరు రోడ్డులో ఎన్టీఆర్ వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా హాజరయ్యాడు. దీంతో ఈ కార్యక్రమంపై మరింత దృష్టి ఏర్పడింది. హరికృష్ణతో కలిసి ఒకే కారులో వచ్చిన ఆయనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలన్నింటికి బ్రేక్ వేస్తూ నాని ముందే వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ పేరుతో నిర్మిస్తున్న ఆస్పత్రి అందుకే హాజరయ్యా.. ఇంకా మా గురువు హరికృష్ణ ఆస్పత్రికి నిధులిచ్చారు.. అంతే తప్ప దీనికి ఏ రాజకీయ ప్రాధాన్యత లేదు.. నా రాజకీయ జీవితమంతా జగన్ తోనే సాగుతుందని తెలిపారు.

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ.. 4న ప్రమాణ స్వీకారం

ఇన్ని రోజులుగా ఉన్న అనేక అనుమానాలకు బ్రేక్ పడుతూ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గత కొద్ది కాలంగా పీడీపీ-బీజేపీ పొత్తుపై పలు ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు వాటన్నింటిని తొలగిస్తూ ఏప్రిల్ 4వ తేదీన మెహబూబా ముఫ్తీ జమ్మూకాశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ ఎన్ఎన్ వోరాకు తెలిపారు. కాగా భార‌త్‌లో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న రెండో మ‌హిళగా మెహబూబా ముఫ్తీ రికార్డ్ సాధించారు. మొట్ట‌మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రి 'అన్వారా తైముర్'. ఈమె అస్సాం రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సుమారు 7 నెల‌లు విధులు నిర్వహించారు.

చిన్నారి పెళ్లి కూతురు నటి ఆత్మహత్య..

  చిన్నారి పెళ్లి కూతురు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. హిందీలో 'బాలికా వధు'.. తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగా ప్రసారమయ్యే ఈ సిరియల్ లో ప్రత్యూష బెనర్జీ ఆనందీ పాత్రలో నటించింది. అయితే  ముంబయిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి తరువాత తను పరారవ్వడం.. వేరే నటితో రిలేషన్ తో ఉండటం ఈ అనుమానాలకి దారి తీస్తున్నాయి. ఇంకా ప్రత్యూష  'బిగ్‌బాస్‌-7' రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంది.

రష్యా అధ్యక్షులు... ప్రేమలో పడ్డారు!

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి పడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్యలుద్మిలీతో 2013లో పుతిన్‌ విడాకులు తీసుకున్నప్పటి నుంచీ, ఇలాంటి వార్తలు రావడం బహుశామూడోసారి. ఒకసారి జిమ్నాస్ట్ అలీనాతోనూ, మరోసారి బాక్సర్ నటాలియాతోనూ పుతిన్‌ పీకల్లోతుప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి చైనా వ్యాపారవేత్త వెండీతో ప్రేమలో పడ్డారని గుసగుసలువినిపిస్తున్నాయి. వెండీ మరెవ్వరో కాదు! మీడియా రాజుగా పేరు పొందిన రూపర్ట్ మర్డోక్‌ మాజీ భార్య.2013లో వెండీ, మర్డోక్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కాలంలో బ్రిటన్ మాజీ ప్రధానిటోనీ బ్లెయిర్‌తో వెండీ ప్రేమ గురించి అంతర్జాతీయ పత్రికలన్నీ పుంఖానుపుంఖాలుగా కథనాలువెలువరించాయి. మరోసారి సదరు పత్రికలకు కావల్సిన సరుకు అందేట్లే ఉంది!

భారత్‌ పరాజయం.. బంగ్లా కేప్టెన్‌కు పట్టరాని ఆనందం

  ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ ఓడిపోయినంత మాత్రాన, అవతలి జట్టు మీద కసి పెంచుకోవడం ఎంతవరకు సంస్కారం! తమను ఓడించిన ఇండియా, వెస్టిండీస్‌ చేతిలో భంగపడినందుకు... ఓ బంగ్లా ఆటగాడి ప్రతిస్పందన చూస్తే విషయం మనకే అర్థమవుతుంది. ముష్‌ఫికుర్‌ రహ్మాన్‌ బంగ్లా వికెట్‌కీపరే కాదు, టెస్టు క్రికెట్‌లో ఆ జట్టుకి నాయకుడు కూడా! గత వారం భారత్‌ చేతిలో బంగ్లా జట్టు తృటిలో ఓడిపోవడంతో, రహ్మాన్ మనసు గాయపడినట్లుంది. అందుకే నిన్న వెస్టిండీస్ చేతిలో భారత్‌ పరాజయం కావడం చూసి రహ్మాన్‌కు పట్టలేని సంతోషం వేసింది. ‘ఇండియా ఓడిపోయింది. ఈ ఆనందం పట్టలేకపోతున్నాను’ అంటూ మ్యాచ్‌ ముగిసిన వెంటనే రహ్మాన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.   వెంటనే విమర్శల వెల్లువ మొదలైంది. ప్రత్యర్థులను గౌరవించడమే ఆటగాడి వ్యక్తిత్వానికి నిదర్శనం అని ఒకరంటే, అసలు బుర్ర పనిచేస్తోంద అంటూ మరొకరు మండిపడ్డారు. దీంతో రెహ్మాన్‌ చేసిన చిమ్టా పనికి క్షమాపణ చెప్పక తప్పలేదు. తన మాటలు నొప్పించి ఉంటే క్షమించమనీ, తాను వెస్టిండీస్‌ జట్టు మీద అభిమానంతోనే ఇలాంటి ట్విట్టర్‌ను పోస్టు చేశానని నీళ్లు నమిలాడు. అయినా కూడా భారతీయ అభిమానులు ఊరుకుంటారా! ఇప్పటికిప్పుడు వెస్టిండీస్ జట్టు మీద అభిమానం ఎలా పొంగుకు వచ్చిందని దులిపిపారేశారు. భారతీయ అభిమానులను రెచ్చగొడితే ఏం జరుగుతుందో రెహ్మాన్‌కు ఈ దెబ్బతో తెలిసి వచ్చి ఉంటుంది.  

భారత్ మాతా కీ జై నినాదానికి వ్యతిరేకంగా ఫత్వా..

  హెచ్ సీయూ, జెఎన్యూ వివాదాల తరువాత దేశ వ్యాప్తంగా వివాదమైన మరో అంశం ఏంటంటే భారత్ మాతాకీ జై నినాదం. ఈ నినాదంపై వివాదం ఏదో ఒక రకంగా.. ఎక్కడో చోట బయటపడుతూనే. ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని దరూల్ ఇఫ్తా దారుల్ ఉలూమ్ - డియోబంద్‌కు చెందిన ఇస్లామిక్ సెమినరీ ‘భారత్ మాతా కీ జై’ అన్న నినాదానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన మెడ మీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అని వ్యాఖ్యానించడంతో అసలు దుమారం రేగింది. అయితే దీనికి కొందరు ముస్లింల నుండి మద్దతు లభించినా.. కొందరు ముస్లింల నుండి మాత్రం వ్యతిరేకత లభించింది. ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ నినాదంపై స్పష్టత కోరుతూ లేఖలు రాశారు. 'దారుల్ ఉలూమ్‌'కు చెందిన ఇస్లామిక్ సెమినరీ మత పెద్దలు ఈ లేఖలను పరిశీలించి.. ‘భారత్ మాతా కీ జై’ నినాదానికి ముస్లింలు దూరంగా ఉండాలంటూ ఫత్వా జారీ చేశారు. ఎందుకంటే ముస్లింల పవిత్ర ఖురాన్ ప్రకారం వారికి అల్లా ఒక్కడే దేవుడు.. అయితే భారత మాత ఓ దేవతా మూర్తి కావడంతో వారు విగ్రహారాధనకు వ్యతిరేకం కాబట్టి ఈ నినాదానికి దూరంగా ఉండాలని చెప్పారు. అయితే ఈ నినాదానికి దూరం కానీ.. జాతీయత, దేశ భక్తికి తాము వ్యతిరేకం కాదని ఇస్లామిక్ సెమినరీ స్పష్టం చేసింది. మరి ఈ ఫత్యా జారీ వల్ల ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

ఈసారి ఎండలు అదిరిపోతాయి... వాతావరణ శాఖ

  ఈసారి మార్చి నుంచే మాడ్చిపారేస్తున్న ఎండలు మరింతగా ముదరనున్నాయట. ఈ విషయాన్ని సాక్షాత్తు వాతావరణ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు. అంతేకాదు! సాధారణం కంటే ఒక డిగ్రీ అదనంగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం తీరు, సముద్రం మీద ఉన్న ఉష్ణోగ్రతల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనా వేస్తున్నారట. తెలంగాణ నుంచి మొదలుకొని ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా వేడికి అదిరిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలలో కూడా మంటలు కురిపించనున్నాయట.   ఇప్పటికే 2015లో నమోదైన ఉష్ణోగ్రతలు రికార్డులను బద్దలు కొట్టాయి. 1901 తరువాత అధిక ఉష్ణోగ్రతలు కలిగిన ఏడుగా మూడో స్థానంలో నిలిచాయి. 2016 కూడా ఇందుకు భిన్నంగా ఉండకపోవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి విపరీత వాతావరణానికి కారణం ఎల్‌ నినో ప్రభావం అని కొందరు చెబుతుంటే, గ్లోబల్ వార్మింగ్‌ వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఎండాకాలం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త వహించాలన్నది పెద్దలందరూ కలిసి చెబుతున్నమాట.

జగన్ ఇప్పుడైనా మారుతాడో.. లేదో..?

  జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నేను పార్టీ మారాకైనా వైఎస్సార్సీపీ అధినేత జగన్ లో మార్పు వస్తుందని భావిస్తున్నాను’ అని ఆయన అన్నారు. ఎలాంటి పదవులకు ఆశించి నేను టీడీపీలోకి వెళ్లడం లేదు.. అయినా పదవులు నాకేం కొత్తకాదు.. ఎన్నో పదవులు నా చేతి దగ్గర వరకూ వచ్చి పోయాయి తెలిపారు. అంతేకాదు నేను టీడీపీలోకి చేరలానుకోలేదు.. ప్రజలే నన్ను ఆ పార్టీలోకి తీసుకెళుతున్నారు అని చెప్పుకొచ్చారు. వైసీపీ పార్టీ ఇంకా రాజకీయ పరిణతి చెందలేదు..  ఆ పార్టీలో సమష్టి ఆలోచనలు, నాయకత్వం లేదని ఎద్దేవ చేశారు. మరి ఆయన చేసిన వ్యాఖ్యలకు జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

బీహార్లో మద్యనిషేధం... భారీగా తాగిన జనం

  బీహార్లో నేటి నుంచి దేశవాళీ మద్యాన్ని అమ్మరాదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధాన్ని విధించింది. దీంతో ఇప్పటివరకూ పేరుకుపోయిన సదరు సరుకును వదిలించుకునేందుకు, అక్కడి మద్యం షాపులు భారీ రాయితీలతో మద్యాన్ని అమ్మివేశాయి. సారాయి పొట్లాలనైతే మరీ వక్కపొడి అమ్మినట్లు అమ్మేశారు వ్యాపారస్తులు. ఈ రాయితీని అందిపుచ్చుకున్న జనం నిన్న ఒక్కరోజే విచ్చలవిడిగా మద్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. నేటి నుంచి మద్య నిషేదం అమలులోకి రావడంతో చివరిసారిగా మద్యాన్ని తాగుదామని కొందరు, ఇంట్లో దాచుకునేందుకు కొందరు విపరీతంగా కొనుగోళ్లు చేశారట. మరోవైపు దేశవాళీ సరుకుని నిషేధించి, విదేశీ మద్యాన్ని మాత్రమే అనుమతించడంపై నితీశ్ ప్రభుత్వం మీద విమర్శలు చెలరేగుతున్నాయి.   ఈ మద్యనిషేధం పేదవారికి మాత్రమే కానీ, ధనికులకు కాదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల పేదవారు మరింత ఖర్చు చేసి మద్యాన్ని కొనుగోలు చేస్తాడని, లేదా కల్తీ సారాయి తాగి అనారోగ్యం పాలవుతాడనీ అభిప్రాయపడుతున్నారు. కానీ నితీశ్‌ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. విదేశీ మద్యాన్ని కూడా ఎక్కువ రోజులు అనుమతించబోమని, దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. నితీశ్‌ సంకల్పం అయిత బాగానే ఉంది. అది సక్రమంగా అమలు జరగాలన్నదే దేశం కోరిక! అదే కదా అసలు సమస్య!

T20 ఫైనల్స్‌లోకి- వెస్టిండీస్ మహిళల జట్టు కూడా!

  వెస్టిండీస్‌కు నిన్నటి రోజు బాగా కలిసివచ్చినట్లుంది. ఇటు మహిళల జట్టు, అటు పురుషుల జట్టు కూడా, టి20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లోకి దూసుకుపోయాయి. 2009 నుంచి మహిళలకు కూడా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకూ విండీస్‌ మహిళలు పేలవంగానే ఆడుతూ వచ్చారు. కానీ ఈసారి తాము కూడా పురుషుల జట్టుకు ఏమాత్రం తీసిపోమంటూ సత్తా చాటుతున్నారు. నిన్న కూడా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 143 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిలిపింది.   ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో న్యూజిలాండ్ ఆది నుంచి తడబడుతూనే ఉంది. చివరికి 8 వికెట్లను కోల్పోయి 137 పరుగుల వద్ద చేతులెత్తేసింది న్యూజిలాండ్‌. ఇక ఆదివారం నాడు జరగనున్న ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ మహిళల జట్టు, ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత మూడు సందర్భాల నుంచి టి20 మహిళల కప్‌ను చేజిక్కించుకుంటున్న ఆస్ట్రేలియా తన రికార్డుని పదిలంగా ఉంచుకుంటుందో... దూకుడు మీద ఉన్న వెస్టిండీస్‌ ముందు తలవంచుతుందో చూడాలి! ప్రస్తుతానికైతే ఒకేరోజు అటు పురుషుల జట్టు, ఇటు మహిళల జట్టు కీలక విజయాన్ని సాధించడం, వెస్టిండీస్‌ క్రికెట్ చరిత్రలో ఓ సుదినం అంటూ అక్కడి క్రీడాశాఖ మంత్రి గ్రాంజ్ తెగ పొగిడేశారు.

క్రికెట్ బెట్టింగ్ పై దావూద్ జోస్యం..

  టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా నిన్న వెస్టిండీస్ కు భారత్ కు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గురించి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జోస్యం చెప్పారంట. దావూద్ కి ఈ మ్యాచ్ కి సంబంధం ఏంటనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. దావూద్ ఇబ్రహీం క్రికెట్ మ్యాచ్‌ల పైన బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు అది తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే నిన్న జరిగిన మ్యాచ్ పైన కూడా ఆయన బెట్టింగులకు పాల్పడ్డాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బాగా ఆడతాడని.. విరాట్ కంటే ఎక్కువ ఆడతాడని..  సెమీ ఫైనల్లో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ చెలరేగి ఆడినా విజయం మాత్రం ధోనీ సేనదేనని జోస్యం చెప్పాడు. కానీ దావూద్ చెప్పిన జోస్యం మాత్రం ఫలించలేదు. వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిపోవడమే కాకుండా రోహిత్ కూడా విరాట్ కంటే మెరుగ్గా ఆడలేకపోయాడు. మొత్తానికి బెట్టింగ్ రాజా ఆయిన దావూద్ కే ఇండియా టీమ్ షాకిచ్చింది.

జగన్ కు ఊరట.. ఇక కోర్టుకు వెళ్లేపనిలేదోచ్..

ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్న జగన్ కు కాస్త ఊరటనిచ్చే విషయం ఒకటి చోటుచేసుకుంది. అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సీ ఉండేది. అయితే ఇక హాజరు కావాల్సిన అవసరం లేదంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. అక్రమాస్తుల కేసులో జగన్ కు ప్రస్తుతం హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యే కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతోంది.  ఈ విచారణకు జగన్ తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు చెప్పింది. దీంతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. అయితే దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న తాను అనేక కీలక బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపునిచ్చింది. పాపం ‘ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కాల్సిన మీరా?... మాకు చెప్పేది’’ అని ఎద్దేవ చేసే ప్రతిపక్షాలకు ఇకనుండి ఆఛాన్స్ లేకుండా పోయిందా..

25 మందికి చేరిన కోల్ కతా ఫ్లై ఓవర్ మృతులు

  పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికి 25 మందికి చేరింది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై మమతాబెనర్జీ స్పందించి మృతులకు సంతాపం తెలిపారు. అంతేకాదు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేస్తున్న హైదరాబాదుకు చెందిన ఐవీఆర్సీఎల్ నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని తెలుస్తుండటంతో.. సదరు కంపెనీపై మమతా బెనర్జీ సర్కారు కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు  కోల్ కతాలోని కంపెనీకి చెందిన మూడు కార్యాలయాలను సీజ్ చేశారు. కార్యాలయాల్లో ముమ్మరంగా సోదాలు చేసిన తర్వాత పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.