మాల్యాకు ఈడీ ఝలక్.. ఏప్రిల్‌ 9లోగా హాజరవ్వాలి

  బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా తాను ఇప్పుడే (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌)ఈడీ ముందు హాజరు కానని.. మే నెల వరకూ గడువు కావాలని కోరారు. ఈరోజు ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించినా.. తాను మాత్రం మే వరకూ గడువు కావాలని కోరారు. కానీ ఈడీ మాత్రం ఏప్రిల్‌ 9లోగా తమ వద్ద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది.   బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి గుట్టు చప్పుడు కాకుండా దేశం వీడిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్ప‌టికే మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాకు సమన్లు జారీ చేసిన‌ట్లు ఈడీ అధికారులు తెలిపారు.

రోజాకు ఫైనల్ గా మరో అవకాశం..

  వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఏపీ అసెంబ్లీ  ప్రివిలేజ్ క‌మిటీ మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఆరో తేదీన కమిటీ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కాగా గతంలో రోజాకు నాలుగుసార్లు నోటీసులు జారీ చేసిన ఆమె పలు కారణాలతో గైర్హాజరైంది. రోజా కూడా తనకు మరో 15 రోజులు సమయం కావాలని లేఖ రాశారు. గతంలో ఎన్నిసార్లు పిలిచినా ఆమె కమిటీ పిలుపును లెక్కచేయలేదనీ, కనుక ఆమె విన్నపాన్ని ఈ సారి పరిగణనలోనికి తీసుకోవాల్సిన పనిలేదని అభిప్రాయపడినా..రోజాకు మరో అవకాశం ఇస్తూ నోటీసులు జారీ చేసింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

మరో వివాదానికి ఆర్ఎస్ఎస్.. జనగణమణ అసలైన జాతీయగీతం కాదు

  చూడబోతే ఆరెస్సెస్ ఒక వివాదం తరువాత మరో వివాదానికి తెర తీస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఆరెస్సెస్ చీఫ్‌ మోహ‌న్ భ‌గ‌వ‌త్ భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని తెర పైకి తీశారు. దీనిపై రేగుతున్న దుమారం అంతా ఇంతాకాదు. ఇప్పటికీ ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి కూడా మరో వివాదానికి పునాది వేస్తున్నట్టు కనిపిస్తోంది. ముంబైలో దీన దయాళ్ ఉపాధ్యాయ రీచ్ సంస్థలో మాట్లాడుతూ..ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలైన జాతీయగీతం జనగణమణ కాదని, వందేమాతరమే అసలైన జాతీయ గీతమని అన్నారు. అంతేకాదు దానికి వివరణ కూడా ఇచ్చారు ఆయన. రాజ్యాంగం ప్రకారం జనగణమణ ఉంది కాబట్టి దాన్నే మనం కూడా పరిగణనలోకి తీసుకోవాలని.. జనగణమణ ఎప్పుడో రాశారని, కానీ అందులో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని భయ్యాజీ జోషి అన్నారు. వందేమాతరంలో మాత్రం దేశ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారని పేర్కొన్నారు. ఈ రెండింటి మధ్య తేడా ఇదేనని, రెండింటినీ గౌరవించాల్సిందేనని ఆయన తెలిపారు. మరి ఈవిషయంపై ఎలాంటి రగడ జరుగుతుందో చూడాలి.

కోల్ కతా ఘటనా స్థలిలో రాహుల్ గాంధీ.. ఫొటోలు దిగడానికే వచ్చారా..?

  పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికి పైగా చనిపోగా.. ఇంకా చాలామందికి గాయాలయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘటనా స్థలాన్ని ఈ రోజు సందర్శించారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ప్రమాదం జరిగి ఇప్పటికీ రెండు రోజులవుతుంటే రాహుల్ ఇప్పుడు తీరిగ్గా వచ్చి పరామర్శిస్తున్నారు.. కేవలం ఫొటోల కోసమే రాహుల్ వచ్చాడని.. త‌న ఉనికిని చాటుకోవ‌డానికి ఇటువంటి సంఘ‌ట‌న‌లు 'లైఫ్‌లైన్'లుగా వాడుకుంటున్నార‌ని ఎద్దేవ చేశారు. అంతేకాదు అప్ప‌ట్లో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం ఈ కాంట్రాక్టును బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు అప్పగించిందని.. దీనిపై రాహుల్ ఎందుకు ప్రశ్నించడంలేదని.. ఎందుకంటే ఇప్పుడు అదే సీపీఎంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని అందుకే రాహుల్ ఈ విషయంలో ఏం మాట్లాడటంలేదని మండిపడ్డారు. మరి దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రత్యూష, రాహుల్ తాగి కొట్టుకునేవారా..?

  చిన్నారి పెళ్లి కూతురు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు మరోవైపు ఆమె వ్యవహార శైలిపై పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ముంబైలోని ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే ప్రత్యూష, రాహుల్ గురించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు వచ్చిన మొదట్లో చాలా అన్యోన్యంగా కనిపించేవారని.. తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని.. వారిద్దరూ తాగి రోజూ కొట్టుకునే వారని వారు చెప్పారు. అంతేకాదు ఆమె నుదుటున సింధూరం ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో ఆమెకు పెళ్లిందయిదా అనే సందేహాలు  వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

నిలిచిపోనున్న సిగిరెట్‌ ఉత్పత్తులు

  ఏప్రిల్‌ 1 నుంచి ఉత్పత్తి చేసే సిగిరెట్‌ ప్యాకెట్ల మీద కనీసం 85 శాతం వరకు కనిపించేలా హెచ్చరికలు ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశంతో మండిపడుతున్న సిగిరెట్ కంపెనీలన్నీ నిరవధికంగా తమ ఉత్పత్తులను నిలిపివేయనున్నట్లు సమాచారం. ప్యాకెట్ల మీద అంతేసి హెచ్చరికలను ప్రచురించడం వల్ల, నకిలీ ఉత్పత్తులకు ఊతం ఇచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు ఉత్పత్తిదారులు.   ఉత్పత్తి నిలిపివేత వల్ల పొగాకు పరిశ్రమకు రోజుకి 350 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పైగా పొగాకు ఉత్పత్తి మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. భారతదేశంలో అత్యధికంగా సిగిరెట్లను ఉత్పత్తి చేస్తున్న ఐటీసీ, గాడ్‌ఫ్రే వంటి సంస్థలు సైతం ఈ నిరసనలో పాలు పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సిగిరెట్‌ ప్యాకెట్ల ముందు వైపు 40 శాతం వరకు ఈ హెచ్చరికలు ఉండాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను 50 శాతానికి పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించినప్పటికీ, కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం 85 శాతానికి తగ్గేది లేదంటూ ఇప్పటికే స్పష్టం చేసింది.

20వేల ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్లు.. ఏపీ కేబినెట్

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈసందర్బంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం అందిచాల్సి సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. దీనికి మంత్రులు కూడా కేంద్రం నుండి మరింత సాయం అందాలని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబు మరింత సాయంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా దశల వారీగా 20వేల ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్లు జారీ చేయాలని.. ఇంకా ఉచిత ఇసుక విధానం కొనసాగాలని కేబినెట్ నిర్ణయించింది. విజయవాడలో ఉగాది ఉత్సవాలు నిర్వహించాలని.. చంద్రబాబు కూడా 15 నుండి జిల్లాల్లో పర్యటించాలని.. ఒక్కో జిల్లాలో 2 నుండి 3 రోజులు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.

బీహార్లో జరిగిందే రిపీట్‌ అవుతుందీ... రాహుల్‌

  అసోంలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ బడాబడా నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తే, ప్రస్తుతం రాహుల్‌గాంధి ప్రచారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అసోంలో గత పదిహేనేళ్లుగా ఉన్న తరుణ్‌ గొగోయ్‌ ప్రభుత్వాన్ని ఈసారి కూడా గెలిపించాలని రాహుల్ పట్టుదలగా ఉన్నారు. అందుకే అక్కడి ప్రచారంలో దూకుడుగా కనిపిస్తున్నారు. బీజేపీని కనుక అసోం ప్రజలు ఎన్నుకుంటే, ఆరెస్సెస్ భావజాలం రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని అన్నారు రాహుల్. ఆరెస్సెస్ అక్కడి భాష, చరిత్ర, సంస్కృతులను తనకు అనుగుణంగా మార్చివేస్తుందని హెచ్చరించారు.   ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికి చేసింది ఏమీ లేదని. నల్లధనాన్ని రాబడతానని చెప్పి మాల్యా వంటి అవినీతిపరులను తప్పించారని విమర్శించారు. అరుణ్‌ జైట్లీ నల్లధనాన్ని పోగు చేసిన వారు తప్పించుకునే పథకాలను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రాహుల్ ప్రసంగాలు అసోం ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో మరి! ఎందుకంటే ఈపాటికే విడుదల అయిన ఒపీనియన్ పోల్స్, అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నాయి.

ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ వాంగూల్మం.. అందుకే భయపడ్డాను..

  బాలీవుడ్ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాదు ఎన్నో అనుమానాల మధ్యనే ఇది హత్యా..?లేక ఆత్మహత్యా? అని తెలుసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది హత్యే అని చెబుతున్నారు. మరికొంత మంది తన బాయ్ ఫ్రెండే ఈ హత్యా చేసి ఉంటాడని అంటున్నారు. మరోవైపు ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ మాత్రం తనకు ఏం తెలియదని చెబుతున్నాడు. ఈ కేసులో రాహుల్ రాజ్ సింగ్ వాంగ్మూలాన్ని పోలీసులు తెలుసుకున్నారు. ఈ వాంగ్మూలం ప్రకారం.. వారిద్దరూ డబుల్ బెడ్రూం ఫ్లాట్ లో ఉండేవారమని, ఈ ఫ్లాట్ కు సంబంధించిన రెండు తాళాల్లో ఒకటి ఆమె దగ్గర, మరొకటి తనదగ్గర ఉండేవని చెప్పాడు.   నిన్న ఉదయం పది గంటలకు తాను బయటకు వెళ్లానని, అప్పుడు ప్రత్యూష బాగానే ఉందని.. సాయంత్రం వచ్చి చూసే సరికి తను ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని.. చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది తానేనని.. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారని పోలీసులకు చెప్పాడు. తాను చనిపోయిందని చెప్పడంతో భయపడ్డానని.. వైద్యులే పోలీసులకు సమాచారం అందిచారని తెలిపాడు.

కేసీఆర్ ను ఆకాశానికెత్తిన కోమటిరెడ్డి.. టీ కాంగ్రెస్ లో కలకలం

  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పైటు ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన.. అందరి ప్రశంసలు అందుకున్నారు. దేశంలోనే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మొద్దమొదటి వ్యక్తిగా.. అంతేకాకుండా.. ఏకధాటిగా మూడు గంటలు ప్రసంగం చేసిన వ్యక్తిగా కూడా కీర్తి గణించారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన పపర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రతిపక్షనేతలను కూడా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ కు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సాగు నీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా బాగుందని..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రస్తావించిన అంశాలకు కార్యరూపం ఇస్తే ఇంకా బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో లక్ష ఇళ్లతో పాటు ప్రతి గ్రామానికి 50 ఇళ్లను నిర్మిస్తే... కేసీఆర్ కు ఓటేయమని తానే ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు.   అయితే కోమటరెడ్డి ప్రశంసించింది బాగానే ఉన్నా..ఆయన వ్యాఖ్యలపై టీ కాంగ్రస్ నేతల్లో గుబులు రేగుతుంది. ఇంత సడెన్ గా కేసీఆర్ ను పొగడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏ ఉద్దేశ్యంతో కోమటరెడ్డి కేసీఆర్ ను ప్రశంసించారో ఆయనకే తెలియాలి.

కేరళ కాంగ్రెస్‌లో కొట్లాట మొదలు

  ఇప్పటికే సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోయిన కేరళ కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు మరో విఘాతం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లను కేటాయించే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధీరన్‌కి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలవడం కష్టమని ఒపీనియన్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు ఏ సీటు ఎవరికి అందించాలన్న దాని మీద కూడా కొట్లాటలు మొదలయ్యయి.   తన అనునాయులకే సీట్లను అందించాలని చాందీ పట్టుబడుతుండగా, సదరు సీట్లను వేరేవారికి ఇవ్వాలని సుధీరన్‌ వాదిస్తున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సోనియాగాంధి ఇరువురితో నేతలతోనూ సమావేశం అయినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో మీలో మీరే సమస్యను పరిష్కరించుకోండంటూ, రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం. కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న ఇతర పార్టీలు కూడా ఈ వివాదం పట్ల గుర్రుగా ఉన్నాయి. పొత్తుల ప్రకారం తమకి కేటాయించాల్సిన సీట్ల గురించి కూడా కాంగ్రెస్‌ కొట్టుకోవడంతో ఆ పార్టీలు విస్తుపోతున్నాయి. మొత్తానికి కేరళ కాంగ్రెస్ నేతలు పరాజయం వైపుకి నిదానంగా అడుగులు వేస్తున్నట్లున్నారు.

ట్రంప్ కు చాలా విషయాలు తెలియదు.. ఒబామా

  వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని.. ఇలాంటి నాయకులను అమెరికా ప్రజలు ఎన్నుకోరని.. క్రమశిక్షణగల వారిని మాత్రమే ఎన్నుకోవలసిన అవసరం ఉందని, ఆ విష‌యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని ట్రంప్‌పై ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కు చాలా విషయాలు తెలియవని.. జపాన్, దక్షిణ కొరియాలతో అణు ఒప్పందాల విషయంలో అమెరికా తీరుపై ట్రంప్ కు అంతగా విషయ పరిజ్ఞానం లేదని అన్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు విదేశీ వ్యవహారాలపై మరింత అవగాహన అవసరమని ఒబామా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాలు, అణు ఒప్పందాలు రెండు వేరు వేరు విషయాలని అన్నారు. ఒక్కో దేశంతో ఓ రకమైన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భిక్షగాడికి 65 లక్షల లాటరీ!

  అనంతపురానికి చెందిన 35 ఏళ్ల పొన్నయ్య కూలి పని చేసుకుంటే బతికేవాడు. అయితే ఆ మధ్య జరిగిన ఓ ప్రమాదంలో తన కాలుని పోగొట్టుకోవడంతో, పొన్నయ్య బతుకు దుర్భరమైపోయింది. తన భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకునేందుకు ఏదో ఒక పని కోసమని పొన్నయ్య, కేరళలోని వెల్లరాడ అనే పట్నానికి చేరుకున్నాడు. అక్కడ కూడా ఏ పనీ దొరక్కపోవడంతో, బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టాడు. రోజంతా అక్కడా ఇక్కడా బిచ్చం ఎత్తుకుని, రాత్రివేళకి బస్టాండులో నిద్రపోయేవాడు. అలా పోగైన డబ్బుని ఇంటికి పంపేవాడు.   కాస్తో కూస్తో మిగిలిన డబ్బుతో లాటరీ టికెట్లను కొనుక్కునేవాడు. ఆ వ్యసనమే అతని పాలిట వరంగా మారింది. కేరళ ప్రభుత్వం నడిపే అక్షయ అనే లాటరీలో పొన్నయ్యకు 65 లక్షల రూపాయల లాటరీ తగిలింది. ఇంకా కన్సొలేషన్ బహుమతులు కింది మరో 90 వేలు కూడా దక్కాయి. దీంతో పొన్నయ్య సంతోషానికి అంతం లేకుండా పోయింది. లాటరీకి సంబంధించిన లాంఛనాలన్నింటినీ పూర్తి చేసుకుని తన ఇంటికి బయల్దేరాడు పొన్నయ్య.

మళ్లీ జయలలితదే అధికారామా..!

త్వరలో తమిళనాడు సహా.. ఇంకా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో.. ఇండియా టీవీ - సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఓ సర్వే చేపట్టాయి. అయితే ఈ సర్వేల్లో తమిళనాడులో మళ్లీ జయలలితే అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా పశ్చిమ బెంగాలో లో కూడా మమతా బెనర్జీ అధికారం చేపట్టే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. తమిళనాడులో 234 సీట్లకు గాను జయలలిత 130 స్థానాల్లో గెలుపొందనుండగా డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 70 సీట్ల వరకు వస్తాయని సర్వేలో వెల్లడైంది. విజయ్‌కాంత్ నేతృత్వంలోని మూడో కూటమి (వామపక్ష పార్టీలతో కలిపి)తో పాటు ఇతరులు 34 సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీకి  ఒక్క సీటు కూడా దక్కదని తేల్చి చెప్పింది.

పాపం.. మళ్లీ రోజాకు బ్యాడ్ లక్

  రోజాకు టైం సరిగా ఉన్నట్టు కనిపించడంలేదు. హైకోర్టు తన సస్పెన్షన్ కొట్టివేసినా ప్రభుత్వం హైకోర్టు రెండో డివిజన్ లో పిటిషన్ దాఖలు చేయగా.. ప్రభుత్వం పిటిషన్ పై కోర్టు మద్దతు తెలిపింది. అక్కడ చుక్కెదురైన రోజా.. మళ్లీ  ఈవిషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ పిటిషన్ పై విచారణ జరగలేదు. పలు పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం.. రోజా పిటిషన్ పై విచారణ జరపకుండానే ముగించారు. అయితే విచారణకు సమయం లేదని.. సోమవారం పిటిషన్ పై విచారణ జరుపుతామని చెప్పారు. మరోవైపు తన పిటిషన్ విచారణ నేపథ్యంలో రోజా నిన్న ఢిల్లీలో వాలిపోయారు. విచారణ కోసం ఆమె ఆసక్తిగా ఎదురచూశారు. కానీ సుప్రీం మాత్రం రోజాకు షాకిస్తూ సోమవారం విచారిస్తామని చాలా కూల్ చెప్పింది. మరి సోమవారం ఏం జరుగుతుందో చూడాలి.

ఈడీ మళ్లీ షాకిచ్చిన మాల్యా.. మే నెలలో చూద్దాం..

  కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు ఓ ఝలక్కిచ్చారు. విజయ్ మాల్యాకు గతంలో ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాల్సిందేనని నోటీసులు జారీ చేయగా దానికి ఆయన ఏప్రిల్ వరకూ గడువు కోరారు. దీంతో ఈడీ ఆయన విజ్ఞప్తిని మన్నించి గడువు ఇస్తూ.. ఏప్రిల్ 2వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు తాను విచారణకు రాలేనని తేల్చి చెప్పారు.  తాను విచారణకు రాలేనని, మే నెలలో అయితే చూద్దామంటూ ఈడీకి సమాచారం పంపారట. ఆశ్చర్యం ఏంటంటే.. విచారణ తేదీలను దర్యాప్తు సంస్థలు నిర్దేశించాల్సి ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం విజయ్ మాల్యానే తనకు నచ్చినట్టు తేదీలను ఖరారు చేస్తున్నారు. దీంతో ఈడీ ఆధికారులు ఏం చేయాలో తెలియక లోలోపలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కాగా వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా వేసిన విజయ్ మాల్యా ఇటీవలే నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పిన సంగతి విదితమే.

చిన్నారి పెళ్లికూతురిని హత్య చేశారా!

  చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు లోగిళ్లలో సైతం సందడి చేసిన నటి ప్రత్యూషా బెనర్జీ. ఈ నటి నిన్న ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. ప్రేమ వ్యవహారంలో విఫలమైనందుకు ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని తొలుత అందరూ భావించారు. కానీ ఈ విషయంలో ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌ సింగ్‌ మీద కొన్ని అనుమానాలు చెలరేగుతున్నాయి. ప్రత్యూషని రాహుల్‌ ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె మృతి చెంది ఉందని వైద్యులు నిర్థరించారు. అయితే ఈ సందర్భంగా రాహుల్ చాలా ప్రశాంతంగా ఉన్నట్లు వినికిడి. పైగా ప్రత్యూష మృతదేహం మీద ఉరి వేసుకున్నట్లు ఉన్న ఆనవాళ్లు చాలా బలహీనంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎవరన్నా ఉరివేసుకుని మరణిస్తే సదరు వ్యక్తి నాలుక, కళ్లు బయటకు వస్తాయని.... ప్రత్యూష శరీరం మీద ఇలాంటి గుర్తులేవీ లేవని చెబుతున్నారు. పోలీసులు అనుమానాలను మరింత బలపరిచేలా ప్రత్యూష చెంప మీద గాయం కనిపిస్తోందనీ, ఆమె నోట్లోంచి రక్తం వచ్చినట్లు కూడా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాహుల్‌తో జరిగిన పెనుగులాటలోనే ఆమె మరణించిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇది ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని ఆమె సహచర నటుడు అజాజ్ ఖాన్ కూడా ఆరోపిస్తున్నారు.