వేదికపైనే పాము కరిచి చనిపోయిన పాప్ సింగర్..

  వేదికపై ప్రదర్శన ఇస్తూనే చనిపోయేవాళ్లని చాలామందిని చూశాం. అయితే ప్రమాదవశాత్తు పాము కరిచి వేదికపై ప్రదర్శన ఇస్తూనే మరిణించింది ఓ పాప్ సింగర్. ఇలాంటి ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాప్ సింగర్ ఇమ్రా బులే అనే పాప్ సింగర్ పాటలు పాడుతూనే మధ్యలో కొండచిలువలు, నాగుపాములు వంటి విష సర్పాలను ఆడిస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే వెస్ట్ జావాలోని కారవాంగ్ గ్రామంలో ఇమ్రా ఓ ప్రదర్శన ఇస్తూ ఈ సందర్భంగా పాటలు పాడుతూ రియాంటీ అనే విషసర్పంతో విన్యాసాలు చేసింది. అలా చేస్తున్న నేపథ్యంలో పొరపాటున ఆ పాము తోకను తొక్కింది ఇమ్రా. అంతే, అది ఒక్కసారిగా బుసకొట్టి ఆమె తొడమీద కాటేసింది. అంతే ఇమ్రా అక్కడిక్కడే మరణించింది. దీంతో అప్పటివరకూ ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం కాస్త విషాదకరంగా మారింది.

భారీగా పెరిగిన ఐఐటీ ఫీజులు.. 90 వేల నుండి 2 లక్షలకు

ప్రస్తుత రోజుల్లో చదువుకుంటున్నాం అనడంకంటే.. చదువుకొంటున్నాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చదివే చదువులకు చెల్లిస్తున్న ఫీజులు అంత రేంజులో ఉంటున్నాయి. ఇప్పుడు అది కూడా చాలదన్నట్టు.. మరింత భారీగా పెంచేశారు ఐఐటీ విద్యాసంస్థలు. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 90 వేలు కాగా.. ఇప్పుడు అది కాస్తా రూ. 2 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ముందు ఈ ఫీజులను 3 లక్షలకు పెంచాలని బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవాంగ్ ఖాకర్ అధ్యక్షతన ఏర్పడ్డ ఉప సంఘం ప్రతిపాదించగా, అంత మొత్తం పెంచితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతో రూ. 2 లక్షలకు ఫీజుల పెంపు పరిమితం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఐఐటీ విద్య మరింత ప్రియమైపోయింది.

బీఎస్పీ ఎంపీ కొడుకు, భార్య అరెస్ట్.. వరకట్నం కోసం వేధించారు

  ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బీఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రివాల్వర్ తో కాల్చుకుని హిమాని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఆయన భార్యని.. కుమారుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హిమాని తల్లిదండ్రులు ఫిర్యాదు మేరుకు వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ కుటుంబ సభ్యులు హిమానిని వరకట్నం కోసం వేధించారని, ఫార్చ్యూనర్‌ ఎస్‌యూవీ కావాలని డిమాండ్‌ చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేశామని..అయితే ఆమెది హత్యా, ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉందని.. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని ఘజియాబాద్ ఎస్పీ సల్మాన్‌ తాజ్‌ తెలిపారు.

బాంబు పెట్టింది ఎవరికోసం.. చింటూ కోసమా..? లేక ఎమ్మెల్యే కోసమా..?

  చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలడంతో కలకలం రేగింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చింటూను ఈ రోజు కోర్టుకు తీసుకొచ్చిన నేపథ్యంలో బాంబు పేలడంతో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. మేయర్ దంపతుల హత్య విచారణలో భాగంగా  పోలీసులు చింటూను కోర్టుకు తీసుకొచ్చారు. అయితే చింటూ కోర్టులో ఉండగానే పేలుడు జరిగింది. ఈ ఘటనలో కోర్టు గుమాస్తా కుడికాలు తెగిపడగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఇంకా మూడు వాహనాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.   అయితే ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంతకీ ఎవరిని టార్గెట్ చేసుకొని బాంబు పెట్టారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇదే రోజు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కూడా ఓ కేసు నిమిత్తం మరికాసేపట్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఈ బాంబు పేలింది. ఈ నేపథ్యంలోనే బాంబు చింటూ కోసం పెట్టారా.. లేక మాజీ ఎమ్మెల్యే కోసం పెట్టారా అని అనుకుంటున్నారు. పోలీసులు కూడా ఇదే కోణంలో ఆరా తీస్తున్నారు. లాయర్ దుస్తుల్లో ఎవరైనా వచ్చి ఈ బాంబుని పేల్చారా? లేక కక్షిదారులే ఈ బాంబుని పేల్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు

దారుణం.. బ్లాగర్ తల నరికి.. తుపాకితో కాల్చి చంపారు

  దేశాలను గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు రాక్షసత్వానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు అతికిరాతకంగా వారిని చంపేసి అక్కసు వెళ్లగక్కుకుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు చేసేవాళ్లని చాలామందినే చంపారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోలో బ్లాగర్స్‌ హత్యల పరంపరలో మరో ఘటన వెలుగుచూసింది. నజిముద్దీన్ సమద్ అనే కుర్రాడు అత్యంత దారుణంగా చంపబడ్డాడు. వివరాల ప్రకారం.. నజిముద్దీన్ సిల్హెట్ నుంచి ఇటీవల ఢాకా వచ్చి జగన్నాథ యూనివర్సిటీలో అతను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. అయితే అతనిపై నలుగురు దాడి చేసి ఒకడు కత్తితో అతని తల నరికేయగా, మరొకడు పిస్టల్‌తో కాల్చి చంపారు. దీంతో నజిముద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే నజిముద్దీన్ తన ఫేస్ బుక్ లో దేశం గురించి.. చట్టాల గురించి.. ఇస్లామిక్ గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతనిని చంపారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా దీనిపై ఇంతవరకు బాధ్యత ప్రకటించుకోలేదని ఢాకా మెటోపాలిటన్ డీసీపీ సయెద్ నురుల్ ఇస్లాం తెలిపారు.   ఇందిలా ఉండగా వరుస బ్లాగర్ల హత్యలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. 2013 ఫిబ్రవరి 5న రాజిబ్ హైదర్‌ అనే సెక్యులర్ బ్లాగర్‌ను ఆయన ఇంటికి సమీపంలోనే దారుణంగా హతమార్చారు. 2015లో మరో నలుగురు బ్లాగర్లు అవిజిత్ రాయ్‌, వశీకర్ రహ్మన్ బాబు, అనంత బిజోయ్‌, నీలోయ్‌ ఛటర్జీలను అతి కిరాతకంగా చంపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. వారానికి ఐదు రోజులే

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాదు.. కేవలం.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలివచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. గతకొంత కాలంగా సచివాలయ ఉద్యోగులు వారానికి ఐదురోజులు మాత్రమే పనిదినాలు ఉండాలని కోరుతున్నారు. దీంతో దీనిపై చర్చించి ఏపీ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. జూన్ నెలకల్లా వీరంతా ఏపీకి తరలివస్తారు కాబట్టి అప్పటి నుండి ఈ వారానికి ఐదు రోజులపాటు పనిదినాల వెసలుబాటు కల్పించనున్నారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనివిధాలా చర్యలు చేపట్టిందని అన్నారు.. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంతో పాటు ఉద్యోగుల పిల్లలకు స్థానికతను వర్తింపజేయాలన్నవిజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కేంద్రానికి సీఎం లేఖ రాస్తారని మంత్రి వెల్లడించారు.

ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ కు షాక్.. కేసును వాదించనన్న లాయర్

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రోజుకో అంశం వెలుగుచూస్తుంది. ఇక ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ పై రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. ఇప్పటికే రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న రాహుల్ కు షాకిచ్చాడు అతని తరపు లాయర్. ఈ కేసులో భాగంగా తనకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోర్టుకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో, కేసును తాను వాదించబోనంటూ న్యాయవాది నీరజ్ గుప్తా స్పష్టం చేశారు. ఇంకా అతను ఈ కేసులో రాహుల్ నిజాలను దాస్తున్నాడని, తనకు అన్ని విషయాలనూ చెప్పడం లేదని ఆరోపించారు. కాగా రాహుల్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పై నేడు విచారణ జరుగనుంది.

తాను ఇచ్చిన స్టేట్ మెంట్ పై మోహన్ బాబు నిలబడతాడా..?

  సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రీఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో చర్చలు ఎక్కువయ్యాయి. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని.. తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ సన్నిహితులేనని.. అయితే తాను ఏ పార్టీలో చేరుతానన్న విషయం మాత్రం త్వరలో చెబుతానని తన పుట్టిన రోజునాడు చెప్పారు మోహన్ బాబు. అయితే తాను అలా చెప్పాడో లేదో.. అప్పటినుండి ఆయన ఏపార్టీలోకి చేరుతారబ్బా అని ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు.   అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ.. ఆతరువాత కాస్తో కూస్తో బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీనే. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కూడా అయితే టీడీపీ లేదా.. వైసీపీలో మాత్రమే చేరే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల్లోనే ఏ పార్టీలో చేరుతారన్నది ప్రధాన చర్చ. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీలో ఉన్న మోహన్ బాబు ఆ తరువాత.. అదే పార్టీనుండి రాజ్యసభనుండి కూడా ఎన్నికయ్యారు. ఇక ఆతరువాత టీడీపీ నుండి బయటకు వచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా అనగానే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   మరోవైపు మోహన్ బాబు వైసీపీలో చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ మోహన్ బాబుకి జగన్ తో మంచి సత్సంబంధాలే ఉన్నాయి.. ఇంకా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెతో తన పెద్ద కుమారుడు విష్ణుకు వివాహం జరిగింది కాబట్టి ఆపార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు అని రాజకీయ పెద్దలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ముద్రగడ కాపు గర్జన సందర్భంగా ముద్రగడ పద్మనాభాన్ని విష్ణు కలిసినందుకుగాను ఆయన వైసీపీలో చేరుతారేమో అన్న పలు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలను బట్టి తాను టీడీపీలోనే ఉంటారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు చేయడమంటే ఎంగిలి మెతుకులు తిన్నంత పని అని అన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు తాను గతంలో ఉన్న పార్టీలోనే కొనసాగుతారు.. వైసీపీలో చేరరు అని అంటున్నారు. మరి ఇన్ని అనుమానాలకు బ్రేక్ వేస్తూ మోహన్ బాబు ఏపార్టీలో చేరుతారో.. సైకిలెక్కుతారో.. లేక ఫ్యాన్ ఎక్కుతారో తెలియాలంటే ఆగాల్సిందే.

ఏం చేస్తే ట్రైన్ ఆగుతుంది..దొంగల కొత్త రాబరీ స్కెచ్

  దొంగలు ఆప్‌డేట్ అవుతున్నారు..ఇంతకు ముందు ట్రైన్‌లలో దొంగతనాలు చేయాలంటే ప్యాసింజర్లలాగా రైలెక్కి  తర్వాత ఏ అటవీ ప్రాంతంలోనే చైన్ లాగి బీభత్సం సృష్టించి అందినకాడికి ఊడ్చుకెళ్లేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వారు కూడా తెలివి మీరుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద జరిగిన రైలు దొపిడీ. ట్రైన్ నడవడానికి ఆయువు పట్టైన సిగ్నల్ వ్యవస్థపై దొంగలు ఫోకస్ చేశారు. సిగ్నల్ పనిచేయకపోతే రైలు దానంతట అదే ఆగుతుందని తెలుసుకున్నారు.   కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ వెళ్తున్న బసవ ఎక్స్‌ప్రెస్‌ను దోచేయడానికి స్కెచ్ గీశారు. గార్లదిన్నెను దోపిడి స్పాట్‌గా డిసైడయిన దొంగలు అక్కడికి సమీపంలోని సిగ్నల్ వైర్లు కట్ చేశారు. యమస్పీడుగా వస్తున్న బసవ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌ సిగ్నల్ పనిచేయకపోవడం గమనించి ట్రైన్ ఆపారు. ఇంకేముంది బండి ఆగడం ఆలస్యం దొంగలు ఖుషీ చేసుకుంటూ ప్రయాణికుల కోచ్‌ల్లోకి చొరబడి రెచ్చిపోయారు. కత్తులతో బెదిరిస్తూ అందినకాడికి దోచుకున్నారు. తమ కొత్త ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో దొంగలు పండగ చేసుకుంటుండగా..దొంగల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

శ్రీనగర్ నిట్.. తెలుగు విద్యార్ధుల కష్టాలు.. ఉండలేకపోతున్నాం..

  టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ అయిపోయింది. వెస్టిండీస్ కప్ గెలిచింది. కానీ సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిన నేపథ్యంలో మొదలైన అల్లర్లకు మాత్రం ఇంకా బ్రేక్ పడలేదు. ఈ గొడవలు కాస్త శ్రీనగర్ నిట్ వరకూ చేరారు. అయితే అల్లర్లో అందరి సంగతేమో కానీ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు మాత్రం అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు సంగతేంటంటే.. టీ 20 వరల్ట్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే క్యాంపస్లో పాక్ జెండాలతో.. భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానిక విద్యార్దులకు.. స్థానికేతర విద్యార్ధులకు మధ్య ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలతో క్యాంపస్ అట్టుడికిపోవడంతో గత శుక్రవారం క్యాంపస్ ను మూసేశారు. తిరిగి మంగళవారం తెరిచారు. అయినా, ఉద్రిక్తతలు చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే స్థానికేతర విద్యార్థులు మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశారు. క్యాంప్‌సలోని వాతావరణం తమను తీవ్రంగా భయపెడుతున్నదని, తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని అనుకొంటున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్ధులు స్వస్థలాలకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు పెద్ద ఎత్తున వారిపై దాడి చేసి.. లాఠీఛార్జ్ కూడా చేయడంతో దాదాపు 50 మందికి పైగా గాయాలయ్యాయి.     మరోవైపు శ్రీనగర్ లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రక్షణ కరువైందని ఆరోపణలు వెల్లువెత్తాయి.శ్రీనగర్‌ నిట్‌ క్యాంపస్‌లో స్థానికేతర విద్యార్థులపై లాఠీచార్జ్‌పై కేంద్రం సీరియస్‌ అయింది. ఈ ఘటనపై విచారణ జరపాలని జమ్మూకశ్మీర్‌ సీఎంకు కేంద్ర హోంమంత్రి సూచించారు. నిట్‌ క్యాంపస్‌లో భారీగా బలగాలను మోహరించారు. శ్రీనగర్‌ నిట్‌ క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి చెప్పారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అంతేకాదు పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ను ఆదేశించారు.  కాగా మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. వీరిలో అమ్మాయిలు కూడా ఉన్నాయి.  

ఎల్‌కే అద్వానీకి సతీ వియోగం..

  బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి సతీ వియోగం కలిగింది. ఎల్‌కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. చాలాకాలంగా కమలా అద్వానీ వీల్‌చైర్‌పైనే ఉంటున్నారు. అంతేకాదు ఆమె మతిమరుపుతో కూడా సతమతమవుతున్నారు. ఈనేపథ్యంలోనే నిన్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1965లో వివాహమైన అద్వానీ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.     మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని మోడీ కమల అద్వానీ మృతి పట్ల సంతాపం తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా అంత్యక్రియలను  గురువారం సాయంత్రం 4 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నారు.

'వాడెబ్బ' అన్న జేసీ.. జగన్ కు సారీ

ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జేసీ బ్రదర్స్ నైజం. అవతలి వ్యక్తి ఎవరైనా సరే.. తమకు ఏది అనిపిస్తే అది.. ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని జేసీ దివాకర్ రెడ్డి మొదటి సారి సారీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే.. జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డ్యామ్‌కు గండి పడిందని, నీళ్లు నిలిచే పరిస్థితి లేదని.. వెల్లువలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలోకి వస్తారని ఆయన అన్నారు. తండ్రిని చూపడం కాదు, తానేమిటో జగన్ నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అయితే ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే జగన్‌ను 'వాడెబ్బ' అంటూ జెసీ సంభోదించి నోరు జారారు. దీంతో గమనించిన జేసీ వెంటనే సారీ సారీ సారీ అంటూ, దాదాపుగా లెంపలేసుకున్నంత పని చేశారు. మా వాడు అన్న భావనతోనే అన్నాను తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదని, జగన్ దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని, మీడియా మిత్రులూ... మీరు కూడా తప్పుగా రాయవద్దని కోరారు. మొత్తానికి మొదటిసారి జేసీ దివాకర్ రెడ్డి సారీ చెప్పారు. మరి దీనికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీదున్న గౌరవమా లేక జగన్ అంటే భయమా.. ఆయనకే తెలియాలి

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు కోర్టు ఆదేశం.. వేరే ఎక్కడైనా ఆడుకోండి..

  టీ 20 ప్రపంచ కప్ ఫీవర్ అయిపోయింది. ఇప్పుడు అభిమానులకు ఐపిఎల్ ఫీవర్ పట్టుకుంది. అయితే ఈ ఐపిఎల్ గురించి అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో ఒక్క మహారాష్ట్రం మాత్రం తమ రాష్ట్రంలో ఐపిఎల్ నిర్వహించొద్దని తేల్చిచెప్పింది. ఈనేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రజలు ఇప్పటికే నీటితో కటకటలాడిపోతుంటే ఐపీఎల్ మ్యాచ్ ల కోసం పిచ్ ల తయారీ, ఇతర అవసరాలకోసం నీటిని వృధా చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. మహారాష్ట్ర ప్రజలకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఇప్పటికే నీటి సమస్యతో ఉన్న మహారాష్ట్ర ప్రజలపై తాము కూడా సానుభూతితో ఉన్నామని..  వీలైతే నీళ్లు ఉన్నటువంటి వేరే ప్రాంతాలకు మ్యాచ్ లను తరలించమని హైకోర్టు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు సూచించింది. అయితే దీనికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఈ మ్యాచ్ ల కోసం తాము కొనుగోలు చేసి ఉపయోగించనున్న నీరు త్రాగటానికి పనికొచ్చేది కాదని కోర్టుకు తెలిపింది.  అయినా కూడా కోర్టు సంతృప్తి చెందలేదు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

డ్రైవర్‌లేకుండా మెట్రో రైలు.. పట్టాలెక్కేందుకు సిద్ధం

దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుకు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించిన సంగతి తెలసిందే. ఇప్పుడు మరో సరికొత్త రైలు పట్టాలెక్కనుంది. డ్రైవర్‌లేకుండా నడిచే మెట్రో రైలు దిల్లీలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ‌(డీఎంఆర్‌సీ) ఈ రైలును ప్రవేశపెట్టనుంది. పలు ఆధునిక ఫీచర్లతో ఈ ఏడాది చివరికల్లా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు డీఎంఆర్‌సీ తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన భాగాలను దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ నుంచి తెప్పించింది. ఇంకా ఈ రైలులో సీసీటీవీ, యూఎస్‌బీ పోర్ట్‌లతో పాటు పలు సదుపాయాలు ఉంటాయి.

సీలింగ్ ఫ్యాన్లు తీసేస్తే ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గుతాయా?

చిన్నారి పెళ్లికూతురు ఫేం ప్ర‌త్యూష బెన‌ర్జీ ఆత్మ‌హ‌త్య‌తో యావ‌త్ దేశం మ‌ళ్లీ ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చించుకుంటోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. ఇలాంటి విష‌యాల్లో ముందుండే బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించడానికి త‌న‌దైన స్టైల్లో సూచ‌న‌లు చేసింది. మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించాలంటే ముందు ఇళ్ల‌లో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాల‌ని కోరింది. ఈ విష‌యాన్ని మీడియా ముఖంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి విజ్ఞ‌ప్తి చేసింది. కూతుళ్లు, సోద‌రీమ‌ణులు, కోడ‌ళ్లు సీలింగ్ ఫ్యాన్ల‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని వీటికి బ‌దులు టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి అంటూ సూచించింది. అయినా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల‌నుకునే వారికి సీలింగ్ ఫ్యాన్లు ఒక్క‌టేనా ప్రాణం తీసుకోవడానికి బోలెడన్నీ మార్గాలున్నాయి.