చిత్రహింసలు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య..

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య విషయంలో రోజుకో అంశం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు పోలీసులు. ప్రత్యూష శరీరంపై ఆమెను చిత్రహింసలకు గురి చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, ఈ క్రమంలో సదరు చిత్రహింసలు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు.  అంతేకాక ఈ విచారణకు సాక్షులుగా హాజరైన పలువురు కూడా ఇదే వాదనను వినిపించారు. నిత్యం ప్రత్యూష, రాహుల్ ల మధ్య వాగ్వాదం జరిగేదని కోర్టుకు తెలిపారు. ప్రత్యూషను మానసికంగానే కాక శారీరకంగానే రాహుల్ బాధ పెట్టేవాడని కూడా వారు పేర్కొన్నారు. దీంతో కోర్టు రాహుల్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా రాహుల్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అతని తరపు లాయర్ కూడా తాను కేసు వాదించనని.. రాహుల్ ఇంకా కొన్ని విషయాలు తనకు చెప్పకుండా దాస్తున్నాడని అన్నాడు.

షార్టులు వేసుకురావద్దన్న ప్రొఫెసర్.. మరుసటి రోజు అమ్మాయిలందరూ షార్టుల్లో

  ఈ మధ్య కాలంలో యూనివర్శిటీల్లో ఏదో ఒక వివాదంపై ఏదో ఒక రగడ జరుగుతూనే ఉంది. హెచ్ సీయూ, జెఎన్యూ, రీసెంట్ గా శ్రీనగర్ నిట్ తాజాగా బెంగళూరులోని లా యూనివర్శిటీలో మరో వివాదానికి తెర పడింది. ఈయూనివర్శిటిలో విద్యార్థినులకు, ప్రొఫెసర్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఒక అమ్మాయి తరగతికి షార్ట్ వేసుకొని వచ్చినందుకు ప్రొఫెసర్ సదరు విద్యార్ధినిని ఆక్షేపించారు. దీంతో ఆ అమ్మాయికి మద్దతుగా..మరుసటి రోజు తరగతి గదిలోని అమ్మాయిలందరూ షార్టులతో వచ్చారు. ప్రొఫెసర్ తీరును వ్యతిరేకిస్తూ.. తామేసుకున్న దుస్తుల గురించి కామెంట్లేంటని, తాము ఎలాంటి దుస్తులను వేసుకోవాలన్నది ఆయనకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీలో ప్రొఫెసర్ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించిన విద్యార్థినులు ఇండిపెండెంట్ కమిటీని వేసి దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ ప్రొఫెసర్ స్పందిస్తూ, తాను చేసింది మంచి పనేనని, దర్యాఫ్తునకు సిద్ధమని, విచారణలో భాగంగా ఏం అడిగినా సమాధానం చెబుతానని అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ మొట్టికాయలు.. ఆ మాత్రం తెలియదా..

  తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులచేత మొట్టికాయలు తినడం అలవాటే. ఈసారికూడా సుప్రీం చేతిలో మొట్టికాయలు తినే పరిస్థితి వచ్చింది. ఇరు రాష్ట్రాలు విడిపోయిన తరువాత పలు శాఖలకు సంబంధించి అనేక వివాదలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల వివాదం అయితే ఎప్పటినుండో కోర్టు చుట్టు తిరుగుతోంది. అయితే ఇప్పుడు ఏపీ స్థానికత ఉండి, తెలంగాణ విద్యుత్ విభాగంలో ఉద్యోగులుగా ఉన్న వారికి ఊరటను కలిగిస్తూ, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ, ఏపీ స్థానికతగా ఉన్న ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు వేతనాలు చెల్లించడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు తెలంగాణాలో ఉన్నంత కాలం, తెలంగాణ ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు గతంలో ఈ వ్యవహారంలో.. రెండు రాష్ట్రాలు కలిసి ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని.. బకాయిలు రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను కూడా సుప్రీం కొట్టేసి ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే, అక్కడి ప్రభుత్వమే జీతం ఇవ్వాలని, అది కూడా తెలియకుండా ప్రభుత్వం ఎలా నడుపుతున్నారని తెలంగాణ సర్కారును చీవాట్లు పెట్టింది.

అరెస్ట్ వారెంట్ పై సుజనా.. డిఫాల్ట్ కు, ఫ్రాడ్ కూ తేడా ఉంది

  కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మారిషన్ బ్యాంకు నుండి కోట్ల రూపాయలు రుణం తీసుకొని కట్టని నేపథ్యంలో బ్యాంకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు సుజనాకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన సుజనా.. తాను భారత చట్టాలను అమితంగా గౌరవించే వ్యక్తుల్లో ఒకడినని, కోర్టులను గౌరవిస్తానని.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు కోర్టుకు వెళ్లానని, తనకు సంబంధం లేని కేసు ఇదని తెలిపారు. సదరు కంపెనీలో తనకు ఒక్క శాతం కన్నా తక్కువ వాటానే ఉందని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోలేదని తాను చెప్పడం లేదని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, డిఫాల్ట్ కు, ఫ్రాడ్ కూ ఎంతో తేడా ఉందని అన్నారు. మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

85 విమానాలు.. 25 వేలమంది ప్రాణాలు గాల్లోనే

కోల్ కతా విమానాశ్రయంలో కొద్దిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదం తప్పిపోవడం వల్ల దాదాపు 25 వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అసలు సంగతేంటంటే.. కోల్ కతా విమానాశ్రయంలోని ఏటీసీ టవర్. ఇక్కడి నుండి మొత్తం 85 విమానాలు గాల్లో ఎగురుతూ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సంబంధాలు పెట్టుకుని ఉన్నాయి. వీటిలో దాదాపు 25 వేలమంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఏటీసీతో అన్ని విమానాలు ఒక్కసారిగా సంబంధాలూ తెగిపోయాయి. రాడార్లు పనిచేయడం మానేశాయి. వీహెచ్ఎఫ్ (వెరీ హై ఫ్రీక్వెన్సీ) లింకులు తెగిపోయాయి. దీంతో పది నిమిషాల పాటు అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.  ఏటీసీ సెంటర్ లో పనిచేస్తున్న 35 మంది కంట్రోలర్లు ఈ సమాచారాన్ని దగ్గరి విమానాశ్రయాలకు చేర్చేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. "ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎక్కడ ఏ అనర్థం జరుగుతుందోనని భయం. ల్యాండ్ లైన్లు కూడా పనిచేయలేదు. కానీ అదృష్టవశాత్తూ నాగపూర్, వారణాసి ఏటీసీలను కాంటాక్టు చేసి పైలట్లకు సమాచారాన్ని ఇవ్వగలిగాం" అని ఓ కంట్రోలర్ తెలిపారు. పరిస్థితి ఇంకొంచెం అదుపుతప్పినా భయంకర విమాన ప్రమాదాలు చూడాల్సి వచ్చేదని ఓ కంట్రోలర్ తీవ్ర ఆందోళన మధ్య వ్యాఖ్యానించారు.

మమతాపై మోడీ ఫైర్.. రాష్ట్రాన్ని కాపాడాలి

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ పై మండిపడ్డారు. కోల్‌కతా ఫ్లైఓవర్ కూలిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. ఇది చాల బాధాకరమైన విషయం.. కేవలం అవినీతి వల్లే కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రమాదం జరిగిందని అన్నారు. టీఎంసీ.. టెర్రర్, హత్యలు, అవినీతి సంస్థగా మారిందని..టీఎంసీ అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈ ఘటన ద్వారా దేవుడు ఓ సందేశం పంపించారన్నారు. అంతేకాదు ఘటనా స్థలాన్ని చూడటానికి వచ్చిన మమతా బెనర్జీ.. జరిగిన ప్రమాదం గురించి మాట్లాడకుండా.. రాజకీయాల గురించి మాట్లాడారని.. ఎంతసేపు ఆమె దృష్టి పదవిపైనే కానీ.. చనిపోతున్న వారు ఆమెకు కనిపించలేదు అని మోడీ విమర్శించారు.

ఇకనుండి ఐఐటీ ప్రవేశాల కోసం ఇంటర్ వెయిటేజీ రద్దు..

  జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ ఫీజులను కేంద్రం ఒక్కసారిగా అమాంతం పెంచిన సంగతి తెలిసిందే. ఏడాదికి 90 వేలు ఉన్న ఫీజును ఏకంగా రూ. 2 లక్షలకు పైగా పెంచింది. అయితే ఇప్పుడు కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్‌డీ) మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఇప్పటివరకూ అమలు చేస్తున్న ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పద్ధతి 2017 నుండి అమలుకానున్నట్టు తెలిపారు హెచ్‌ఆర్‌డీ అధికారులు.  2017 నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే నేరుగా జేఈఈ ర్యాంకులను కేటాయించనున్నట్లు.. జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలని లేదా టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వంలోకి చాగంటి కోటేశ్వరరావు

తన ప్రవచనాలతో ప్రజల్లో ఆధ్మాత్మిక చింతనను నెలకొల్పుతున్న ఉపన్యాస చక్రవర్తి,బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరుదైన గౌరవం కల్పించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చాగంటి ప్రవచనాలు తెలుగు ప్రజలను ముందుకు నడిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సమాజ హితం కోసం ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమని ముఖ్యమంత్రి కొనియాడారు.

ఎన్ఐఏ కు సాయపడింది పాకిస్థానీయులేనట..

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురు కమెండోలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులే అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చెబుతున్నా.. పాకిస్థాన్ నుండి వచ్చిన జిట్ బృందం మాత్రం అదంతా వట్టిదే అని.. అసుల ఈ దాడికి పాల్పడింది ఆ దేశానికి చెందినవారే అంటూ మాటమార్చుతున్నారు. అయితే అసలు దాడికి దిగింది పాకిస్థాన్ జాతీయులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎలా గుర్తించింది? అంత ఖచ్చితంగా పాకిస్థాన్ ఉగ్రవాదులే దాడి చేశారు అని చెప్పడానికి కారణం.. పాకిస్థాన్ కు చెందిన వారే ఎన్ఐఏ అధికారులకు ఫోన్లు చేసి ఉగ్రవాదులు ఎవరన్న విషయాలను వెల్లడించారట.   అసలు సంగతేంటంటే.. దాడి జరిగిన అనంతరం.. ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న పాక్ వంటకాల ప్యాకెట్లు, సెల్ ఫోన్ సంభాషణలు ఆధారంగా వారు పాకిస్థాన్ కు చెందిన వారని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే చనిపోయిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోలను తమ వెబ్ సైట్ లో పెట్టిన ఎన్ఐఏ... వారి గురించిన వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరింది. దీనిలో భాగంగానే.. పలు వారికి పలు దేశాలతో పాటు పాకిస్థాన్ నుండి కూడా కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఉగ్రవాదులు ఎవరన్న విషయం అధికారులకు వెల్లడించారు. కానీ పాక్ మాత్రం వాటన్నింటిని తోసిపుచ్చి మరోసారి తన కపటబుద్దిని చూపిస్తూ.. అసలు ఎన్ఐఏ అధికారులు తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని చెప్పేసింది.

శ్రీనగర్ నిట్ లో దారుణం.. తరగతులకు రాకుంటే అత్యాచారమే..

  శ్రీనగర్ లోని నిట్ లో పరిస్ధితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఇండియా ఓడిన పోయిన నేపథ్యంలో మొదలైన అల్లర్లు రోజు రోజుకి హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే నిట్ లో చదువుతున్న స్థానికేతర విద్యార్దులు తమను ఇంటికి వెళ్లనివ్వాలని.. ఇక్కడ కాకుండా వేరే చోటికి మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలా ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. వెంటనే తరగతులకు రాకుంటే, స్థానికులతో అత్యాచారం చేయిస్తామని సహ విద్యార్థినిలు బెదిరిస్తున్నారని ఇతర రాష్ట్ర అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. తమలో అభద్రతా భావం పెరిగిపోయిందని చెప్పిన బీహార్ విద్యార్థిని, తమకు న్యాయం జరిగేంత వరకూ నిరసనలు ఆపబోమని హెచ్చరించింది.

ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్న చంద్రులు

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిన్న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన చంద్రబాబుకు, కేసీఆర్ ఎదురుపడటంతో ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు గవర్నర్ ప్రసంగిస్తూ శ్రీదుర్ముఖి నామ సంవత్సరంలో తెలుగువారికి అన్ని శుభాలే కలుగుతాయని తెలిపారు. మంచి వర్షాలు కురిసి, ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల్లోని మంత్రులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.

ప్యాంట్లు వేస్తే పోటుగాళ్లు కాదు.. అసదుద్దీన్ కామెంట్స్

మెడ మీద కత్తి పెట్టినా భారత్‌ మాతాకీ జై అనను అంటు చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా వివాదానికి తెరదీసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాల తేనే తుట్టెను కదిపారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అసదుద్దీన్ తన బద్ధ శత్రువు అర్ఎస్ఎస్ పై నిప్పులు చేరిగారు. 1952లో ఏర్పాటైన ఆర్ఎస్ఎస్ అప్పుడు నిక్కర్లతో ఏర్పాటై..ఇప్పుడు ప్యాంట్లు వేసుకుందని, నిక్కర్లు వదిలి ప్యాంట్లు వేసుకున్నంత మాత్రన వారు పెద్దమనుషులు అవ్వలేరని ఆరోపించారు.ఎంఐఎం మతతత్వపార్టీ కాదని..మస్లిం, దళిత సోదరుల పార్టీ అన్నారు. తమను మతతత్వ పార్టీగా చిత్రీంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని అసుదుద్దీన్ అన్నారు.

రోజా సస్పెన్షన్ పై అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు..

  వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీలో జరిగే వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని.. ఆహక్కు కోర్టులకు లేదని తెలిపారు. దీనికి రోజా తరపు న్యాయవాది అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవన్నది నిజమే అయినా..  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే జోక్యం చేసుకునే హక్కు ఉందని వాదించారు. దీంతో సుప్రీం ఏకీభవించి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ.. ఆలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మాల్యా పై మండిపడ్డ సుప్రీం.. ఇండియాకు ఎప్పుడు వస్తారంటా..

  కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి.. ఆతరువాత సెప్టెంబర్ లోగా 4వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కడతానని కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాల్యా వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు మండిపడింది. మాల్యా ఇచ్చిన ఆఫర్ కు బ్యాంకులు అసంతృప్తిగానే ఉన్న నేపథ్యంలో కన్సార్టియం స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సుప్రీం అసలు మాల్యా ఎప్పుడు ఇండియాకు రావాలని అనుకుంటున్నారని అడిగింది. ఈనెల 21లోగా, ఆయన ఆస్తిపాస్తుల వివరాలన్నీ కోర్టుకు అందించాలని ఆదేశించింది. నగదును డిపాజిట్ చేయమంటే ఏ మేరకు డబ్బు కట్టగలరో తెలపాలని కోరుతూ కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.

ఈ రైలు మనుషులకి కనిపించదు

  జపాన్ దేశీయులు ఏం చేసినా అందరికంటే విభిన్నంగా చేస్తారు. బుల్లెట్ రైలు, రోబోలు ఇలా ఏం చేసినా సరే అది ఒక విచిత్రమే. తాజాగా వారు మరో ప్రయోగాన్ని చేశారు. అదే కనపడని రైలు. సాధారణ రైళ్లలాగా ఇది కంటికి కనిపించదు. సెయిబ్ గ్రూప్ వందో వార్షికోత్సవం సందర్భంగా ఆ కంపెనీ వాళ్లకి  వెరైటీ ఆలోచన వచ్చింది. ఐడియా తట్టిందే తడవుగా ప్రముఖ ఆర్కిటెక్ట్ కజుయో సెజిమాను సంప్రదించడంతో వారు ఈ ట్రైన్‌ను రూపొందించారు. ఈ రైలు కనిపించకుండా ఉండేందుకు బోగీలన్నింటికీ ఒక సెమీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేశారు. దాంతో అది వస్తున్నట్టుగానే కనిపించదు.   దాదాపుగా లివింగ్ రూమ్‌లో ఉండే సౌకర్యాలతో ఒక డిజైన్ కావాలని సెజిమాను ఆ గ్రూప్ కోరింది. దాంతో ఈ సరికొత్త డిజైన్‌ను ఆయన తయారు చేయగా, పరిమిత సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకి దీన్ని అందించారు. మార్పులు చేర్పులతో 2018 నుంచి ఈ రైలు పట్టాల మీద పరుగులు పెడతాయని అధికారులు చెబుతున్నారు. దీని ప్రత్యేకత వల్ల ప్రజలకు, జంతువులకు ప్రమాదం అంటున్నారు నిపుణులు. రైలు రావడం లేదని ఎవరైనా పట్టాలమీదకు వెళ్తే ప్రాణాలు కోల్పోవలసి వస్తుందంటున్నారు. ఏది ఎమైనా వీరి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే.