Read more!

రేవంత్ సొంత అజెండాతో భవిష్యత్ కార్యాచరణ.?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. ఆ పార్టీ రాస్ట్ర నాయకుడిగా ప్రజాకర్షణ శక్తి ఉన్న యువనేత రేవంత్ రెడ్డి ఉన్నారు. అన్నీ ఉన్నా అదేదో అన్నట్లు.. కాంగ్రెస్ తనకున్న మద్దతులు ఓట్లుగా మలచుకోవడంలో మాత్రం విఫలమౌతోంది. ఇందుకు నేతల మధ్య విభేదాలు, గ్రూపుల ఘర్షణలూ కరణమే అయినా అది ఒక్కటే కారణం కాదు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందనడంలో సందేహం లేదు.

అంతెందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే అందుకే తెరాస సుదీర్ఘ ఉద్యమమొక్కటే కారణం కాదు. కేంద్రంలో అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా విస్మరించడానికి వీలులేని ఒక కారణమే. కేంద్రం ఆమోదం లేకుండా రాష్ట్రం ఆవిర్బవించే అవకాశమే లేదు. తెలంగాణ కంటే ఉవ్వెత్తున ఎగసిన గూర్ఖాలాండ్ వంటి ఉద్యమాలు విజయవంతం కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక తెలంగాణ విషయానికి వస్తే అప్పట్లో అధిష్ఠానాన్ని తెలంగాణకు అనుకూలంగా అంగీకరించేలా చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని విస్మరించడం సాధ్యం కాదు. సరే అన్నీ కలిసి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇందు కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీలో పార్టీ కాడెను వదిలేసింది. ఏకంగా ఆ రాష్ట్రంలో పార్టీ శూన్యంగా మిగిలిపోతుందని తెలిసీ త్యాగానికి సిద్ధపడింది.

ఆ మేరకు తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని అంచననా వేసింది. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావానికి క్రెడిట్ అంతా తెరాస ఖాతాలో పడింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తిరోగమనం నుంచి తిరోగమనంగా తయారైంది. ఈ పరిస్థితిలో  రాష్ట్ర విభజన తరువాత తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనివార్యంగా హస్తం గూటికి చేరిన నేత రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్.   కేవలం ఒక రాజకీయ పార్టీలో వంద మంది నేతలలో ఒకరిగా మిగిలిపోయు వ్యక్తిత్వం కాదు రేవంత్ రెడ్డిది. తనదైన ప్రత్యేకత, రాజకీయ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో  కూడా రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ప్రత్యేకత ఉన్న ముఖ్య నేతగా ఎదిగారు. 2009 ఎన్నికల సమయంలో తన ప్రచారంతో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రసంగాలు చేయడంలో శిక్షణ ఇచ్చినది రేవంత్ రెడ్డే అని చెబుతారు. అలాంటి వ్యక్తి  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ తెలుగుదేశం దాదాపుగా నిర్వీర్యమైపోయిందన్న భావనతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ లోనూ తన ప్రత్యేకత చాటుకుని పలువురు సీనియర్లను అధిగమించి మరీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాత్రం ఆయన పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా సాగుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత గత ఎనిమిదేళ్లుగా ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. యువత పార్టీ వైపు ఎక్కువగా దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్ లో ఉత్సాహం ఉరకలేసింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు రేవంత్ పార్టీ పటిష్టత దిశగా వేసే ప్రతి అడుగునూ అడ్డుకోవడానికి కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేకులు అడుగడుగునా అడ్డం పడ్డారు. ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే.. వారు రెండడుగులు వెనక్కు వేసి పార్టీ పురోగతికి అవరోధంగా నిలిచారు.  ఈ అవరోధాలను అధిష్ఠానం అండతో అధిగమించి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన అడుగులు వేసినప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తరువాత ఆయనకు కూడా తత్వం బోధపడింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ కు బయటి శత్రువులు కంటే ఇంటి శత్రువులే ఎక్కువ అన్న నిర్దారణకు వచ్చిన ఆయన ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణపై సీరియస్ గా దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి  సన్నిహితుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడం అన్న మిషన్ ను పక్కన పెట్టి రేవంత్ రాష్ట్రంలో ఓ పాతిక నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారిస్తారు. ఆ పాతిక నియోజకవర్గాలలోనే అధిష్ఠానాన్ని ఒప్పించి తన వర్గం వారికి పార్టీ టికెట్లు సాధిస్తారు. వాటిలో తన వారిని గెలిపించుకోవడంపైనే దృష్టిసారిస్తారు.  అలా గెలిపించుకున్న పాతిక మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర రాజకీయాలలో బలమైన శక్తిగా రేవంత్ అవతరించే అవకాశాలున్నాయంటున్నారు. మరో వైపు  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాసాని జ్ణానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు రానున్న జోరందుకోనున్నాయన్న అంచనాలున్నాయి. సెటిలర్స్ అధికంగా ఉన్ననియోజకవర్గాలతో పాటు మరి కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతుందనీ, హంగ్ అనివార్యమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ గా రేవంత్ అవసరిస్తారని అంటున్నారు. ఆ వ్యూహంతోనే రేవంత్ అడుగులు పడుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.