ఆర్మీకి నైనా వందనం!
posted on Jul 5, 2022 @ 6:08PM
తండ్రితో వున్న అనుబంధాన్ని పిల్లలు బాగా గుర్తుంచుకుంటారు.. మననం చేసుకుంటూంటారు. ఫలానా స్కూలు ఫంక్షన్కి ఎత్తుకు తీసికెళ్లాడనో, ఆటల్లో ఫస్ట్ వస్తే కేక్ తినిపించాడనో.. ఇలా ఏవేవో చిన్నవే. అయినా వారికి ఎంతో పెద్ద విషయాలు. కానీ నైనా మాత్రం వాళ్ల నాన్న ఆర్మీ గురించి చెప్పిన నాలుగు మాటల్ని ఎప్పుడూ మననం చేసుకుంటూంటుంది.
స్వాతంత్య్రదినోత్సవం నాడు, గాంధీ జయంతినాడో మనకు దేశ భక్తి పెల్లబికివస్తుంది. అన్ని పట్టణాలు, పల్లెలూ దేశభక్తి పాటలతో ఊదరగొట్టేస్తుంటారు. అప్పుడే ఆర్మీ గురించి మాట్లాడుకోవడం ఎక్కువగా వుం టుంది. వారి బాగోగుల గురించ చర్చా జరుగుతుంటూంది. ఆ తర్వాత వెంటనే అన్నీ మర్చిపోయి, పాట సంగతి వదిలేసి ఎవరి పనుల్లో వాళ్లుంటాం. కానీ చిన్నారి నైనాకి అదంత సులభం కాదు.
ఈ చిన్నారికి అంత త్వరగా మర్చిపోలేదు. కారణం ఆమె తండ్రి 2018లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచా రు. కానీ నైనా ఏడవడం లేదు. తన తండ్రి ఆర్మీ గురించి కబుర్లను, ఆర్మీ ప్రాధాన్యత గురించి చెప్పిన నాలుగు మాటల్ని మనసంతా నింపేసుకుని వాటినే మననం చేసుకుంటోంది. నైనా తండ్రి మేజర్ అక్షయ్ గిరీష్ కుమార్ 51వ రెజిమెంట్ ఇంజనీర్. ఆయన 2018లో జమ్ము సమీపంలోని నగ్రోటాలో జరిగిన ఉగ్రదాడుల్లో మరణించారు.
అక్షయ్ ఎప్పుడూ తన కుటుంబానికి పెద్దగానేకాదు, దేశ రక్షణ బాధ్యతలు మనస్ఫూర్తిగా చేపట్డడంలో ఉండే ఆనందం కూడా అందరికీ చెబుతూండే దేశభక్తుడు. దేశం పట్ల ఎంత నిబద్ధతతో వుండాలి, ఇత రులతో ఎలా వుండాలి, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పాటించడం వంటి అనేకానేక అంశాలు పిల్లదా నికి బోధిస్తుండేవాడట. ఎప్పుడూ చివరగా ఆర్మీ ప్రత్యేకత గురించి మాట్లాడటం మాత్రం మరిచే వాడు కాదని ఆయన తల్లి, భార్యా అన్నారు. అదుగో ఆయన అలా చెప్పిన మాటలే పిల్లది విని మనసుకు ఎక్కించు కుని మననం చేసుకుంటోంది.. తండ్రిని దగ్గరగా చూస్తున్న భావనతో.
అందరం అందరినీ గౌరవిస్తామో లేదో గాని ఆర్మీవారు మాత్రం అందరినీ జై హింద్ అనే గౌరవ వందనం తోనే పలకరించడం నైనాను ఎంతగానో ఆకట్టుకుంది. అది అందరూ ఎందుకు పాటించరో ఆ చిన్నారి మనసుకు తెలియదు. కానీ నైనా తన తండ్రిని ఈ విషయంలో అమితంగా గౌరవిస్తుంది. మరి తండ్రి బాటలో భావీతరంలో ఆర్మీ ఆఫీసర్ అయినా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదేమో!