కొంచెం బాధ కలిగించింది.. వీటికి సమాధానాలు చెప్పండి
posted on Sep 12, 2020 @ 5:27PM
వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం వల్ల అవినీతి అంతమవుతుందని, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, తాజాగా దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
అసెంబ్లీలో రెవెన్యూ చట్టంపై రైతుల పక్షాన నాకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడం బాధ కలిగించిందని చెప్పిన సీతక్క.. నావి కొన్ని ప్రశ్నలు మీతో పంచుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు పోస్ట్ చేశారు.
వీఆర్వోలు అవినీతిపరులైనప్పుడు వారు గుర్తించిన 57 లక్షల మంది రైతులకు మీరు రైతుబంధు ఇస్తున్నారు. దాంట్లో ఎంతమంది నిజమైన రైతులు ఉన్నారు? అంటే రైతులు కానీ వాళ్ళకి కూడా రైతుబంధు లభిస్తుంది కదా? అని ప్రశ్నించారు. అంతేకాదు, గొప్పలు ముఖ్యమంత్రికి.. అవినీతి ఉద్యోగులకు అంటగడుతున్నారని విమర్శించారు.
సెక్షన్ 5 ప్రకారం రైతులు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేస్తారు? మరలా మధ్యవర్తులు ఏర్పడతారు కదా? వాళ్లు అవినీతి చేయరా? అని ప్రశ్నించారు.
ఎమ్మార్వో గారు గానీ అధికారపక్షం లో ఉండే నాయకులు గానీ తమ స్వార్థం కోసం భూమి వేరే పేరు మీద ఎక్కిస్తామని రైతులను బెదిరించరా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఎక్కిస్తే సెక్షన్ 9 ప్రకారం రైతుల కోర్టుకు పోయే అధికారం కూడా లేదు కదా అని అడిగారు. ఆన్లైన్ మీద పని చేసేది కూడా మనుషులే దేవుడు కాదు కదా అని ప్రశ్నించిన సీతక్క.. ఇదే టిఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి భూ ప్రక్షాళన చట్టం వచ్చినప్పుడు అద్భుతం మహా అద్భుతం అన్నారని ఎద్దేవాచేశారు. దానికి నిదర్శనమే ఇవాళ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతిలో భారత దేశంలోనే మొదటి స్థానంలో ఉందని విమర్శించారు.
వీఆర్వో లలో కొందరు అవినీతి పరులు ఉన్నారు వాళ్లను శిక్షించరా? వేరే డిపార్ట్మెంట్ లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అవినీతి చేయరని గ్యారెంటీ ఏంటి? అని సీతక్క ప్రశ్నించారు.