Read more!

షర్మిల అరెస్ట్ వెనక మేఘా వారి మెగా కథ?

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, చాలా కాలంగా అంచెల వారీగా రాష్ట్రంలో పాద పాదయాత్ర చేస్తున్నారు. తెరాస ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. అయినా, ఇంత వరకు తెరాస ప్రభుత్వం ఆమె పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుల విషయంలో స్పందించిన విధంగా స్పందించ లేదు. కానీ, ఇప్పడు వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్రను తెరాస నాయకులు ఆదుకున్నారు. కార్యకర్తలు రాళ్ళ దాడి చేశారు. పోలీసులు షర్మిలను, అరెస్ట్ చేశారు ... ఎందుకు ? ఏమిటి కారణం? కాళేశ్వరం మెగా ప్రాజెక్టులో మేఘా అవినీతిని, ఆమె టార్గెట్ చేయడమే కారణమా? సిబిఐ, కాగ్’కుఫిర్యాదు చేయడం, ప్రధాని లేఖ రాయడం ఇప్పడు తాజాగా  మేఘా వందకోట్ల ఆఫర్ ను బయట పెట్టడమే కారణమా ? వివరాలోకి వెళితే.. 

తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలకు అరెస్టులు , గృహ నిర్బంధాలు, అర్థరాత్రి తలుపులు తట్టి, తలుపులు పగల కొట్టి నాయకులను ఎత్తుకుపోవడం వంటి పోలీసు వేధింపులు కొత్త కాదు. ఒకప్పడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, కుడి భుజంగా ఉన్న, ప్రొఫెసర్ కోదండరామ్ మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పడు ఎవరు కాలు బయట పెట్టినా, పోలీసులు వారు గడప దాటాక ముందే అరెస్ట్ చేయడం లేదా గడప దాటకుండా గృహ నిర్బంధంలో ఉంచడం గత ఎనిమిదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ‘పవిత్ర’ ఆచారంగా సాగిపోతోంది. అలాగే, ప్రతిపక్ష పార్టీల నాయకుల పాదయాత్రలు అడ్డుకోవడం, రాళ్ల దాడులు చేయడం,  ప్రతిపక్ష నేతల వాహనాలకు నిప్పు పెట్టడం తెరాస  నాయకులు, కార్యకర్తలకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా బంగారు తెలంగాణ నడుస్తున్న  చరిత్రలో ప్రతి రోజు  చూస్తున్నదే, వింటున్నదే. 

అందుకే,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చింది మొదలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కడం, ప్రజాందోళనలను ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దశాబ్దాలుగా ఉన్న ధర్నాచౌక్ ను అక్కడ నుంచి ఎత్తేసి, రాజధాని సరిఃద్దుల అవతలకు విసిరేసింది. అలాగే, ఇతర ఏ శాఖలో లేని విధంగా పోలీసు శాఖలో  ఖాళీలను, ముఖ్యంగా కానిస్టేబుల్, ఎస్ఐ  పోస్టుల ఖాళీలను భర్తీ చేసింది. అయితే, ఇదంతా రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించడం కోసమా అంటే కాదు, ప్రతిపక్షాలు, ప్రజల గొంతు నొక్కేందుకే, కేసీఆర్ ప్రభుత్వం పోలీసు శాఖను ప్రేమగా పెంచుకుంటూ వస్తోందని, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నాయి. కొందరు గిట్టని వాళ్ళు అయితే పెంపుడు కుక్కలా అని కూడా అంటారు అదేమో కానీ, అన్ని శాఖల కంటే పోలీసు శాఖ పట్ల తెరాస సర్కార్ ప్రత్యేక ప్రేమను చూపుతోందనేది మాత్రం, ఎవరూ కాదన లేని నిజం. 

అయితే, ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకుల పట్ల ఇంత కఠినంగా ఉంటూ వస్తున్నతెరాస ప్రభుత్వం, తెరాస పార్టీ ఎందుకనో గానీ, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె  షర్మిల విషయంలో మాత్రం మౌనంగానే ఉంటోంది. ఆమె  అంచెల వారీగా ఇంచు మించుగా సంవత్సర కాలంగా సాగిస్తున్న పాదయాత్రకు అటు పోలీసులు కానీ, ఇటు తెరాస నాయకులు, కార్యకర్తలు కానీ ఎక్కడా ఒకింత అవరోధం కల్పించేలేదు. అలాగని, ఆమె తనదారిన తాను, అలా చేతులు జేబులో పెట్టుకుని మౌనంగా నడుచుకుంటూ వెళ్లి పోతున్నారా, అంటే లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని, ప్రభుత్వం, ఫ్యామిలీ అవినీతిని బీజీపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కంటే ఘాటుగా విమర్శిస్తున్నారు.

ఏ నియోజక వర్గంలో పాదయాత్ర జరుగుతుంటే, ఆ నియోజక వర్గం తెరాస ఎమ్మెల్యే టార్గెట్ గా డ్యాష్ ..డ్యాష్ భాషలో ఏకి పారేస్తున్నారు. ఒక్కొక ఎమ్మెల్యే అవినీతి చిట్టాను బయటకు తెసుకొచ్చి మరీ పబ్లిక్ లో ప్రశ్నిస్తున్నారు. అయినా, ఎందుకనో గానీ, తెరాస ప్రభుత్వం షర్మిల పాదయాత్రకు పెద్దగా అడ్డుకోలేదు. ఆమె చేస్తున్న విమర్శలను కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ, ఈరోజు వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఇటు తెరాస కార్యకర్తలు, అటు రాష్ట్ర పోలీసులు ఒకే సారి ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ముందుగా, తెరాస కార్యకర్తలు, షర్మిల వాహన శ్రేణి పై రాళ్ళ దాడి చేశారు. వాహనాల అద్దాలు పగల కొట్టారు. ఒకటి రెండు వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఉద్రిక పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎంటరయ్యారు. షర్మిలను, ఆమె వెంట పాదయాత్రలో పాల్గొన్న కొందరు నాయకులు  కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

సరే, అదంతా మాములు కథ.  అయితే, ఇంతకాలంగా లేనిది,ఇప్పడు తెరాస ప్రభుత్వం షర్మిల మీద కన్నెర్ర చేయదానికి కారణం ఏమిటి. ఇంతవరకు, హేండిల్ విత్ కేర్ అన్నట్లు ప్రవర్తిస్తూ, ఆమె తిట్లను దీవెనలుగా భావిస్తూ వచ్చిన తెరాస ప్రభుత్వం ఇప్పడు ఎందుకు, ఒక్కసారిగా భగ్గుమంది? బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుని, షర్మిల పాదయాత్రను అడ్డుకోకపొతే బాగుండదని, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని, తెరాస పార్టీ, ప్రభుత్వం సంయుక్తంగా షర్మిల పాదయాత్ర ను అడ్డుకున్నాయా? నర్సంపేటలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆగ్రహించి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారా? అంటే లేదు. ఇది స్థానికంగా, ఎమ్మెల్యే అనుచరులో, స్థానిక పోలీసు అధికారులో తీసుకున్న నిర్ణయం కాదని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే, షర్మిల యాత్రను ఇటు పార్టీ కార్యకర్తలు, అటు పోలీసులు టార్గెట్ చేశారని అంటున్నారు. 

కొద్ది రోజుల క్రితం, ఒకసారి కాదు, రెండు సార్లు షర్మిల ఢిల్లీ  వెళ్ళారు. తెరాస ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీబీఐకి, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) కు ఫిర్యాదు చేశారు. అంతటితో వదిలేయలేదు. కాళేశ్వరం అవినీతిపై స్పందించాలని కోరుతూ, ప్రధాని నరేద్ర మోడీకి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలోనే, కాళేశ్వరం అవినీతిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లేందుకు, రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో కాళేశ్వరం అవినీతిని కళ్ళకు కట్టేలా, పోస్టర్లు వేశారు. కరపత్రాలు పంచారు. ఈ అన్నిటినీ మించి ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి, ప్రాజెక్ట్ అవినీతిపై మౌనంగా ఉంటే వంద కోట్లు ఇస్తానని ఆఫర్ చేసింది నిజమే అని వెల్లడించారు. అందుకే, ఇప్పడు షర్మిల మీద తెరాస దాడికి తెరతీసిందని, అంటున్నారు. సో ... షర్మిల అరెస్ట్ వెనక చాలా పెద్ద కథ ఉంది. ముందు ముందు ఇంకా పెద్ద కథే ఉంటుందని అంటున్నారు.