జగన్ వర్గం పై చర్యలకు రెడీనా?
posted on Mar 27, 2011 @ 4:33PM
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులపై చర్యలకు కాంగ్రెసు నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కడప, అనంతపురం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమి పాలైన నేపథ్యంలో జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలకు నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కడప జిల్లాలో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోకపోతే వచ్చే పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది అవుతుందని కడప జిల్లా నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద వాదించినట్లు సమాచారం. కడప జిల్లా నాయకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, అమర్నాథ్ రెడ్డి, కె. శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా కరుడు గట్టిన ఈ ఐదుగురు జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే మిగతా వారు సర్దుకుంటారని, సర్దుకోకపోతే తదుపరి చర్యలు తీసుకోవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.