ఆసియా కప్ కు మీరు రాకుంటే.. వన్డే వరల్డ్ కప్ కు మేం రాం
posted on Nov 28, 2022 6:06AM
వచ్చే ఏడాది ఆసియాకప్ జరగనుంది. ఆ టోర్నీకి పాకిస్థాన్ వేదిక కావడమే ఇప్పుడు ఇరు దేశాల మధ్యా వివాదానికి కారణమైంది. ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రెండు దేశాలూ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదన్న సంగతి విదితమే. ఐసీసీ టోర్నీలలో మాత్రమే అదీ తటస్థ వేదికలపై మాత్రమే రెండు దేశాల మధ్యా మ్యాచ్ ల జరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కు పాకిస్థాన్ వేదిక కావడంతో భారత్ అక్కడకు వెళ్లి ఆడుతుందా అన్న విషయంపై అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఇప్పటికే బీసీసీఐ ఈ విషయమే దాదాపు స్పష్టత ఇచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ గడ్డపై భారత్ ఆడేది లేదని తేల్చేశారు. దీనిపైనే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ రిటార్డ్ ఇచ్చారు. పాక్ లో టీమ్ ఇండియా ఆడక పోతే.. తామూ అదే బాట పడతామనీ, 2023లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో తమ జట్టు ఆడదని తెలిపాడు.
గత కొంతకాలంగా పాక్ జట్టు అత్యుత్తమంగా రాణిస్తోందని, ఏడాది కాలంలో టీమ్ఇండియాను రెండు సార్లు ఓడించామని రమీజ్ రజా గుర్తు చేశారు. మా జట్టు పటిష్టంగా మారింది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుందని అన్నాడు. భారత్ ఇక్కడికి వస్తే.. మేం ప్రపంచకప్ ఆడటానికి వెలుతాం. వాళ్లు రాకపోతే.. మేమూ వెళ్లం. మా జట్టు ప్రపంచకప్ ఆడకుంటే ఆ టోర్నీని ఎవరు చూస్తారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమీజ్ రాజా అన్నాడు.
దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. భారత్ గనుక పాక్ కు వెళ్లకుంటే ఆసియా కప్ క్రేజ్ పడిపోవడం ఖాయమని అంటున్నారు. పాక్ ఒకవేళ ప్రపంచకప్ ఆడకుంటే ఆ దేశానికే నష్టం అని చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలో పాల్గొనడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పాక్ కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇక ఇండియా కూడా ఏడాది కాలంలో రెండు సార్లు పాక్ ను ఓడించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.