పార్టీ వ్యతిరేకులకు డిఎస్ హెచ్చరిక
posted on Mar 27, 2011 @ 4:22PM
హైదరాబాద్: పార్టీలో ఉంటూ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవద్దని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను పార్టీ నేతలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్ మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు. ఒకరినొకరు విమర్శించుకోవడంతోనే సరిపోతుందని అన్నారు. పార్టీలో ఉంటూ విమర్శించుకోవడం సరికాదన్నారు. పార్టీలో 2004లో ఉన్న ఐక్యత 2009లో లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయవద్దని ఆయన అన్నారు. పార్టీ వ్యతిరేకులపై చర్యలు తీసుకోవడం పెద్ద పని కాదన్నారు. అయితే అధిష్టానం సంయమనం పాటిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీ కోసం పాటుపడిన కార్యకర్తలను నామినేటేడ్ పదవులకు ఎంపిక చేస్తామన్నారు.