ఉగాది రోజే 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ
posted on Mar 5, 2020 7:59AM
ఇక ఏపీలో వైఎస్సార్ జగనన్న కాలనీలు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు.
‘‘స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి పత్రంతో పాటు, ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతున్నారు. ఇందుకోసం అందరు తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్టార్లుగా హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్దం చేశారు. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమి ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. ఈ కాలనీలన్నింటికీ వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తారు.
ఎన్పీఆర్కు సంబంధించి మైనారిటీలకు అభయమిచ్చేలా తీర్మానం చేశారు. 2010లో చేసిన ప్రక్రియకే పరిమితమై గత ప్రశ్నలే ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. అప్పటి వరకు ఎన్పీఆర్ ప్రక్రియను ఏపీలో నిలిపివేయాలని తీర్మానించినట్లు మంత్రి పేర్ని వివరణ ఇచ్చారు.
రుణం తీసుకునేందుకు సీడ్ కార్పొరేషన్కు అనుమతి
పోర్టుల నిర్మాణానికి ఏర్పాట్లతో పాటు అడ్డంకులు తొలగించేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు.
కృష్ణపట్నం పోర్టు పరిధి కుదింపునకు రాటిఫికేషన్ చేయడంతో పాటు అక్కడ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.500కోట్ల రుణం తెచ్చుకునేందుకు సీడ్ కార్పొరేషన్కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
ఒంగోలులో తెదేపాకు కేటాయించిన రెండు ఎకరాల భూమిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ఆ భూమిని తిరిగి జలవనరుల శాఖకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.
భోగాపురం విమానాశ్రయం పనుల్లో జీఎంఆర్కు అనుమతిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది.