Home » VASUNDHARA » Vasundara Short Stories



                                       భరించువాడు
            
                                                                              వసుంధర

 

             


           
    కాలింగ్ బెల్ మోగగానే ఉలిక్కిపడి లేచింది ఇందుమతి. ఆమె కనుల మత్తు, ఇంకా వదలలేదు. ఆమె మంచం మీంచి లేచి లేవగానే మరోసారి మోగింది కాలింగ్ బెల్.
    "ఇంకెవరు ఆయనే అయింటారు" అనుకుందామే.
    ఒకసారి బట్టలు సవరించుకుని మత్తుగా ఆవలించి పడక గది లోంచి బయట పడగానే మరోసారి కాలింగ్ బెల్ మోగింది.
    రెండంగల్లో పరుగున వెళ్ళి వీధి తలుపు తీసిందామే.
    అప్పారావు నవ్వుతూ లోపలకు ప్రవేశించాడు.
    "ఏమిటండీ! నేను వచ్చే లోగా అంత తొందరేమిటి?" అంది ఇందుమతి విసుగ్గా. "కాలింగ్ బెల్ అన్ని మార్లు మోగించారు?"
    అప్పారావు నవ్వి "నువ్వు నిద్ర పోతుంటావని నాకు తెలుసు. అందుకే అన్ని సార్లు కాలింగ్ బెల్ కొట్టాల్సోచ్చింది. పోనీ లోపల నుంచి వస్తున్నా అని ఒక్క మాట అనొచ్చు గదా నువ్వు" అన్నాడు.
    "బాగుంది , వచ్చింది మీరేనని తెలిస్తే అలాగే అనేదాన్ని."
    "అవునూ ఎప్పుడూ కావాలంటే అప్పుడు నీకింత నిద్ర ఎలా పడుతుందో చెప్పవూ ?" అన్నాడు అప్పారావు.
    "ఎప్పుడు కావాలంటే  అప్పుడు నిద్ర పోయే అవకాశం లేకనే, ఎప్పుడో ఒకప్పుడు నిద్ర పోతుంటాను నేను" అన్నది ఇందుమతి.
    అప్పారావు ఏదో అనబోయాడు కానీ, ఆమె అతన్ని మాట్లాడ నివ్వలేదు. ఉదయం నించి రాత్రి వరకూ ఎన్ని పనులుంటాయా, తీరుబడి దొరకడం తనకు యెంత కష్టమో ఇందుమతి అతడికి వివరించి చెప్పింది.
    "నీ గురించి నువ్వే అలా అనుకుంటే మరి నా సంగతి ఏమిటి? నిన్ను గురించి నేనే మనుకోవాలి?" అన్నాడు అప్పారావు.
    "మీరా?" అని పకపకా నవ్వింది ఇందుమతి.  
    "ఇంట్లో ఉన్నంత సేపూ మీ పనులు కూడా నేనే చేయాలి. నాకు పని చెరుపు తప్పితే మీ వల్ల ప్రయోజనమేమీ లేదు. ఆ పైన ఆఫీసుకు వెళ్ళి కూర్చుంటారు. ప్రజల సొమ్ము తినడమే కానీ మీ వల్ల ప్రజలకు చిన్న మెత్తు , ఉపకారం కూడా జరగదు. ఆ పైన ఇంటికి వెంటనే రాకుండా పనికిరాని పెత్తనాలు" అని --- "అవునూ ఆ రంగనాధం గారప్పుడే వచ్చేశారు కదా. మీ కెందుకు ఇంత ఆలశ్యమయింది?' అంది ఇందుమతి.
    "ఈరోజు ఆఫీసులో రీటా పార్టీ ఇచ్చింది. ఆమెకు మెరిట్ ప్రమోషన్ అని ఒక ఇంక్రిమెంట్ ఎక్స్ట్ట్రా గా ఇచ్చారు. అందుకని ఆఫీసు కాగానే పార్టీ! కోలీగ్సందరం హాజరయ్యాం" అన్నాడు అప్పారావు.
    "మరి రంగనాధంగారు మీ రీటాకు కొలీగ్ కాదా?" అన్నది ఇందుమతి.
    "ఎందుకు కాదూ? కానీ ఆయనకు భయం. అయన భార్య పెద్ద అనుమాన పిశాచి అని నీకు తెలియదా?" అన్నాడు అప్పారావు.
    రంగనాధం గురించి ఇందుమతికి అప్పారావు ద్వారానే తెలుసు. అతడి భార్యకు అతడి మీద విపరీతమైన అనుమానం, భర్తను క్షణం కూడా వదలదు. అతడు ఆడవాళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు ఆఫీసునుంచి ఆలస్యంగా రావడానికి లేదు. ఆఫీసులు పెందరాళే వెళ్ళడానికి లేదు. బయటకు ఎప్పుడు వెళ్ళినా భార్యతో కలిసి వెళ్ళాలి.
    "అదేం మనిషా" ఎందుకో అనుమానం?" అన్నది ఇందుమతి.
    "ఇందూ!! అందరూ నీకులాగే ఉంటారా? అదంతా నా అదృష్టం " అన్నాడు అప్పారావు.
    అప్పారావు ఈ మాటలు మనస్పూర్తిగా అన్నాడు. అసలు అతడికి మనుషుల్ని కావాలని పోగిడే అలవాటు లేదు.
    ఇందుమతి అప్పారావును దేనికీ నొప్పించదు. ఆఫీసుకు పెందరాళే వేడతానంటే వెళ్ళమంటుంది. ఆలస్యంగా వస్తే, కారణం తెలుసుకుని వూరుకుంటుంది. అతను ఎల్లకాలం తనతోనే తిరగాలని నొక్కించదు. ముఖ్యంగా తోటి ఆడవాళ్ళ విషయంలో ఆమె హృదయం మరీ విశాలం.
    వాళ్ళకు నాలుగిళ్ళ అవతల శారద అనే అమ్మాయి ప్రయివేటుగా బియ్యే కడుతున్నది. ఆమెకు సాయం చెయ్యమని భర్తను తనే ప్రోత్సహించింది ఇందుమతి. శారద రోజూ వాళ్ళింటికి వచ్చి ప్రయివేటు చెప్పించుకుని వెడుతుంది. భర్త శారదకు ప్రయివేటు చెబుతుంటే ఇందుమతి వాళ్ళను కనిపెట్టి కూర్చునేది కాదు. తన పనుల్లో తానుండేది. నాలుగు రోజుల్నించి శారద వూళ్ళో లేదు.
    శారద మనిషి బాగుంటుంది. అప్పారావుకు అప్పుడప్పుడు బుద్ది చెదిరేది. కాని తెలిసిన వారి పిల్ల. అతడు మర్యాదస్తుడిలా ప్రవర్తించే వాడు. ఆమె చాలా బుద్దిగా మసిలేది. శారదకు ప్రయివేటు చెప్పడం ద్వారా అప్పారావుకు ఆ వీధిలోనే మంచి పేరు వచ్చింది.
    అప్పారావు పక్కింట్లో ప్రదీప్ ఉంటున్నాడు. అతడి భార్య జ్యోత్స్న . ప్రదీప్ మనిషి బాగుండడు. భార్య పక్కన నిలబడితే ఆమె కంటే ఒక అంగుళం పొట్టిగా ఉన్నాడా అనిపిస్తుంది. మనిషి ఛాయ నలుపుకు దగ్గర. ముఖంలో కళ కూడా తక్కువ. అతను ఏదో ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది కానీ భార్యంటే బొత్తిగా పట్టదు. ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు . ఒకోసారి అర్ధరాత్రి వేళ ఏ క్లబ్బు నుంచో తాగి వస్తుంటాడు. అప్పుడప్పుడు భార్యను కొడతాడని అప్పారావు అనుమానం.
    జ్యోత్స్న కు ఇరవై ఏళ్ళు ఉంటాయి. పెళ్ళయి రెండేళ్ళయింది. మనిషి చాలా అందంగా, సన్నగా, నాజుగ్గా ఉంటుంది. చూడగానే మరోసారి చూడాలనిపిస్తుంది. ఆమె కనులు ఎంత బాగుంటాయో చెప్పడం కష్టం. ఎప్పుడైనా ఆమె వోరకంట చూసిందంటే ఏ మగాడికైనా ఆ  చూపులు ఒక రోజు రోజంతా గుర్తుండిపోవాలి.
    జ్యోత్స్న అప్పారావు వంక అదోరకంగా అభిమానంగా చూస్తుంది. అవి మామూలు చూపులు కావు. ఆమె తనను ప్రేమిస్తున్నదని అప్పారావుకు, అంతరంతరాల్లో అనుమానముంది. ఆ అనుమానానికి కొన్ని కారణాలున్నాయి.
    అప్పారావు మనిషి బాగుంటాడు. అతడు ఇందుమతి కంటే బాగుంటాడు. జ్యోత్స్న ను చూసినప్పుడల్లా తను ఇందుమతికి బదులు జ్యోత్స్న ను చేసుకోవలసిందని అతడికి అనిపించేది. తన మనసు లోని మాటను ఏదో విధంగా భార్య గ్రహించాలని ----"ఆ పక్కింటావిడనా వంక అదోలా చూస్తుంది. ఈ పొరుగు మనకు మంచిది కాదు" అని చెప్పాడో రోజున.
    "ఆవిడ చూపులే అంత. మీ వంక ఎలా చూస్తుందో , నా వంక కూడా అలాగే చూస్తుంది" అన్నది ఇందుమతి -----అతడి మాటలు తేలిగ్గా తీసి పారేస్తూ.
    జ్యోత్స్న ఎన్నోసార్లు వాళ్ళింటికి వచ్చింది. అప్పారావుతో సాహిత్య చర్చలు చేసింది. పుస్తకాలు అందిస్తూనో, మరేదో వంక పెట్టో ఆమె అతడి చేతి వెళ్ళను అప్పుడప్పుడు తాకిందని అప్పారావు అనుమానం.




Related Novels


Vasundara Short Stories

Trick Trick Trick

Pelli Chesi Chudu

ఆపరేషన్ మేడిపండు

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.