సంక్రాంతి సంబరాలలో ముఖం మెరిసిపోవాలంటే ఇలా చేయండి! ' సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ పండుగలో అమ్మాయిల అందం, వారు వేసే ముగ్గులతో పోటీ పడుతూ ఉంటుంది. ఇక వస్త్రధారణ సరేసరి. ఎంత అందంగా తయారు అయినా మగువల ముఖం వెలవెలబోతుంటే ఏమీ బాగుండదు. పండుగ కళ మొత్తం ముఖంలో కనిపించాలన్నా, ముఖం గాజులా  మెరిసిపోవాలంటే కొరియన్ స్టైల్ గ్లాసీ స్కిన్ కోసం ప్రయత్నం చెయ్యాలి.  కొరియన్ అమ్మాయిలకు ఉన్నట్టు ముఖం గాజులా మెరిసిపోవడానికి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్  మధు చోప్రా  ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. దీన్ని ఫాలో అవుతుంటే 50 ఏళ్ల వయసు వచ్చినా ముఖంలో ఏ చిన్న ముడత కనిపించదు. అదేంటో తెలుసుకుంటే.. కొరియన్ అమ్మయిల్లా గ్లాసే స్కిన్ కావాలి అంటే రైస్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది రైస్ వాటర్ అంటే బియ్యపు కడుగుతో ముఖం కడుగుతుంటారు, అదే ముఖానికి స్ప్రే చేస్తుంటారు. కానీ రైస్ వాటర్ తయారు చేసుకోవడం, ముఖానికి అప్లై చేయడం పూర్తిగా విభిన్నమైన పద్దతి.  సరైన  జుట్టుకు మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.  ఇప్పట్లో బియ్యం నీటిని అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తున్నారు. వీటిలో అమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు,  మినరల్స్ మంచి పరిమాణంలో ఉంటాయి, ఇవి వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయి. బియ్యం నీరు చర్మశుద్ధి, మచ్చలు,  వడదెబ్బ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.. ముందుగా అరకప్పు బియ్యాన్ని బాగా కడిగి కొంచెం నీళ్ళు వేసి స్టౌ మీద పెట్టి ఉడికించాలి. బియ్యం ఊడుకు పట్టిన తరువాత స్టౌ ఆఫ్ చేసి బియ్యంలో ఉన్న నీటిని వేరు చేయాలి. సాధారణంగా దీన్ని స్టార్చ్ అని అంటారు. ఇది మరీ పలుచగా ఉండకూడదు. కాసింత గట్టిగానే ఉండాలి. అందులో అలోవెరా జెల్,  కొన్ని చుక్కల ఆముదం కలపాలి.  చర్మం జిడ్డుగా ఉంటే కొద్దిగా నిమ్మరసం జోడించవచ్చు. కానీ  చర్మం పొడిగా ఉంటే ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇదే రైస్ వాటర్ మాస్క్. ఈ పేస్ట్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని కడిగి ఆరిన తరువాత దీన్ని ముఖానికి అప్లై చేయలి..  దీన్ని ముఖానికి మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు. మొదట్లో ఇది ముఖాన్ని శుభ్రపరిచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.   ఏడు రోజుల పాటు ఈ రెమెడీని కంటిన్యూగా పాటించడం వల్ల గాజులాంటి మెరిసే చర్మం  సొంతమవుతుంది. దీన్ని లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే 50 యేళ్లు వచ్చినా ముఖంలో ముడతలు, మచ్చలు కనిపించవు.                                     *నిశ్శబ్ద.

స్త్రీలు తెలుసుకోవలసిన  జనన నియంత్రణ మార్గాలు..! సెక్స్, అబార్షన్,  గర్భనిరోధకం, ఈ మూడు అంశాలు నేటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. గర్భాన్ని నిరోధించడానికి గర్భనిరోధకాలు వాడతారన్నది నిజం. కానీ వాటి ఉపయోగం ఒకే ప్రయోజనానికి పరిమితం కాదు. వారి స్వంత ప్రాణశక్తి ప్రకారం అనుసరించడానికి ఏ మార్గం అనుకూలంగా ఉంటుంది? లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను ఎలా నివారించాలి? వాటిని ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా? అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి?సురక్షితమైన సెక్స్ కోసం గర్భనిరోధక పద్ధతులను ఎంచుకునే ముందు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. బాహ్య కండోమ్: కండోమ్ అంటే సాధారణంగా బాహ్య కండోమ్ అని అర్థం. ఇది మగ జననేంద్రియాల పైన అమర్చబడుతుంది. ఈ కండోమ్ రబ్బరుతో తయారు చేయబడింది. వీటి వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గర్భధారణను నివారించడమే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా నిరోధిస్తాయి. వీటి వల్ల అలర్జీలు రావచ్చు. అంతర్గత కండోమ్: ఇది మహిళల కోసం తయారు చేయబడింది. చాలా బాహ్య కండోమ్‌లు రబ్బరు పాలుతో తయారు చేస్తారు. అంతర్గత కండోమ్‌లలో రబ్బరు పాలు ఉండవు. వీటిని మహిళలు తమ ప్రైవేట్ పార్ట్‌లలో ధరిస్తారు. కాపర్టీ: IUD అనేది స్వచ్ఛమైన రాగి లోహంతో తయారు చేయబడిన పరికరం. దీనికి ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇది గర్భాశయం లోపల అమర్చబడుతుంది. ఈ సాధనం నైలాన్ థ్రెడ్‌ను కలిగి ఉంది. ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే 10 సంవత్సరాల వరకు సరిగ్గా పని చేస్తుంది. ఇవి 99% గర్భాన్ని నివారిస్తాయి. గర్భనిరోధక మాత్ర: ఇవి అత్యంత ప్రాచుర్యం పొందిన జనన నియంత్రణ పద్ధతుల్లో ఒకటి. ఇది రోజుకు ఒకసారి తీసుకోవలసిన చిన్న మాత్ర. ఈ మాత్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ మాత్రను సమయానికి తినడం మర్చిపోకుండా తీసుకోవడం చాలా అవసరం. చాలా ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది సెక్స్ చర్యతో జోక్యం చేసుకోదు.  ఈ మాత్రను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలి. అందువల్ల, వైద్యుడిని చూడటం చాలా అవసరం.ఇవి సురక్షితమైనవి అయినప్పటికీ, దుష్ప్రభావాలు కలిగిస్తాయి.  

తొడల కొవ్వు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారా.. ఈ అయిదు టిప్స్ ఫాలో అయిపోండి! శరీర సౌష్టవం బాగుంటే ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది. శరీర సౌష్టవం సరిగా లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. బాడీ షేమింగ్ పట్టించుకోనక్కర్లేదు.. అని  చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు శరీర సౌష్టవం దెబ్బతింటే దాన్నలాగే ఎందుకు వదిలేయాలి. నిజానికి శరీరాకృతి మారిపోయిన శరీరంలో ఏదో ఒక అసౌకర్యం, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటాయి. అందుకే శరీరాన్ని చక్కని రూపానికి తెచ్చుకోవడం మంచిది. మహిళలలో ఎక్కువగా తుంటి భాగంలో కొవ్వు పేరుకుని పోతుంటుంది. దాన్ని వదిలించుకోవడానికి కష్టపడుతుంటారు. అయితే తుంటి కొవ్వు తగ్గించుకోవడానికి ఐదెంటే ఐదే టిప్స్ ఫాలో అయితే చాలు.. లోయర్ బాడీ వ్యాయామాలు.. తుంటి కొవ్వు తగ్గాలంటే లోయర్ బాడీ అంటే దిగువ శరీరం వ్యాయామాలు ఫాలో కావాలి. హిప్స్, గ్లుట్ లను చక్కని ఆకృతిలోకి తీసుకురావడానికి లంగ్స్, స్క్వాట్ ల, లెగ్ రైజ్ లు వంటి దిగువ శరీర వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. కౌంట్ పెంచాలి.. వ్యాయామంలో భాగంగా చాలామంది నడవడం, జాగింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం మొదలైనవి ఫాలో అవుతారు. వీటిని సాధారణంగా చేయడం కంటే మరికాస్త ఎక్కువ సమయం పొడిగించి చేయాలి. ఇవి హిప్ కండరాలను బిగించి చక్కని ఆకృతి రావడంలో సహాయపడతాయి. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు అదనపు కేలరీలు వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఈ ఫుడ్ కు దూరం.. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో అసంతృప్త కొవ్వులు, అదనపు చక్కెరలు ఉంటాయి. ఇవి తుంటి భాగంలో పేరుకుని పోతాయి. వీటని తింటూ ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం శూన్యం. వీటికి బదులుగా బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పైబర్ ఆహారానికి పెద్ద పీట వేయాలి. నీరు.. నీరు శరీరానికి ఇంధనం వంటిది. ప్రతిరోజూ శరీరానికి తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్ లు బయటకు పోతాయి. శరీరంలో అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది.   బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిద్ర.. శరీరంలో కణాల మరమ్మత్తు జరగడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. శరీరంలో పేరుకున్న కొవ్వు కోల్పోవడానికి నిద్ర ప్రముఖ పాత్ర వహిస్తుంది. నిద్ర శరీరానికి ఊరటనిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి శరీరం  చురుగ్గా ఉంటుంది.                                                          *నిశ్శబ్ద

స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయకండి! చలికాలం రాగానే ప్రతి ఇంట్లో ఏ అల్మరాలోనో, బీరువాల్లోనో భద్రం చేసిన ఉన్ని దుస్తులు అన్ని బయటకు తీస్తారు. వీటిలో చేతి తొడుగులు, మంకీ క్యాప్ లు, స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు, చెవులకు రక్షణ ఇచ్చే వివిధ రకాల దుస్తులు ఉంటాయి. అయితే అన్ని రోజులు బీరువాల్లోమూలిగి ఉన్నవాటిని బయటకు తీయగానే వాటిని ఉతికి వాడటం చాలా మంది చేసే పని. కానీ ఉన్ని దుస్తులను ఉతకడంలో చాలామంది తప్పులు చేస్తారు. ఈ కారణంగా అవి తొందరగా పాడవుతాయి. ఉన్ని దారాలు పైకి పొలుసుల్లా లేచి దుస్తులను తొందరగా పాడైపోయేల చేస్తాయి. ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు అస్సలు చేయకూడని మిస్టేక్స్ తెలుసుకుంటే..  ఉన్నితో చేసిన బట్టలు చాలా సున్నితమైనవి. వాటిని మెయింటైన్ చేయడం,  శుభ్రపరచడం చాలా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే వాటి  మెరుపు,  వెచ్చదనం ఇచ్చే లక్షణాలను కోల్పోతుంది. చాలా మంది తప్పులు చేసేది ఇక్కడే.  స్వెట్టర్లను ఉతకడంలో తప్పులు చేస్తే  అవి కొన్ని రోజుల్లో పనికిరాకుండా పోయే అవకాశం ఉంటుంది.   వాషింగ్ మెషిన్ లో వేయొద్దు.. ఉన్ని బట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. వాషింగ్ మెషిన్ లో బట్టల గమనం చాలా వేగంగా ఉంటుంది. పైపెచ్చు వాషింగ్ మెషిన్ లో బట్టల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.  దీనివల్ల బట్టలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే స్వెటర్లను ఎల్లప్పుడూ చేతులతో సున్నితంగా రుద్దుతూ శుభ్రం చెయ్యాలి. . అలాగే బ్రష్‌తో కూడా రుద్దకూడదు. ఇలా ఉతికితే ఉన్ని దుస్తులు మీద పొరలు లేస్తాయి.   నీటిలో నానబెట్టకూడదు.. స్వెటర్లు లేదా ఏదైనా ఉన్ని బట్టలు డిటర్జెంట్ నీటిలో కానీ సాధారణ నీటిలో కానీ ఎక్కువ సేపు  నానబెట్టకూడదు. దీంతో అవి త్వరగా పాడైపోతాయి. అంతేకాకుండా, దాని రంగు కూడా పోతుంది.  డిటర్జెంట్ పౌడర్ వొద్దు.. ఏళ్ల తరబడి డిటర్జెంట్ పౌడర్ వాడే అలవాటు ఉండటంతో అందులో బట్టలు ఉతకడం మామూలే. కానీ బట్టల నుండి పౌడర్ సరిగ్గా వదలదు.   దీని కారణంగా బట్టలు పాడవుతాయి. అందువల్ల, స్వెటర్లను కడగడానికి డిటర్జెంట్ ద్రవాన్ని ఉపయోగించడం మంచిది. లిక్విడ్ డిటర్జెంట్ అయితే దుస్తులు శుభ్రం చేయడం సులువే కాదు సువాసన కూడా బాగుంటాయి.                              *నిశ్శబ్ద.

 ప్రసవానంతర స్త్రీలు ఈ తప్పు చేయకూడదు.! ప్రసవం తర్వాత మహిళలు పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. నార్మల్ డెలివరీ అయినా.. సిజేరియన్ డెలివరీ అయినా.. ఇలాంటి వాటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వస్తువులను ఎత్తడం మానుకోండి: ప్రసవించిన తర్వాత, మహిళలు తమను.. వారి నవజాత శిశువును అలాగే ఇంటి పనులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి సందర్భాలలో, వారు తరచుగా నీటితో నింపిన బకెట్లు, ఉతికిన బట్టలు మొదలైన బరువైన వస్తువులను ఎత్తుతుంటారు. అలాంటి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల పొత్తికడుపుపై చాలా ఒత్తిడి పడుతుంది. ఇది కడుపు నొప్పి లేదా నడవడానికి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, ఎలాంటి బరువైన వస్తువులను ఎత్తకుండా ఉండండి. పదే పదే మెట్లు ఎక్కడం: నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా.. మహిళలు కొన్ని రోజులు మెట్లు ఎక్కడం, దిగడం మానేయాలి. మీరు రోజుకు ఒకసారి మాత్రమే ఎక్కవలసి వస్తే, పదే పదే మెట్లు ఎక్కడం మంచిది కాదు. ఇది ప్రసవ సమయంలో వేసిన కుట్లు తెరుస్తుంది. నొప్పిని పెంచుతుంది. పిల్లల పనులన్నీ మీరే చేయకండి: సాధారణంగా తల్లులు మాత్రమే పిల్లల బాధ్యత తీసుకుంటారు. పురుషులు కూడా తమ బాధ్యతను కొంతమేరకు మోయాలి. డెలివరీ అయిన వెంటనే బిడ్డకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవద్దు. బదులుగా, ఇంటిలోని ఇతర సభ్యులతో పిల్లల బాధ్యతను పంచుకోండి. ఇది మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని ఇస్తుంది. మీరు కోలుకోవడంలో సహాయపడుతుంది. రాత్రికి సరిపడా నిద్ర పట్టదు: పిల్లలు రాత్రంతా మేల్కొని ఉంటారని తరచుగా చెబుతారు. పిల్లలతో ఉన్న తల్లులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు పుట్టిన వెంటనే పూర్తి విశ్రాంతి తీసుకోకపోతే, మీ కోలుకోవడం నెమ్మదిగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితి మీకు చికాకు కలిగిస్తుంది. వేగంగా కోలుకోవడానికి, బాగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. శిశువు రాత్రిపూట నిద్రపోకపోతే, మీరు విశ్రాంతి తీసుకునేలా శిశువును జాగ్రత్తగా చూసుకోమని అమ్మకు కానీ అత్తకు కానీ లేదంటే ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించండి. శిశువు నిద్రిస్తున్నప్పుడు, మీరు శిశువుతో నిద్రిస్తారు. పరిశుభ్రత గురించి పట్టించుకోవాలి: ప్రసవం తర్వాత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కాస్త అప్రమత్తత లోపించినా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి, సాధారణ ప్రసవం ఉన్న మహిళలు తమ యోని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ ప్యాంటీని క్రమం తప్పకుండా మార్చాలి. మూత్రవిసర్జన సమయంలో మీ ప్రైవేట్ భాగాలను నీటితో కడగాలి.  కనీసం 40 రోజులు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండండి.

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు! చలికాలం  పాటలలోనూ, సినిమాలలోనూ మాత్రమే బాగుంటుంది. కొన్ని సార్లు వేడి వేడి ఆహారం, పకోడిలో, కాల్చిన మొక్కజొన్న పొత్తుల కోసమో చలికాలాన్ని తల్చుకుంటాము. కానీ నిజానికి చలికాలం వచ్చిందంటే పెద్ద పెట్టున చర్మానికి ఎసరు పెడుతుంది. చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. అదే తేనె. తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది.తేనెలో ఎన్నోపోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని సార్లు తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు. అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? చాలామంది తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తేనె చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె ది బెస్ట్. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద, మచ్చలు వస్తాయి. కానీ పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి.  లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే  తేనె బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది.                                                          *నిశ్శబ్ద.

భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఈ ఐదే ప్రధాన కారణాలట! సంతోషకరమైన వైవాహిక జీవితం,  సంతోషకరమైన కుటుంబం చాలా మంది కల. వివాహాం తరువాత  ప్రతి జంట సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. ఏడు జన్మల సంబంధం అనుకునే వివాహ బంధాన్ని ఒక్క జన్మకు కూడా కొనసాగించలేని పరిస్థితులు ఎదురవుతాయి. భార్యాభర్తలు తమ బంధంలో తీసుకునే నిర్ణయాలు, వారి అభిప్రాయాలు కొన్నిసార్లు   వారి సంబంధానికి శత్రువులుగా మారతాయి. ఇదే వారి మధ్య పెద్ద అడ్డుగోడ కడుతుంది. ఇది ద్వేషంగా కూడా మారుతుంది. ఈ ద్వేషం మితిమీరిపోతే ఎంతో సంతోషంగా గడపాల్సినవారు కాస్తా  విడిపోవాలని నిర్ణయించుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే ముఖ్యమైన విషయాలేంటో ముందే తెలుసుకుని వాటిని తమ జీవితంలో పొరపాటున కూడా ప్రస్తావించకపోవడం ఉత్తమం. అన్నింటిలో తప్పులు, లోపాలు వెతకడం.. ఎప్పుడూ ఒకరి వ్యక్తిత్వంలో లేదా పనిలో  లోపాలను వెతుక్కునే భార్యాభర్తలు బంధాన్ని  నిలకడగా నిలుపుకోలేరు. ఒకరిలోపాలను ఒకరు పదే పదే ఎత్తిచూపుతుంటే ఆ సంబంధం చాలా ప్రతికూలంగా మారుతుంది.  కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోవడమే మంచిదనే ఆలోచన కూడా పుడుతుంది. నిజానికి ఇలా తప్పులు ఎంచడం భార్యాభర్తల బంధంలోనే కాదు.. వేరే ఏ బంధంలో కూడా మంచిది కాదు. ఒక్కరిమీదే భారం ఉండటం.. వైవాహిక జీవితంలో భాగస్వాములిద్దరూ సమానంగా  ఉండాలి. భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిపని చూసుకోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే ఇంటి పనులు ఇద్దరూ చూసుకోవడం చేయాలి. అలాగే ఎవరికి నచ్చిన పనిని వారు మాత్రమే చేసుకోకుండా ఇద్దరూ కలసి చేయాలి. నీ పని నీది, నాపని నాది అనే భావన పొరపాటున కూడా చూపించవద్దు. వ్యక్తిగతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటే భార్యాభర్తల మధ్య  తాము ఒక్కటనే ఫీలింగ్ కొరవడుతుంది. ఫోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి కంటే తన ఫోన్‌పై ఎక్కువ శ్రద్ధ చూపితే అది వారి సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఈ అలవాటు వల్ల దాంపత్య సంతృప్తి తగ్గుతుందని, రోజుకోక గొడవ సర్వసాధారణమైపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రజలను డిప్రెషన్ వైపు నడిపిస్తాయి. బంధం చీలిపోవడానికి కారణం అవుతాయి. మనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం.. డబ్బు నిర్వహణలో సరైన అవగాహన లేని భాగస్వాములతో కలసి జీవించడానికి చాలా మంది అనాసక్తి చూపిస్తారు. డబ్బు బ్రతకడానికి ప్రధాన వస్తువు అయినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం చాలా బాగా తెలిసి ఉండాలి. డబ్బును నిర్లక్ష్యం చేసేవారితో భాగస్వాములు ఎక్కువగా గొడవలు పడతారు.  ఇలాంటి గొడవలు  జరగడం ఆ తరువాత గొడవలు మాములు అయిపోవడం కూడా జరుగుతుంది. అన్నీ లెక్కలు వేసుకోవడం..  భాగస్వామి కోసం తాము చేసిన ఖర్చులను  ఎప్పుడూ  లెక్కగట్టే వారు కొందరు ఉంటారు. ఇలాంటివారు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపించేలా ఉంటుంది వారి ప్రవర్తన. భాగస్వామితో సంతోషాలను వారికోసం చేసే ఖర్చును మాటిమాటికి లెక్కవేయడం, దాన్ని పదే పదే భాగస్వామి దగ్గర ప్రస్తావించడం వల్ల  వైవాహిక జీవితంలో సంతోషం దెబ్బతింటుంది.                                                         *నిశ్శబ్ద

దీపాలకాంతితో అమ్మాయిల  అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే!  దీపావళి భారతదేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకునే పండుగ. అందుకే ఎక్కడ చూసినా ఈ పండుగ వైభవం కనిపిస్తుంది. ఇది హిందూ మతానికి చాలా  ప్రత్యేకమైన పండుగ.   ప్రతి ఏడాది దీన్ని చాలా గొప్పగా  జరుపుకుంటారు. దీపావళి సందర్బంగా ఇళ్లను అలంకరించుకోవడం, ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేయడం , ఇల్లంతా దీపాలు వెలిగించడం వంటివి చేస్తారు.  కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి సందర్బంగా  అమ్మాయిలు తమ అందంలో  దీపాల కాంతితో పోటీ పడాలని ప్రయత్నిస్తారు. అయితే  ఈ దీపాల పండుగలో  డిఫరెంట్‌గా కనిపించాలన్నా గులాబీ లాంటి అందంతో మెరిసిపోవాలన్నా ఈ కింది టిప్స్ పాటించాలి.. దీపావళికి ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఈ సందర్బంగా  ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌,  మాస్క్‌లను ఉపయోగించడం మంచిది.  కావాలంటే  చర్మానికి సరిపోయే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. దీని వల్ల చర్మానికి లోపల నుండి జీవం వస్తుంది,  ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది దీపావళి నాటికి  ముఖం మెరిసేలా చేస్తుంది. చాలామంది అమ్మాయిలు  తమ ముఖాన్ని సాధారణ ఫేస్ వాష్‌తో కడగడం ద్వారా శుభ్రం చేసుకుంటారు, అయితే కొన్నిసార్లు హడావిడిలో   ముఖాన్ని శుభ్రం చేయడానికి తగినంత సమయం ఉండదు. ఏదైనా క్లెన్సింగ్ ఏజెంట్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇందుకోసం పచ్చి పాలలో కాటన్‌ను నానబెట్టి ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రంగా,  మేకప్‌కు చేసుకోవడానికి అనువుగా  స్మూత్‌గా మారుతుంది. దీపావళి పండుగ  రోజున మేకప్ చేసేటప్పుడు ఎక్కువగా పొరల మేకప్  వేసుకోకపోవడం మంచిది. బేస్,  ఫౌండేషన్  వేరు వేరు  లేయర్‌లను వేసుకోవడం  వలన  మేకప్ క్రాక్స్ వచ్చి తక్కువ సమయంలో పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల మేకప్  ను ఒకే  సన్నని పొరగా వేసుకోవాలి. ఇది చాలా సేపు ఉంటుంది.  ముఖం ఎక్కువసేపు  ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖానికి మేకప్ వేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, పాత లేదా చౌక ఉత్పత్తులను ఉపయోగించడం.  వీటితో  ఎన్ని విధాలుగా మేకప్ అప్లై చేసినా  అవి ఎక్కువ కాలం ఉండవు.   చెమటతో కారిపోవడం, లేదా రంగు వెలసిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మంచి కంపెనీ నుండి ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇకపోతే మేకప్ వేసేటప్పుడు జరిగే రెండవ తప్పు.. సరైన క్రమంలో మేకప్ వేయకపోవడం.  క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, ఫేస్ పౌడర్, బ్లషర్, ఐ మేకప్ అన్నీ వేటి  ప్రాముఖ్యతను అవి కలిగి ఉంటాయి. వాటిలో దేని తరువాత దేన్ని అప్లై చేయడం మంచిదో తెలుసుండటం ముఖ్యం. ఏ ఒక్కటైనా అటుది ఇటు, ఇటుది అటు వేస్తే మేకప్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మేకప్ వల్ల అందంగా కనబడాలంటే  ఈ తప్పులు చేయకూడదు.  మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను విడుదల చేస్తున్నాయి. ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి.   ఇవి ముఖంలో గ్లోను  ఎక్కువసేపు ఉంచడంలో కూడా సహాయపడతాయి.                                                             *నిశ్శబ్ద

 నవరాత్రుల భక్తి వెనుక ఆరోగ్యం.. ఆరోగ్యంగా అధిక బరువుకు చెక్ పెట్టేద్దాం.. స్త్రీ పూజ్యునీయురాలు . భారతదేశంలో స్త్రీని దేవతగా భావిస్తారు. స్త్రీ శక్తిని చాటి చెప్పే కథలు, పండుగలు కూడా ఉన్నాయి. వాటిలో శరన్నవరాత్రులు ఎంతో ప్రాశస్త్యమైనవి. దేవి నవరాత్రులు అని, శరన్నవరాత్రులు అని, దసరా అని పిలుచుకునే ఈ పండుగ సందర్భంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. భక్తితో అటు దైవ కృపకు పాత్రులు కావడం, ఇటు ఫిట్ గా మారడం మహిళల చేతుల్లోనే ఉంది. చాలామంది నవరాత్రుల సందర్బంగా  ఉపవాసాలు ఉంటారు. అధిక బరువు కలిగిన వారికి ఈ నవరాత్రులు మంచి అవకాశం. భక్తి వెనుక భయం కూడా ఉంటుంది. కాబట్టి సాధారణ సమయాల్లో నోరుకట్టేసుకుని బాధపడుతూ మధ్యలో కాంప్రమైజ్ అయ్యేవారు దేవుడి ముందు భక్తితో ఉపవాసం పాటిస్తారు. నవరాత్రుల ఉపవాసంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటారు.  అయితే, పండ్ల పేరుతో చాలామంది  ఫ్రూట్స్ కలిపిన పాయసం,  నైవేద్యం పేరుతో  పూరీ, బూరెలు,  కేసరి, డ్రైఫ్రూట్స్, పనీర్ వంటివి తింటారు. వీటి వల్ల కేలోరీలు బాగా శరీరంలోకి వెళతాయి. అలా కాకుండా బరువు పెరగకుండా రోజులో ఒకపూట మాత్రమే తినే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం కింది టిప్స్ పాటించాలి. ఏ వంటకం చేసినా దాన్ని  వేయించడం మానుకోవాలి. ఆవిరి మీద ఉడికించినవి తీసుకోవాలి. చక్కెరకు బదులుగా ఇతర చక్కెర ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి. మిశ్రి(కండచక్కెర), బెల్లం, తేనే, ఎండు ద్రాక్ష మొదలైనవి తీపిని ఇస్తాయి. సగ్గుబియ్యం, మఖనా, బరువు ఉండవు  కాబట్టి బరువు పెరగం అనుకుంటారు. కానీ ఇవి అధిక  కేలరీల ఆహారాలు, ఇవి బరువును పెంచుతాయి. వాటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా మొత్తం పండ్లను తినాలి. బరువు తగ్గడానికి తాజా పండ్లను బీట్ చేసే డైట్ లేనే లేదు. వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో రోజంతా వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. పాల ఉత్పత్తులు కొందరు జీర్ణించుకోలేరు. అలాంటి వారు పాల ఉత్పత్తును తినకపోవడం మంచిది. దీనికి బదులుగా   వెజిటేరియన్ ప్రోటిన్ పౌడర్ ఉపయోగించవచ్చు. ఉపవాసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అది ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యామోహాన్ని తగ్గిస్తుంది. చాలామంది దేవుడి పేరుతో బాగా వండుకుని తింటారు. కానీ అది తప్పు. ఆ భావన వదలకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ ప్రశ్నార్థకమే అవుతాయి. పండుగ ముగిసేసరికి మరింత బరువు పెరుగుతారు.                                                    *నిశ్శబ్ద.

 అమ్మబాబోయ్.. ఈ నెయిల్ పాలిష్ కొనాలంటే ఖరీదైన విల్లా కూడా  అమ్ముకోవాల్సిందే.. అందానికి అమ్మాయిలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అమ్మాయిలు సహజంగానే ఎంత అందంగా ఉన్నా సరే.. తమ అందం మరింత పెరగాలని  ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శరీరంలో ప్రతి భాగాన్ని ఆకర్షణగా తీర్చిదిద్దుకుంటారు. కళ్లకు కాటుక, నుదుటన బొట్టు, కనురెప్పలు, కనుబొమ్మలు, పెదవులు, వేళ్లు, వేలి గోర్లు  ఓయబ్బో ఈ సింగారాలకు అంతులేదు.  అమ్మాయిల ఈ వీక్నెస్ ఏ బ్యూటీ ఉత్పత్తుల బిజినెస్ కూడా. పైన చెప్పుకున్న ఎన్నో ఐటెమ్స్  కు పదుల నుండి వందలు వేలు కూడా ధారబోస్తారు. అయినా కించిత్  విచారం కూడా వ్యక్తం చేయరు. ఈ కారణంగానే చాలా బ్యూటీ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల ధరలను ఆకాశాన్నంటేలా  ఉంచుతుంటారు. ఇకపోతే అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన నెయిల్ పాలిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాచుర్యం పెరిగాక నెయిల్ పాలిష్ ల అమ్మకాలు కూడా బాగా  ఊపందుకున్నాయి.  సాధారణంగా నెయిల్ పాలిష్ ల ధరలు చిన్న చిన్న షాప్ లలో మన్నిక  క్వాలిటీ లేనివి అయితే 20రూపాయల నుండి లభిస్తాయి. అదే మంచి క్వాలిటీ కావాలంటే వీటి ధరలు 50 నుండి వందల రూపాయలు ఉంటాయి. ఇంకా ఖరీదైన బ్రాండులు అయితే వేలు కూడా ఉండొచ్చేమో. కానీ ఓ నెయిల్ పాలిష్ ధర మాత్రం గుండెలు దడదడలాడిస్తోంది. ఈ నెయిల్ పాలిష్ కొనాలి  అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న మంచి విల్లాను అమ్మేసుకోవాలి. ఏంటి నెయిల్ పాలిష్ కే అంత మాట అంటున్నారని డౌటా? అయితే ఈ నెయిల్ పాలిష్ కథ తెలుసుకోవాల్సిందే.. అమ్మాయిలు ఎంత అందంగా తయారైనా సరే. అందమైన చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టకపోతే అంత ఆకర్షణ ఉండదు. అంతేనా డ్రస్సుకు మ్యాచ్ అయ్యే నెయిల్ పాలిష్ పెడితే మరింత ఆట్రాక్షన్ గా మారిపోతారు. చాలావరకు అమ్మాయిల దగ్గర కనీసం ఓ పది రంగులైనా నెయిల్ పాలిష్ లు ఉండనే ఉంటాయి. వీటి ధర 50 నుండి వందలు, వేలు ఉండచ్చు. కానీ నెయిల్ పాలిష్ ధర ఏకంగా కోటి రూపాయలు ఉండటం ఎప్పుడైనా విన్నారా? కోటి అనేమాట వింటుంటేనే దిమ్మతిరిగిపోతుంది కానీ ఇది అక్షరాలా నిజమే.. లాస్ ఏంజిల్స్ కు చెందిన అజాచర్ బ్లాక్ అండ్ డైమండ్ నెయిల్ పాలిష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గా నిలుస్తోంది.  15మి.లీ ల నెయిల్ పాటిష్ ధర్ ఏకంగా రూ. 1,63,66,000. ఇంత డబ్బు తో హైదరాబాద్ లో మాంచి విల్లాను కొనుగోలు చేయవచ్చు. లేదూ.. ఈ నెయిల్ పెయింట్ కొనాలని అనిపించిందా.. ఇదిగో మాంచి ఖరీదైన విల్లాలను అమ్ముకుని నెయిల్ పాలిష్ కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నెయిల్ పాలిష్ తెగ హాట్ టాపిక్ గా మారింది.  కేవలం గోర్లకు వేసుకునే నెయిల్ పాలిష్ ఇంత ఖరీదు ఉండటమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.                                                        *నిశ్శబ్ద. 

  మనశ్శాంతి కరువైందా.. వెంటనే ఈ నాలుగు విషయాలు వదిలెయ్యండి.. జీవితంలో మనశ్శాంతి కరువైందని చెప్పేవారు చాలామంది ఉంటారు. మనశ్శాంతి ఉంటే ఎంత సమస్యలు ఎదురైనా వాటిని చాలా నేర్పుగా ఏదుర్కొంటారు.  చాలామంది మనశ్శాంతి కేవలం సమస్యల  వల్ల ఉండదని  అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మనశ్శాంతి అనేది సమస్యల వల్ల కాదు చేతులారా చేసే నాలుగే నాలుగు పనుల వల్ల కోల్పోతారు.  సెల్ప్  లవ్ ఉన్నవారు తమ మనశ్శాంతిని పోగొట్టుకోకుండా దాన్ని ఎవరి గుప్పెట్లో వారు ఉంచుకోవాలంటే కేలవం నాలుగు పనులు చేస్తే చాలు. ఆ నాలుగు పనులు ఏంటో తెలుసుకుంటే.. ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరం ఉండటం.. చాలా సార్లు ఆత్మీయులుగా అనిపించే   కుటుంబం, స్నేహితులు మరియు జీవిత భాగస్వామి మొదలైనవారు   ఆందోళనలకు దుఃఖాలకు కారణం అవుతారు.  అయితే దీన్ని అంగీకరించడం చాలా కష్టం. వాళ్లు నా వాళ్ళు వారి గురించి ఇలా అనుకుంటే ఎలా నేను పొరపడుతున్నానేమో అని మభ్యపుచ్చుకోవడం చాలామందిలో కనిపిస్తుంది. మరికొన్నిసార్లు నా వాళ్లే కదా నా మంచికోసమే చేసుంటారు అనే ఒకానొక అమాయకపు భావన కూడా మూర్ఖులుగా మార్చేస్తుంది. కానీ ఒకరి  శాంతి,  ఆనందం కోసం  ఇతరుల జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం ఎప్పుడూ సరైనది కాదని తెలుసుకోవాలి. అందరూ మీ జీవితాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందుల పాలు చేస్తుంటే   అది  చాలా నష్టాన్ని కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని  జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నవారికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని వదిలేయడం.. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడ పని చేస్తారు? ఈ విషయాలు ఎక్కువగా  జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడితో కూడిన వాతావరణం  ఆనందాన్ని,  శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ గురించి శ్రద్ధ వహిస్తే, జలగలాగా మీ మనశ్శాంతిని నెమ్మదిగా నాశనం చేసే  వాతావరణం నుండి వెంటనే  దూరం వెళ్లాలి. లేకపోతే అది క్రమంగా మానసిక జబ్బున్న వ్యక్తిగా మిమ్మల్ని మార్చేస్తుంది. బయటి విషయాలను బాధ్యులుగా మార్చకుండా ఉండటం.. మీరు మీ సమస్యలన్నింటికీ బయటి  పరిస్థితులను నిందిస్తే  జీవితంపై నియంత్రణను కోల్పోతారు. ఇలా చేసేవారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని వదిలివేస్తారు. ఇలాంటి  పరిస్థితిలో సొంతంగా చేసే   తప్పులు,  బాధల బాధ్యతను,  పర్యావసానాలను  అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  ఈ రోజుకు   రేపటిని మార్చే శక్తి ఉంటుందనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందరినీ సంతోషంగా ఉంచడానికి తమ సంతోషాన్ని త్యాగం చేయడం.. అందరినీ సంతోషంగా ఉంచడం సాధ్యం కాని పని . ఇలాంటి  పరిస్థితిలో తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ  ఇతరులకు సుఖాన్ని లేదా ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అందువల్ల, ఒక వ్యక్తి తన స్వంత ఆనందాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులను సంతోషంగా ఉంచడానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేని మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.                                                        *నిశ్శబ్ద.  

కేక్ అంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే..  మారుతున్న కాలంతో పాటు, కేక్ మన జీవితంలోని ప్రతి ఆనందంలో  భాగంగా మారింది. ఇంట్లో ఎవరి పుట్టినరోజు అయినా లేదా ప్రత్యేక సందర్భం అయినా  ఖచ్చితంగా కేక్ కట్ చేస్తారు. దీని క్రేజ్ ఎంతగా ఉందంటే ప్రతి ఒక్కరూ తమ వంటగదిలో బేకరీ లాంటి కేక్‌ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ చాలా మంది మంచి ఫలితాన్ని పొందలేరు. చివరికి   కేక్ కోసం బేకరీపై ఆధారపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేరు. కానీ ఇకమీదట అలాంటి ఫెయిల్యూర్ మీకెప్పుడూ ఎదురుకాదు. ఎందుకంటే ఇంంట్లోనే కుక్కర్లోనే మెత్తగా స్పాంజ్ కేక్  తయారుచేయడానికి కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. ఈ టిప్స్ ఫాలో అయితే అచ్చం బేకరీలో కొన్న కేక్ లా నోరూరిస్తూ అందరినీ అలరినీ అలరించే కేక్ తయారవ్వడం ఖాయం. దీనికోసం నాలుగు టిప్స్ ఫాలో కావాలి. అవేంటో తెలుసుకుంటే.. సరైన కుక్కర్‌ని ఉపయోగించాలి.. కేక్ తయారు చేయడానికి కుక్కర్ సెలక్షన్ చాలా ముఖ్యమైనది.  ఎప్పుడూ బరువైన అడుగు మందంగా,  గట్టి మూత ఉన్న కుక్కర్‌ని ఉపయోగించాలి . అలాగే కుక్కర్ మూత పెట్టేటప్పుడు  రబ్బరు తీసి మూత పెట్టాలి. ఇది కాకుండా, కేక్ చేయడానికి ముందు, కుక్కర్‌ను 5 నిమిషాలు సరిగ్గా వేడి చేయాలి. స్టాండ్ ఉపయోగించాలి..  కేక్ పిండి ఉన్న పాత్రను నేరుగా కుక్కర్‌లో ఉంచకూడదు. ఇది కేక్‌ను పాడుచేస్తుంది, అంతే కాదు  దానిని మాడిపోయేలా చేస్తుంది. అందువల్ల  ఎప్పుడూ ముందుగా కుక్కర్‌లో స్టీల్ స్టాండ్‌ను ఉంచి, ఆపై పిండి ఉన్న పాత్రను దానిపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల కేక్ బాగా బేక్ అవుతుంది. కేక్ పిండిలో వెనిగర్ కలపాలి..  బేకరీలో లాగా ఇంట్లో మెత్తగా  స్పాంజి లాంటి  కేక్ తయారు చేయాలనుకుంటే, పిండిలో అర టీస్పూన్ కంటే కొంచెం తక్కువ వెనిగర్ జోడించాలి.   ఉష్ణోగ్రత ముఖ్యం..   కుక్కర్‌లో కేక్‌లను తయారు చేస్తుంటే, గ్యాస్ స్టవ్ మీద తయారుచేయడం మంచిది.  కేక్ ఉడికే మొత్తం సమయం మధ్యస్థంగా ఉంచాలి. ఓవెన్‌లో కంటే గ్యాస్‌పై కేక్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి.  కాబట్టి అస్సలు తొందరపడకూడదు. కేక్ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి  టూత్‌పిక్‌తో ఒకటి లేదా రెండుసార్లు కేక్ లోపలికి గుచ్చి చెక్ చేయాలి.  అయితే కుక్కర్‌ని పదే పదే  తెరవడం తెరవకూడదు.  సమయాన్ని సెట్ చేసుకుని ఆ తరువాత మాత్రమే చెక్ చేయాలి.                                                                    *నిశ్శబ్ద.

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే వినాయకుడి మండపం పండుగ అంటే అందరికీ సంబరమే. కొన్ని ప్రాంతీయ పండుగలు అయితే మరికొన్ని జాతీయ పండుగలు. దేశం యావత్తు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. వినాయకుడు భక్తుల కష్టాలు తీర్చేవాడు. పార్వతీదేవి ముద్దుల తనయుడు. పరమేశ్వరుడి మెప్పు పొంది  ఏ కార్యంలోనైనా తొలిపూజ అందుకునే వరం పొందినవాడు. అష్టసిద్దులు పొందినవాడు. వినాయకుడి పూజ ఎంత నిష్ఠగా చేసుకుంటే అంత ప్రశాంతత. జీవితంలో కష్టాలు మెల్లగా తొలగిపోతాయి. అయితే ప్రతి ఒక్కరికీ తాము చేసుకునే పండుగ కాస్త ప్రత్యేకంగా ఉండాలని అనిపిస్తుంది. ఇందుకోసం  రకరకాల పిండివంటలు ఎలాగూ చేస్తారు. కానీ వినాయకుడి మండపం, దాని అలంకరణ అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలాగని ఊరికే ఉండలేం కదా. అందుకే వినాయకుడి మండపాన్ని చాలా ఈజీగా, పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో మీరే స్వయంగా ఏర్పాటు చేస్తే మీ ఇంట్లోవారే కాదు.. చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ అనకుండా ఉండలేరు. వినాయక చవితి రోజు ఇల్లు అలకడం, పిండివంటలు చేయడం అందరూ చేసేదే. కానీ ప్రకృతి ప్రియుడు అయిన వినాయకుడికి  చాలా సహజంగా మండపం ఏర్పాటు చేసి,  అంతే సహజంగా డెకరేషన్ చేయచ్చు. గ్రామీణ ప్రాంతాలలో  నివసించేవారు అయితే అరటి చెట్లు తెచ్చి పెడుతుంటారు. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉండవు. ఇలాంటి వారు ఏం చేయాలంటే  ఫ్రిడ్జ్ లు, పరుపులు, కూలర్ లు వచ్చిన అట్టముక్కలు ఉంటాయి. ఈ అట్టముక్కలను చుట్టగా చుట్టి ఏదైనా తాడు తీసుకుని బిగుతుగా కట్టేయాలి. ఇలాంటివి నాలుగు తయారు చేసుకోవాలి. వీటిని మండపానికి స్థంభాలుగా ఉపయోగించవచ్చు.  వినాయకుడి పరిమాణాన్ని బట్టి ఈ మండపాల ఎత్తు  చూసుకోవచ్చు.  నాలుగు ప్లాస్టిక్ డబ్బాలలో ఇసుక వేసి వాటిలో ఈ స్థంబాలు పెట్టాలి. ఇప్పుడు అవి బాగా గట్టిగా నిలబడగలుగుతాయి. వీటికి పైన ఒక దాన్నుండి మరొక దానికి సన్నని తీగలాంటి తాడుతో బిగుతుగా కట్టాలి. నాలుగు స్థంబాలను అనుసంధానం చేస్తూ ఇలా కట్టిన తరువాత మండపం చాలా వరకు సెట్ అయినట్టే.  ఈ అట్టముక్క స్థంబాలు బయటకు కనిపించకుండా ఉండటం కోసం  చమ్కీలతో ఉన్న చీరలకు మొదలు, చివర కుచ్చిళ్లు పెట్టి వీటిని స్తంభానికి చుట్టూరా ఉండేలా చుట్టాలి. ఇందుకోసం సేప్టీ పిన్ ఉపయోగించవచ్చు. లేదా జాగ్రత్తగా స్టాప్లర్ కూడా ఉపయోగించి ఫిక్స్ చేయవచ్చు.  రెండు స్థంభాలకు ఒక చీర చెప్పున ఫిక్స్ చేయాలి. పైన చాలా తేలికగా ఉన్న చీర లేదా చున్నీ వేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ చీరలు బరువు లేకుండా చాలా తేలికగా ఉండాలి. వినాయకుడు ప్రకృతి ప్రియుడు.. అందుకే అలంకరణ చాలా సహజంగా పువ్వులు, తీగలు, లైట్లతో ఉంటే  బాగుంటుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను ఒకదానికొకటి ముడివేస్తూ పొడవాటి తీగలాగా తయారుచేసుకోవాలి. దీనికి తెలుపు, ఎరుపు, పసుపు మందారాలతోనూ, కాగితం పువ్వులతోనూ అలంకరణ చేయాలి. ఆకుపచ్చని ఆకులను మధ్యలో అక్కడక్కడా ఉంచాలి. ఇలా చేస్తే చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటుంది.  ఇక వినాయకుడికి ఆసనం కోసం పెద్ద పీట వేసి మధ్యలో ఆయన్ను ప్రతిష్టించాలి.  అయితే  పూజ కోసం వెలిగించే దీపాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  దీపాలు పొరపాటున చీరలకు తగిలినా సంతోషం మొత్తం విషాదంగా మారుతుంది. మండపానికి ఇరువైపులా రెండు టేబుళ్లు వేసి వాటిమీద  ఒకే రంగు చున్నీలతో కవర్ చేయాలి. దీంతో అది ఎంతో అందంగా కనిపిస్తుంది. వీటిమీద పువ్వులు, గరిక రెండు కలిపి ఉంచితే చాలా ఆకట్టుకుంటుంది. ఈ మండపానికి మరింత మెరుపులు తీసుకురావడం కోసం  చిన్న లైట్లు అయినా సెట్ చేయవచ్చు. అవి పెట్టడానికి  అనుకూలం లేకపోతే ఛార్జ్ లైట్లు ఉంటాయి. వాటిని నాలుగు మూలలా ఏర్పాటు చేయవచ్చు. వినాయకుడి విగ్రహానికి అలంకరణ కోసం అందుబాటులో ఉన్న రంగురంగుల పువ్వులను ఉపయోగించాలి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే భక్తి్పేరుతో వినాయకుడిని పువ్వులు, పత్రితో ముంచెత్తకూడదు. వినాయకుడిని ఆసీనం చేసినతరువాత కొంచెం ముందుగా పీట వేసి పువ్వులు, పండ్లు, ప్రసాదాలు మొదలైనవి ఉంచాలి. వినాయకుడు ప్రకృతి ప్రియుడు కాబట్టి సహజమైన అలంకరణ, భక్తితో చేసే పూజ,  భక్తిగా సమర్పించే ప్రసాదం ఆయన్ను సంతుష్టుడిని చేస్తుంది.                                              *నిశ్శబ్ద.  

 భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే మొదట ఈ పని చెయ్యాలి..   భారతదేశంలో వివాహ బంధానికి చాలా గొప్ప ప్రాధ్యాన్యత  ఉంది. అయితే దురదృష్టవశాత్తు నేటికాలంలో  ఈ వివాహ బంధం చాలా  పెలుసుగా మారిపోయింది. నిన్నటిదాకా ఎంతో నవ్వుతూ గడిపిన భార్యాభర్తలు సడన్ గా గొడవ పడతారు. ఆ తరువాత విడాకులు అంటారు. ఇలాంటి సంఘటనలే ఎక్కువ ఉన్నాయి చాలాచోట్ల. పెళ్ళిళ్ళు ఏమో ఆకాశమంత పందిరి వేసి ఎంతో ఘనంగా చేసుకుంటారు కానీ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం చతికిలబడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరిగినా, విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నా దానికి ముఖ్యకారణం ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం ఉండటమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే వెంటనే చేయాల్సిన పని ఒకటుంది. షేరింగ్ వద్దు.. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే  చాలామంది తమకు దగ్గరగా ఉన్న వ్యక్తితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అయితే తల్లులు, స్నేహితురాళ్లు,ఎవరూ ఊహించని విధంగా వారి నుండి దూరమైన పాత ప్రియుడికి కూడా తన భర్తతో ఉన్న విభేధాల గురించి చెబుతుంటారు. ఇలా భార్యాభర్తల గొడవ గురించి అందరికీ చెప్పుకోవడం వల్ల బంధం పట్ల ఇతరుల్లో చులకన భావం ఏర్పడుతుంది, మనుషుల మీద కూడా చిన్న చూపు కలుగుతుంది. ఇలాంటి సందర్బాలలో చాలామంది రెచ్చగొడుతుంటారు. నువ్వలా చెయ్యి, ఇలా చెయ్యి అని సలహాలు ఇస్తుంటారు. ఆ సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ నిజమేనని అనిపిస్తాయి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే బంధం మరింత బలహీనం అవుతుంది తప్ప తిరిగి బలంగా తయారవ్వదు. వీళ్ళకు దూరంగా ఉండాలి. లైఫ్ పార్టనర్ తో గొడవలు జరిగినప్పుడు పొరపాటున ఎప్పటినుండో పరిచయం ఉన్నవారికి చెప్పుకుంటే వారు కొన్ని సలహాలు ఇస్తారు. నిజానికి మంచి కోరేవారు అయితే  బంధాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో వారికి తెలిసి ఉంటుంది. సందర్భానికి తగినట్టు మంచి సలహా ఇస్తారు. కానీ అవతలి వారి జీవితంలో కూడా భార్యాభర్తల గొడవలుండి వారితో బంధం తెంచుకుని ఉంటే మాత్రం వారి సలహాలు తీసుకోకూడదు. ముఖ్యంగా జీవితంలో వివిధ సమస్యలతో డిప్రెషన్ అనుభవిస్తున్న వారి సలహాలు తీసుకోవడం, వారికి దగ్గరగా ఉండటం చేయకూడదు. డిప్రెషన్ ఉన్నవారికి సహాయం చేయవచ్చు కానీ వ్యక్తిగత బంధాలు,  వాటి నిర్ణయాలు వారి చేతిలో పెట్టకూడదు.  ఎంటర్టైన్మెంట్ కావొద్దు.. కొందరికి  గొడవలంటే భలే ఇష్టం ఉంటుంది. ఇలాంటి వారు భార్యాభర్తల మధ్య గొడవలను చూసి పైకి అయ్యో పాపం అంటున్నా లోలోపల సంతోషపడుతుంటారు. వీరిది కాస్త మానసిక శాడిజం అని చెప్పవచ్చు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడా చెప్పేవారు కూడా ఎంతో స్నేహితులు అయినట్టు ఉంటారు. వీరినుండి కూడా దూరం ఉండాలి. ఇలాంటి వ్యక్తులకు భార్యాభర్తల విషయాలు చెప్పడం కానీ, వారి సలహా తీసుకోవడం కానీ చేయకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగకూడదని అనుకున్నా, జరిగిన గొడవలు పరిష్కారం కావాలన్నా  కచ్చితంగా పైన చెప్పుకున్న మనుషులకు దూరంగా ఉండాలి.                                           *నిశ్శబ్ద.

భారతదేశానికి కీర్తి తెచ్చిన బచేంద్రి పాల్.. ఆమె ప్రయత్నం ఇదే.. మనిషి దృఢ సంకల్పంతో ఉంటే ఎంత పెద్ద పని అయినా  సులభంగా చేయగలుగుతాడు. ఈ  విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఎంతోమంది వ్యక్తుల  జీవితాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఇలాంటి వారిలో బచేంద్రి పాల్ కూడా ఒకరు. బచేంద్రి పాల్ అనే పేరు వినగానే చాలామందికి ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అనిపిస్తోందా?  చిన్నప్పుడు  జి.కే బిట్స్ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు పరిచయమే. ఎవరెస్టు శిఖరాన్ని అధిగమించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్ అని టక్కున చెప్పేవాళ్ళం.  1984లో మహిళలకు ఈ సమాజంలో ఏమాత్రం ప్రోత్సాహం లభించని కాలంలో బచేంద్రి పాల్ సాధించిన ఈ ఘనతకు ప్రపంచం యావత్తు సలామ్ చేసింది. మహిళలకు స్పూర్తిని రగిలించే ఈమె గురించి తెలుసుకుంటే.. బచేంద్రి పాల్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా నకూరి గ్రామంలో 1954 మే 24న జన్మించారు. ఈమె అప్పటికే  బిఎలో గ్రాడ్యుయేషన్,  సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, బచేంద్రి పాల్ తన బి.ఎడ్ పూర్తీ చేసింది. ఆమె ఉపాధ్యాయురాలు కావాలని ఆమె కుటుంబం ఆశించింది. అందుకు తగ్గట్టే ఆమెను భోదనా రంగంవైపు వెళ్లమని సూచించింది. కానీ బచేంద్రి పాల్ కు మౌంటెనింగ్ మీద చాలా ఆసక్తిగా ఉండేది. ఆమె లక్ష్యం, కుటుంబ సభ్యుల అభ్యర్థన వేరు వేరు ఉండటంతో ఆమె ఏం చేయాలనే విషయం పై గందరగోళం అనుభవించింది. కానీ చివరికి తన అభిరుచినే ఆమె కొనసాగాలని నిర్ణయించుకుంది.  కానీ పర్వతారోహకురాలు కావడానికి పాల్‌కు  కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. బచేంద్రి పాల్ తండ్రి కిషన్ పాల్ సింగ్ సాధారణ వ్యాపారవేత్త. లక్ష్యం వైపు ఎలా వెళ్ళిందంటే.. బచేంద్రి పాల్ మౌంటెనీరింగ్ మీద  ఆసక్తితో   నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది.  ఈ  ఇన్‌స్టిట్యూట్‌ వారు 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఒక సాహసయాత్ర బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పేరు  పేరు ఎవరెస్ట్ 84. ఈ టీమ్‌లో బచేంద్రి పాల్ కూడా ఉన్నారు. ఎవరెస్ట్ ఎక్కడానికి వీరికి శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ తర్వాత వీరి  బృందం అదే సంవత్సరం మేలో ఎవరెస్ట్ అధిరోహణకు  బయలుదేరింది. మే 23, 1984న, బచేంద్రి పాల్  ఎవరెస్ట్ అధిరోహిస్తున్న సమయంలో వాతావరణం చాలా వ్యతిరేకంగా ఉంది, మంచు  తుఫాను ప్రభావం అధికంగా ఉంది. అయనా ఆమె ఎక్కడా వెనుదిరగకుండా  కఠినమైన మార్గం గుండా ప్రయాణించి  ఎవరెస్ట్‌ను అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఈమె  భారతదేశానికి తెచ్చిన గుర్తింపుకు గానూ 1984లో పద్మశ్రీ, 1986లో అర్జున అవార్డు అందుకున్నారు. ఇది కాకుండా, ఈమె 2019 లో పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఈమె ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలిచారు.                                                                   *నిశ్శబ్ద  

సైనికుల‌కు స‌లాం చేస్తున్న జ‌య `జై- హింద్‌`! వాళ్లు ఎండావాన‌ల‌కి చ‌లించ‌రు, కొండాకోన‌ల‌కి త‌ల‌వంచ‌రు. ప‌చ్చ‌ద‌న‌మే ఎరుగ‌ని ఎడారిలో ఉన్నా, నేల‌నేది క‌నిపించ‌ని న‌డిసంద్రంలో ఉన్నా... వాళ్ల మ‌న‌సుల్లో ఒకటే ఆలోచ‌న‌, వాళ్ల జీవితాల్లో ఒక‌టే ల‌క్ష్యం, వాళ్ల చేత‌ల్లో ఒక‌టే త‌ప‌న‌ - అదే దేశ ర‌క్ష‌ణ‌! మ‌న భ‌ద్ర‌తా ద‌ళాల గురించి ఇలా ఎన్ని విష‌యాలు చెప్పుకున్నా, చెప్పాల్సింది ఇంకా మిగిలిపోయిన‌ట్లే తోస్తుంది. వారికి ఎన్ని వేల కృత‌జ్ఞ‌త‌లు అందించినా, మిగిలిపోయే రుణం ఏదో ఉంది. అందుకే వారి ఔన్న‌త్యం గురించి ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు, వారి మ‌న‌సులోని మాట‌ల‌ను మ‌న‌కి చేర‌వేసేందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు `జ‌యపీస‌పాటి`. అదే జై - హింద్‌!!! హాంగ్‌కాంగ్ నుంచీ తెలుగువారందికీ ఆత్మీయ‌వార‌థిగా నిలిచేందుకు `టోరీ` అనే ఇంట‌ర్నెట్ రేడియోని మొద‌లుపెట్టింది `తెలుగువ‌న్` సంస్థ‌. అందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉన్న‌చోట నుంచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ టోరీని విజ‌య‌వంతం చేశారు. హాంగ్‌కాంగ్ నుంచి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే జ‌య‌పీస‌పాటి వారిలో ఒక్క‌రు. అప్ప‌టికే జ‌య హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న తెలుగువారికోసం కె.పి.రావు దంప‌తుల‌తో క‌లిసి `హాంక్‌కాంగ్ తెలుగు స‌మాఖ్య‌` అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. వంద‌కు పైగా తెలుగు కుటుంబాల‌కు ఆ స‌మాఖ్య ఒక వేదిక‌గా ఉంది. సైనికుల కోసం ఏద‌న్నా మొద‌ట్లో జ‌యపీస‌పాటి శ‌ని, ఆదివారాల్లో రెండేసి గంట‌ల పాటు రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేవారు. ఇవ‌న్నీ స‌ర‌దాస‌ర‌దాగా సాగిపోయేవి. కానీ దాంతో ఆమెకు ఎందుకో తృప్తి క‌ల‌గ‌లేదు. జ‌య‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సాయుధ‌ద‌ళాల‌కు అనుబంధంగా ప‌నిచేయాల‌నే కోరిక తీవ్రంగా ఉండేది. అదెలాగూ సాధ్య‌ప‌డ‌లేదు. క‌నీసం మ‌న చీక‌టి రాత్రులు సుర‌క్షితంగా ఉండేందుకు త‌మ జీవితాల‌ను వెలిగిస్తున్న సైనికుల కోసం ఏద‌న్నా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. సైనికుల గురించి ఎక్క‌డో స్కూళ్ల‌లోనో, కాలేజీల్లోనో చెప్ప‌డం త‌ప్ప మిగ‌తా మాధ్య‌మాలు అంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేద‌ని గ్ర‌హించారు జ‌య‌. దేశం కోసం త‌మ ఆశ‌ల‌ను ప‌ణంగా పెట్టిన వారి మ‌న‌సులో ఏముంటుంది! ఆ ఉన్న‌త భావాలు మిగ‌తా ప్ర‌జ‌ల‌కు చేరితే అవెంత ప్ర‌భావ‌వంతంగా ఉంటాయో క‌దా అనిపించింది ఆమెకు! అలా రూపుదిద్దుకున్న‌దే `జై- హింద్` కార్య‌క్ర‌మం! సైనికులు మాట్లాడితే `జై-హింద్‌` కార్య‌క్ర‌మం గురించిన ఆలోచ‌న‌ను చెప్ప‌గానే చాలా ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ఒక చిన్న‌పాటి కార్య‌క్ర‌మంలో మాట్లాడేందుకు సైనికులు ఒప్ప‌కుంటారా! ఒక‌వేళ వాళ్లు ఒప్పుకుని ఏద‌న్నా మాట్లాడినా అది చ‌ట్టాన్ని ఉల్లంఘంచిన‌ట్లు కాదా! సెల‌బ్రిటీలు కాకుండా ఎవ‌రో సైనికులు మాట్లాడితే వినేది ఎవ‌రు!... లాంటి స‌వాల‌క్ష స‌వాళ్ల‌ను జ‌య ఎదుర్కొన్నారు. కానీ జ‌య వాట‌న్నింటినీ దాటి విజ‌యం సాధించారు. సెల‌బ్రిటీలు మాట్లాడితే ఆస‌క్తితో వింటార‌నీ, సైనికులు మాట్లాడితే అభిమానంతో వింటార‌నీ నిరూపించారు.  మూడేళ్ల విజ‌యం 2012 మ‌ధ్య‌కాలంలో మొద‌లైన జైహింద్ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికి మూడు సంవ‌త్స‌రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసుకుంది. ఈ మూడు సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఏమంత తేలిక‌గా సాగ‌లేదు. మొద‌ట్లో...  సైనికుల‌ను ఎలా సంప్ర‌దించాలి. మాట‌ల సంద‌ర్భంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఎలా మెల‌గాలిలాంటి స‌మస్య‌లెన్నో ఆమె ఎదుర్కొన్నారు. పైగా జ‌య‌కు ఇంట్లో ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త ఉద్యోగ‌రీత్యా త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి రావ‌డంతో, ఆ ఇద్ద‌రి పిల్ల‌ల బాధ్య‌త‌నీ పూర్తిగా చూసుకోవాల్సి వ‌చ్చేంది. పైగా తాను ఒక పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్నారు. ఇన్ని బాధ్య‌త‌ల మధ్య కూడా, ఆమెకు దేశం ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌తే `జై-హింద్‌` కార్య‌క్ర‌మాన్ని ముందుకు న‌డిపించింది. నొప్పించ‌క తానొవ్వ‌క‌ `జై-హింద్‌` కార్య‌క్ర‌మం కేవ‌లం సైనికుల‌తో స‌ర‌దాగా సాగిపోయే సంభాష‌ణ‌లా ఉండ‌దు. వారి నేప‌థ్యం ఏమిటి, సైనిక‌ద‌ళాల‌లో చేరేందుకు వారిని పురికొల్పిన ప‌రిస్థితులు ఏంటి, వారి అభిరుచులు, కుటుంబం... వంటి విష‌యాల‌ను చ‌ర్చిస్తూనే వాటిని తిరిగి శ్రోత‌ల‌కు తెలుగులో చెబుతారు జ‌య‌. ఒక‌వైపు సైన్యంలో ఉండే ద‌ళాలు ఎంత‌టి క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొంటాయో తెలియ‌చేస్తూనే,  సైన్యంలో ఉండేవారికి ప్ర‌భుత్వం క‌ల్పించే స‌దుపాయాలను సంద‌ర్భానుసారంగా వివ‌రిస్తుంటారు. సైనికుల‌తో ఒకో ముఖాముఖి సాగే కొద్దీ `నొప్పించ‌క తానొవ్వ‌క‌` రీతిలో సంభాష‌ణ‌ను సాగించే నేర్పు జ‌య‌కు పూర్తిగా అల‌వ‌డిపోయిన‌ట్లే తోస్తుంది. సైనికుల బాధ్య‌త ఒక్క స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం అనుకునే సామాన్య‌ల‌కు, సైన్యం అందించే సేవ‌లు విని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఉదా|| ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు ఏద‌న్నా స‌మ్మెను చేప‌డితే, దానివ‌ల్ల ర‌వాణా ఆగిపోకుండా ఉండేంద‌కు `రైల్వే టెరిటోరియ‌ల్ ఆర్మీ` స‌దా సిద్ధంగా ఉంటుంద‌న్న విష‌యం చాలామందికి తెలియ‌దు. సైన్యానికి చేతులెక్కి మొక్కాల‌నిపించే ఇలాంటి విష‌యాలు కోకొల్ల‌లుగా `జై-హింద్‌`లో వినిపిస్తాయి. కార్య‌క్ర‌మం తీరుతెన్న‌లు: సైనికుల కోసం జరిగే `జై-హింద్‌` జాతీయ గేయంతో మొద‌లై, జాతీయ గీతంతో ముగియ‌డం స‌ముచితంగా తోస్తుంది. మ‌న కోసం ప్రాణాలు అర్పించ‌డానికి కూడా వెనుకాడ‌రు సైనికులు. అందుకే వారు నిండునూరేళ్లూ జీవించాలంటూ, ఈ కార్య‌క్ర‌మం ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను అంద‌చేస్తారు. ఆ త‌రువాత ప్రోగ్రాంలోకి విచ్చేసే విశిష్ట అతిథులు చెప్పే విష‌యాల‌కు మ‌న‌సంతా దేశ‌భ‌క్తితో నిండిపోతుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మంచిమంచి పాట‌లూ విన‌వ‌స్తాయి, శ్రోత‌ల‌ ప్ర‌శ్న‌లూ కార్య‌క్ర‌మానికి మ‌రింత వ‌న్నె తెస్తాయి. ఇందులో పాల్గొనే ప్ర‌తి ఒక్క సైనికుడూ ప్ర‌త్యేక‌మే! మ‌న సికింద‌రాబాదులోనే ప‌నిచేస్తున్న మేజ‌ర్ నిషాసింగ్ చిన్న‌నాటి క‌బుర్లు; కార్గిల్ పోరులో కాలు పోగొట్టుకుని, రెండు సంవ‌త్స‌రాలు ఆసుప‌త్రిలో గ‌డిపినా కూడా మార‌థాన్లో పాల్గొంటున్న మేజ‌ర్ డి.పి.సింగ్ పోరాటం;  కార్గిల్ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన కేప్ట‌న్ సౌర‌భ్ కాలియా గురించి ఆయ‌న తండ్రి ఎన్‌.కె.కాలియా పంచుకున్న జ్ఞాప‌కాలు... ఇలా ఒక్కో కార్య‌క్ర‌మం ఒక్కో స్ఫూర్తిచిహ్నంగా మిగిలిపోతుంది. జ‌య‌పీస‌పాటి నిర్వ‌హించే ఈ కార్యక్ర‌మం గురించి జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. `జై-హింద్‌` అనే కార్య‌క్ర‌మం ఒక‌టి న‌డుస్తోంద‌ని అంద‌రికీ తెలిసింది. కానీ ఎవ్వ‌రికీ తెలియ‌కుండా... జ‌రుగుతున్న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం కూడా ఉంది. బ‌తికితే రాజాలాగానే బ‌త‌కాలి, సంపాదిస్తే ల‌క్ష‌ల్లోనే సంపాదించాలి అనుకునే యువ‌త దీని నుంచి ప్ర‌భావితం అవుతోంది. ఏదో ఒక రోజున ఒక సైనికుడిని `మీరు సైనికుడిగా ప్రేర‌ణ క‌లిగించిన సంద‌ర్భం ఏంటి?` అని జ‌య‌పీస‌పాటి అడిగితే `మీ కార్య‌క్ర‌మాన్ని వినే సైనికుడిగా మారాల‌నుకున్నాను` అని ఎవ‌ర‌న్నా చెప్పే రోజు కూడా వ‌స్తుందేమో! - జై - హింద్‌!!! - నిర్జ‌ర‌.

విద్యతో.. సేవతో.. భారతదేశాన్ని పునీతం చేసిన వీర వనిత.. కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ.. 'కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నిలవద"ని పండితుడు, చరిత్ర కారుడు, విజ్ఞానచంద్రికా మండలి స్థాపకుడు అయిన శ్రీ కొమ్మ జాజు లక్ష్మణ రావుగారి భావన. సంఘ సంస్కారి, సేవాతత్పరురాలు, విద్యావతి, అబలా సచ్చరిత్ర రత్నమాల అనే బృహద్గ్రంధ రచయిత్రి అయిన శ్రీమతి భండారు అచ్చమాంబ శ్రీ లక్ష్మణరావు సోదరి. ఆమె అకాలమరణం చెందగా  ఆమె పట్లగల ఎనలేని  గౌరవ అభిమానాల కారణంగా ఆయన తన కూతురుకి అచ్చమాంబ అని పేరు పెట్టుకున్నారు. ప్రాణాధికంగా పెంచి తనలో చెలరేగే వున్నత భావాలను, ఆదర్శాలను, సంస్కార భావాలను పసితనంనుంచే ఆమెకు నూరి పోశారు. అందుకే ఆమె దృష్టిలో స్త్రీ అంటే చీటికి మాటికి బేలగా కన్నీరుకార్చే బలహీనురాలు, వాజమ్మకాదు. ఎదురయ్యే సమస్యలను ధైర్యంతో పరిష్కరించుకుని నిబ్బరంగా ముందుకు సాగిపోగల ఆత్మాభిమాని, కరుణామయి. సానుభూతికి బదులు గౌరవం అందుకోవలసిన మానవ జాతిలో సగభాగం స్త్రీ అని భావన. ఆమె 1906 అక్టోబరు 6న గుంటూరులో జన్మించారు. ఆమె తల్లి శ్రీమతి రామకోటమాంబ. ఆమె పెరగటం, చదవటం మద్రాసులో జరిగింది. అశాంతి, కల్లోలం తొలగించి ప్రశాంతత నెలకొల్పాలని అవసరంలో వున్నవారికి చేయి అందించాలని ఆమెకు చిన్ననాటినుంచే అనిపించేవి. వస్తుతః స్వతంత్రభావన అధికంగాగల ఆమె చదువుకునే రోజుల్లోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితుసాలైంది. విదేశీ వస్తు వస్త్రాలను బహిష్కరించింది. నూలు వడికేది, ఖాదీ ధరించేది ఉబుసుపోక కాలక్షేపానికి యేపని చేయటం ఆమెకు నచ్చదు. ప్రతిదాని గురించి చాల తీవ్రంగా ఆలోచించటం అలవాటు.  1923లో అనుక్షణం ఆమెను తీర్చిదిద్దుతున్న తండ్రి అకస్మాత్తుగ గుండెపోటుతో మరణించారు. జీవితానికొక లక్ష్యమంటూ ఉండాలన్న సంకల్పంతో ఆమె మెడికల్ కాలేజిలో చేరారు. ఎప్పుడూ యేవో సభల్లో సమావేశాలలో పాల్గొంటు ధాటిగా వుపన్యసించేవారు. సైమన్ కమిషన్ పట్ల నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు. శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి స్థాపించిన యూత్ లీగ్ లో చేరి జాతీయోద్యమ ప్రచారం చేశారు. తల్లి రామకోటమాంబగారితో సహా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. విద్యార్థి వుద్యమం నడిపారు. తుపాకి పోట్లకి, లాఠీ దెబ్బలకు క్షతగాత్రులయిన వాలంటీర్ల సపర్యలకు చికిత్సకు ఆసుపత్రి నెలకొల్పారు. 1931 నాటికి మెడికల్ కాలేజీలో చదువు ముగిసింది. కాని ఆమెకు సంతృప్తి కలగలేదు. శిశు సంరక్షణ, ప్రసూతి శాస్త్రాలు యింకా బాగా చదివి, దేశంలోని స్త్రీలకు మరింతగా వైద్య సహాయం అందించాలన్న తలంపుతో ఇంగ్లండులో  చదివి, మూడు ప్రత్యేక పరీక్షలు నెగ్గి డిగ్రీలతో వచ్చారు.  స్త్రీలకు విజ్ఞాన వికాసాలు కల్పించాలనే కోరికతో ప్రసూతి, శిశు పోషణ అనే గ్రంథాన్ని తెలుగులో సులభ శైలిలో అందరికి అర్థమయ్యే పదాలతో వ్రాశారు. ఆనాటివరకు అటువంటి వైద్య పుస్తకం సామాన్య ప్రజల అందుబాటులోకి రాలేదు. అందువల్ల ఆ పుస్తకం  ప్రచారంపొంది ఆమె ఆశయం తీరింది. అధిక ఆహారోత్పత్తి ప్రచార సందర్భంలో డాక్టరు అచ్చమాంబ స్వయంగా గునపం పట్టుకుని ప్రతి రోజు కొన్ని గంటలకాలం తవ్వటం, మట్టి మోయటం వంటి పనులు చేశారు. అతి నాజూకైన సూక్ష్మ పరికరాలు పట్టి ఆపరేషన్లు చేసే డాక్టరు గునపంపట్టి యెండలో తవ్వుతుంటే మరి అనుసరించే అభిమానులకు కొరత వుండదుగదా. ప్రజలకు అత్యంత సన్నిహితులై నారు. 1940లో వఝల వెంకటరామశాస్త్రి గారిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి లక్ష్మీ వారి ఏకైక సంతానం.   పసివారిని చిన్నప్పటి నుంచి తగిన జాగ్రత్తతో పెంచి, తీర్చి దిద్దితే వాళ్లు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యవంతులైన చక్కని భావి పౌరులు కాగలరని ఆమె నమ్మకం. 20 మంది పిల్లలు, 11 మంది టీచర్లతో ఆమె విజయవాడలో స్థాపించిన మాంటిసోరీ స్కూలు ఈనాడు వేలకొద్దీ పిల్లలతో, వందమంది టీచర్లతో, బ్రహ్మాండమైన గ్రంథాలయంతో స్వంత భవనాలతో విజయవంతంగా నడుస్తోంది. 1948 జూన్లో శాసనోల్లంఘనం చేసి జైలుకు వెళ్లారు. రాయవేలూరులో 7 నెలలు గడిపి వచ్చారు. 1957లో కాంగ్రెసు తరఫున శాసన సభకు ఎన్నికయినారు.  1964 అక్టోబరు 20న గుండె పోటుతో మరణించారు. ఆ సమయంలో ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టుకున్నారు. ఇలా కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది.                                           *నిశ్శబ్ద. 

మహిళలు భర్తల కోసం చేయకూడని పనులు ఈ ప్రపంచంలో అతి గొప్ప బంధం వివాహబంధమే. మధ్యలో ముడిపడే ఈ బంధం జీవితం చివరికంటా తోడుగా ఉంటుంది. అంతేనా.. జీవితంలో దైర్యం, నమ్మకం, జీవితం మీద ఆశ కలిగించేది ఈ బంధమే. చాలావరకు వివాహ బంధంలో మహిళలు చాలా మారిపోతారు. వస్త్రాధారణ నుండి ఆహారపు అలవాట్ల వరకు ఎన్నో విషయాలలో మారతారు. కొత్తగా పెళ్ళయ్యాక భార్యలు భర్తలను ఇంప్రెస్ చేయడానికి వారికి నచ్చినట్టు మారతారు. భర్తలు కూడా భార్యలను సంతోషపెట్టడానికి ఎన్నెన్నో చేస్తారు. అయితే మొత్తం మీద చెప్పుకుంటే భర్తల కోసం మారిపోయే మహిళలే ఎక్కువ. అదంతా ప్రేమ అని అనుకుంటారు. కానీ భర్తల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కొన్ని ఇష్టాలు మార్చుకోకూడదు. ఇలా చేస్తే మొదట్లో వారికోసం అంటూ చేసిన పనులు ఆ తరువాత మహిళల జీవితాలకే పెద్ద సమస్యలుగా మారతాయట. అసలు మార్చుకోకూడనివి ఏంటి? చేయకూడనివి ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. నియంత్రణకు లోను కావొద్దు.. పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు భర్తలకు నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఇందులో భాగంగా భర్త ఆ పనులు చేయకు, ఈ పనులు చేయకు, ఆ దుస్తులు వేసుకోకు, ఆ తిండి తినకు, వారితో మాట్లాడకు అలా ఉండకు, ఇలా ఉండకు అని చెబుతూ ఉంటాడు. అవన్నీ వినకపోతే భార్యకు భర్తమీద గౌరవం లేదని, ప్రేమ లేదని అనుకుంటారేమోననే సంకోచంతో మహిళలు ఈ మాటలను గౌరవిస్తారు. ఫలితంగా భర్త చెప్పినట్టు చేస్తారు. మొదట్లో భార్యలు గౌరవం అనుకున్నది కాస్తా ఆ తరువాత ఇబ్బందిగా మారుతుంది. భర్త పూర్తీ భార్య జీవితాన్ని నియంత్రించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. భర్తకు, అతని ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగనంతవరకు భార్యలు చేసే పని ఏదైనా మానుకోవాల్సిన పని లేదు. తిట్టడం, చెయ్యిచేసుకునే అలుసు ఇవ్వద్దు.. భార్యలు అంటే భర్త దగ్గర మాటలు పడటానికి, వారి చేతిలో దెబ్బలు తినడానికి దొరికిన ఆప్షన్ కాదు. చాలామంది భర్తలు వారి మానసిన అసంతృప్తిని, ఇతరుల మీద కోపాన్ని భార్యలపైన చూపిస్తుంటారు. తిట్టడం, చెయ్యిచేసుకోవడం మొదలైన విషయాలకు వారికి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మహిళలు తమకు ఇష్టం లేకుండా పడక గది కార్యాకలాపాలలో పాల్గొనద్దు. ఇది ఒకసారి  అలవాటైతే జీవితాంతం మహిళలకు ఇష్టం లేని సమయంలో భర్తల చేతుల్లో సెక్స్ డాల్స్ గా మారే ప్రమాదం ఉంది. దూరంగా ఉండకండి.. చాలామంది మహిళలకు తమ భర్తలు పనిచేసే ఆఫీసు, అతని కొలీగ్స్, అతని స్నేహితులు వంటి విషయాల గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ మహిళలు  అడిగినా నీకెందుకు ? అని దబాయించే మగవారుంటారు. కానీ మగవారి స్నేహితులు, ఆఫీసులు కొలీగ్స్, ఇతర పరిచయస్తుల నుండి దూరంగా ఉండద్దు. భర్త మీద అనుమానం కాదు, అతనికి తెలిసిన వారితో టచ్ లో ఉండటం వల్ల కొన్నిసార్లు  కొన్ని పనులు, ఇబ్బందులు చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఇష్టాల్ని మార్చుకోకండి.. భర్తలు భార్యల మీద కొన్ని విషయాల్లో ఒత్తిడి తెస్తారు. వీటలో ముఖ్యమైనది శరీరానికి సంబంధించినవే. వాళ్లకు నచ్చని దుస్తులు వేసుకుంటే ఎగతాళి చేయడం, వారికి  నచ్చని ఆహారం తింటే లావైపోయావనో, మరే ఇతర కారణంతోనో బాడీ షేమింగ్ చేయడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా నా పెళ్లాం నేను చెప్పినట్టు వింటుందనో, అతనొక హిట్లర్ మొగుడిలా బంధువులు, స్నేహితుల ముందు బిల్డప్ ఇవ్వడానికో భార్య మీద అజమాయిషీ చేస్తుంటారు. ఇలాంటి వాటికి అస్సలు ఆస్కారం ఇవ్వకండి. భార్యల్ని ఇష్టపడే భర్తలు ఎప్పుడూ తమ భార్యలను నియంత్రించాలని కోరుకోరు. మరీ ముఖ్యంగా భార్య ఇష్టాలను, కోరికలను గౌరవిస్తారు. ఎవరిముందూ కించపరచరు. తమకోసం ఏమీ మారక్కర్లేదనే విషయాన్ని ప్రవర్తనలోనే స్పష్టం చేస్తారు. భార్యలు పూర్తీగా భర్తలకు అనుకూలంగా మారిపోతే భార్యలకంటూ ఎలాంటి విలువా ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి.                                                          *నిశ్శబ్ద.