శీతాకాలంలో జట్టు పొడిబారుతోందా? ఇలా  చేయండి.! శీతాకాలంలో వాతావరణ ప్రభావం శరీరంతోపాటు శిరోజాలపై కూడా పడుతుంది. దాంతో జట్టు బలహీనంగా, నిర్జీవంగా, చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. అందుకే కాలానికి అనుగుణంగా మనం శిరోజాలను సంరక్షించుకోవాలి. దానికోసం ఏవేవో కొనేసి కష్టపడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే దొరికే వాటితో మన కురులను సంరక్షించుకోవచ్చు. ఎలాగో చూద్దాం. - జుట్టు పొడిగా మారి, చివర్లు చిట్లుతున్నట్లు కనిపిస్తే..బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి, దానిలో4 చెంచాలా  కొబ్బరినూనె, చెంచా చొప్పున తేనె, గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పూతలా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇందులోని గ్జిజరిన్ తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. చివర్లు చిట్టకుండా కాపాడుతాయి. - 5 చెంచాల శనగపిండికి రెండు చెంచాల చొప్పున ఆలివ్ నూనె, పెరుగు కలిపి మెత్తని పేస్టు చేసుకోవాలి. దీన్ని మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్ వలే పనిచేస్తుంది. అంతేకాదు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. ఆలివ్ నూనె జుట్టుకు మంచి కండిషనర్ వలే పనిచేస్తుంది. -గుడ్డులోని తెల్లసొనకు 2చెంచాల చొప్పున శనగపిండి, బాదంపొడి, తగినంత రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టు వలె చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత తక్కువగా గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. - జుట్టు పొడిబారకుండా ఉండాలంటే..2 చెంచాల మెంతిపిండికి 4 చెంచాల కొబ్బరిపాలను కలిపి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని మాడుకు పట్టించి మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. అంతే మీ జుట్టు పొడిబారకుండా సిల్కీగా మెరుస్తుంది.

బ్యూటీ క్రీములు కాదండోయ్.. ఈ అయిదు  తింటే నిత్యయవ్వనంగా ఉంటారు! ఆహారమే ఆరోగ్యం అని అంటారు. కానీ చాలామంది జిహ్వచాపల్యం కోసం ఆహారాన్ని తీసుకుంటారు. దీనికారణంగా శరీరం తొందరగా వృద్దాప్యం బారన పడుతుంది. చాలామంది చిన్నవయసులోనే అంకుల్స్, ఆంటీలుగా కనబడటానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఇలా చిన్న వయసులోనే వృద్దాప్యం అటాక్ చేయడం వల్ల చాలామంది బ్యూటీ ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. ఫలానా క్రీము రాసుకుంటే చర్మం మీద ముడతలు పోతాయని, ఫలానావి వాడితే చర్మం తెల్లగా మారుతుందని, మచ్చలు లేని ముఖ సౌందర్యం సొంతమవుతుందని.. ఇలా రకాలుగానే ప్రజలను ఆకర్షిస్తారు. కానీ ఇలా చిన్నవయసులోనే పెద్దవాళ్లుగా కనిపించడానికి కారణం కొల్లాజెన్ లోపించడం. కొల్లాజెన్ తిరిగి భర్తీ కావడానికి కొన్ని ఆహారాలున్నాయి.    బ్యూటీ ప్రోడక్ట్స్, క్రీములు వంటివి ఓ పక్కన పెట్టేసి కింద చెప్పుకున్న ఆహారాలు తీసుకుంటే చాలు.. కొద్దిరోజుల్లోనే తిరిగి యవ్వనంగా కనిపిస్తారు. అసలు కొల్లాజెన్ అంటే ఏంటి? కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. శరీరం 30శాతం కొల్లాజెన్ తోనే రూపొందించబడి ఉంటుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకలు బలంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ విచ్చిన్నమవుతూ ఉంటుంది. శరీరంలో కొత్త కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యే ప్రక్రియ కూడా తగ్గుతుంది. అందుకే కొల్లాజెన్ ఉత్పత్తి చేసే ఆహారాన్ని తినాలి. అశ్వగంధ.. అశ్వగంధ ఆయుర్వేదంలో గొప్ప మూలిక. దీన్ని తీసుకోవడం వల్ల వృద్దాప్య లక్షణాలను నివారించవచ్చు. ఉసిరి.. ఉసిరి విటమిన్-సి కి గొప్ప నిధి లాంటిది. ఉసిరిలోని విటమిన్-సి కొల్లాజన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. చిన్నవయసులోనే వృద్దాప్యం రావడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి.. తులసిలో ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్, యూజినాల్ వంటి గొప్ప యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి చర్మాన్ని రక్షిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. నెయ్యి.. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతారని చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ నెయ్యిలో విటమిన్-ఎ,డి, ఇ పుష్కలంగా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక అవసరం. విటమిన్-ఎ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచే విటమిన్.  ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా చిన్నవయసులోనే వృద్దాప్యాన్ని నివారిస్తుంది. సరస్వతి.. సరస్వతి ఆయుర్వేద మూలిక. దీన్నే బ్రాహ్మీ అని కూడా అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి. శరీరంలో కొత్త కణాలను, కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ప్రసవం తరువాత మహిళలలో స్కిన్ పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్కులను కూడా తేలికగా తొలగించడానికి ఉపయోగపుడుతుంది.                                                *నిశ్శబ్ద.

మీ పిల్లల ఎదుగుదలకు ఈ హోంమేడ్ సెరెలాక్ ఇవ్వండి.!   శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన తర్వాత అవసరమైన పోషకాహారం పొందడానికి ఆహారం ఇస్తుంటాం. అందుకు ఆరు నెలల పిల్లలకు ఆహారంలో సెరెలాక్ ను చేర్చుతుంటారు.  కానీ మార్కెట్‌లో లభించే సెరెలాక్‌లో చక్కెర, పిల్లల వయస్సు, ఆరోగ్యానికి సరిపోని అనేక ఇతర పదార్థాలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, మార్కెట్ లభించే  సెరెలాక్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన సెరెలాక్‌తో శిశువుకు ఆహారం ఇవ్వడం మంచిది. సెరెలాక్‌లో షుగర్‌ ఉంటుందని...దానిని తినిపించడం వల్ల పిల్లల్లో తీపి తినే ధోరణి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.  మీరు చిన్న వయస్సులో మీ పిల్లలకు ప్రతిరోజూ ఏదైనా తీపి తినిపించడం ప్రారంభిస్తే, వారు తర్వాత తీపి దంతాల అలవాటును పెంచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పిల్లల కోసం ఇంట్లో సెరెలాక్ సిద్ధం చేయవచ్చు. డాక్టర్ సూచించిన విధంగా ఇంట్లో సెరెలాక్ సిద్ధం చేయడానికి రెసిపీ ఇక్కడ ఉంది. ఇంట్లో సెరెలాక్ రెసిపీ: ముందుగా 1 కప్పు మిక్స్డ్ గ్రెయిన్స్ తీసుకుని అందులో అరకప్పు మిక్స్డ్ పప్పులతో కలపాలి. మిశ్రమ ధాన్యాలలో గోధుమ, బియ్యం, బార్లీ, మిల్లెట్ తీసుకోండి. అంతేకాకుండా, పప్పుధాన్యాలలో, మీరు పొట్టు, పొడుగ్గా, మసూర్ పప్పు,  చిక్‌పీలను తీసుకోవాలి. మీరు వాటిని మొలకెత్తినవి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. సెరెలాక్ ఎలా తయారు చేయాలి? ముందుగా వీటన్నింటినీ వేయించి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. అందులో అర చెంచా శనగ పొడి, నువ్వుల పొడి వేయాలి. ఇప్పుడు వీటన్నింటిని నెయ్యిలో వేయించి అందులో కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. మీరు అందులో మీ పిల్లలకు నచ్చిన పండ్లు,  కూరగాయలను మిక్స్ చేసుకోవచ్చు, ఏదైనా పండు, కూరగాయలను కలిపే ముందు మీరు వాటిని ఉడికించాలి. NCBI ప్రకారం, పప్పులు ఒక అద్భుతమైన శక్తి వనరు, శిశువు తల్లి పాలు తాగడం మానేసినప్పుడు, పప్పుల వినియోగం తప్పనిసరి అవుతుంది. ఇందులో ప్రోటీన్లు, ఇనుము, విటమిన్లు, ఖనిజాలు, బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయి. తృణధాన్యాలు యొక్క ప్రయోజనాలు: తృణధాన్యాలు ఫైబర్, బి విటమిన్లు, జింక్, మెగ్నీషియం, మాంగనీస్ కలిగి ఉంటాయి. ఫైబర్ సహాయంతో, శిశువు యొక్క జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. జింక్, మెగ్నీషియం శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు సహాయపడతాయి.  మాంగనీస్ శిశువు పెరుగుదల, మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ బెస్ట్..! చలికాలం చర్మానికి మా చెడ్డ కాలం అని చెప్పవచ్చు. చర్మ సంబంధ సమస్యలు చాలా వస్తాయి. ఇవి శరీరం మొత్తం చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా అసౌకర్యం కలిగితే అది రోజులో చేసే ఎన్నో పనులలో ఇబ్బందులు కలిగిస్తుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి కింది సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలి. ఉదయం లేచి స్నానం చేశాకే ఉద్యోగాలకు, కాలేజీలకు  వెళతారు.  అయితే స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చర్మం దారుణంగా దెబ్బతింటుంది. చలికాలంలో స్నానాన్ని కేవలం 5 నుండి 10 నిమిషాలలోపు ముగించాలి. ఇలా చేస్తే చర్మం రోజంతా తేమగా ఉంటుంది. ఎక్కువసేపు నీటిలో తడిస్తే చర్మం పొడిబారుతుంది. బాగా చలిగా ఉంది కదా అని బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తుంటారు. అయితే చాలా వేడిగా ఉన్న నీళ్ళు శరీరానికి బాగా అనిపించినా చర్మ రంధ్రాలు సహజంగా ఉత్పత్తి చేసే నూనెలు ఆగిపోతాయి. దీని వల్ల చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. అందుకే ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లతో మాత్రమే స్నానం చెయ్యాలి. చలి నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి చాలామంది బ్యూటీ ఉత్పత్తులు వాడతారు. అయితే రసాయనాలు  అధికంగా ఉన్న ఉత్పత్తులు వాడితే చర్మం దెబ్బతింటుంది. అందుకే సహజమైన మాయిశ్చరైజర్ వాడాలి. పెదవులు పగలకుండా ఉండాలంటే లిప్ బామ్ తప్పనిసరిగా వాడతారు. కానీ దీన్ని పదే పదే రాయకూడదు. రోజులో రెండు మూడుసార్లు రాస్తేసరిపోతుంది. అది కూడా సహజమైన లిప్ బామ్ బెస్ట్.  చలికాలంలో ఎక్కువ దాహం వేయదు. కానీ చలికాలంలో నీరు తాగడం తగ్గిస్తే చర్మం తొందరగా ముడతలు పడుతుంది. అందుకే తగినంత నీటిని తాగాలి. సన్ స్క్రీన్ అంటే వేసవిలోనే ఉపయోగిస్తారనే అపోహ చాలామందిలో ఉంది. కానీ చలికాలంలో కూడా సన్ స్క్రీన్ వాడాలి. ఇది చర్మాన్ని రక్షిస్తుంది. చలి నుండి శరీరాన్ని కాపాడుకునేందుకు స్వెట్టర్లు, జాకెట్ లు, సాక్సులు, గ్లౌజులు ఉపయోగించాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చలి కారణంగా చర్మం దెబ్బతినకుండా చేస్తాయి. చలికాలంలో పైన చెప్పుకున్న సంరక్షణా చర్యలు మాత్రమే కాకుండా ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం తప్పనిసరి. ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, పండ్లు తీసుకోవాలి. సీజనల్ ఫుడ్స్ అస్సలు మిస్ కాకూడదు.                                                           *నిశ్శబ్ద.  

చలికాలంలో మీ జుట్టు పీచుగా మారుతోందా..అయితే ఈ చిట్కాలు మీ కోసం! అందమైన, పొడవాటి జుట్టు ప్రతి అమ్మాయి కోరిక. చలికాలంలో జుట్టు నిర్జీవంగా మారుతుంది. ముఖ్యంగా చల్లని గాలులు మీ వెంట్రుకల కుదుళ్లను  చికాకుపరుస్తాయి. చల్లదనం వల్ల ఈ సీజన్‌లో వేడి నీటితో తలస్నానం చేయడం సహజం, అంతేకాదు వివిధ రకాల షాంపూలు, కండీషనర్‌లను ఉపయోగిస్తారు. దీని కారణంగా జుట్టు రంగు కూడా తగ్గుతుంది. అందుకే ఈ చలికాలంలో  జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చలికాలంలో తక్కువగా తలస్నానం చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల తలపై మలాసెజియా అనే ఫంగస్ అనేక రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టును శుభ్రం చేసుకోకపోవడం వల్ల వేగంగా వ్యాపిస్తుంది. ఈ సీజన్‌లో, జుట్టును ఫంగస్ నుండి రక్షించడానికి, జుట్టును అందంగా మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శీతాకాలంలో జుట్టును ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం. హెయిర్ మాస్క్ వేసుకోండి:  శీతాకాలంలో మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడానికి , మీ జుట్టుకు హెయిర్ మాస్క్ వేసుకుంటే మంచిది.  మీ వెంట్రుకలు మాయిశ్చర్ పోకుండా  తేమగా ఉండేందుకు జుట్టు మీద ముసుగు వేసుకోవాలి. అలోవెరా, షియా బటర్, నూనెతో కూడిన హెయిర్ మాస్క్‌ని జుట్టుకు అప్లై చేయండి. జుట్టుపై కండీషనర్‌ను తప్పకుండా అప్లై చేయండి:  చలికాలంలో తరచుగా మహిళలు విపరీతమైన చలి కారణంగా జుట్టుపై కండీషనర్‌ను ఉపయోగించరు. కండీషనర్ లేకుండా, జుట్టు పొడిగా మారుతుంది. చలికాలంలో జుట్టు సంరక్షణకు కండీషనర్ బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి:  శీతాకాలంలో, వేడి నీరు జుట్టు యొక్క మెరుపును తొలగిస్తుంది, అటువంటి పరిస్థితిలో, జుట్టును కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి:  చలికాలంలో మీ వెంట్రుకలకు ఆలివ్ నూనెతో మసాజ్ చేయడం మంచిది. ఆలివ్ జుట్టుకు పోషణను అందిస్తుంది. వెంట్రుకల పొడి తనాన్ని కూడా తొలగిస్తుంది. ఎక్కువ నీరు త్రాగాలి: చలికాలంలో తక్కువ నీరు త్రాగాలి, శరీరానికి నీరు పుష్కలంగా ఉండటం అవసరం. అందాన్ని పెంచడంలో నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా జుట్టు హైడ్రేటెడ్‌గా ఉంటుంది.  

చలికాలం మనకు వణుకు పుట్టించడమే కాకుండా చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మన చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. సబ్బుతో కడిగితే మరింత దెబ్బతింటుంది. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలు పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి చలికాలం ప్రారంభం నుంచే చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే చర్మాన్ని మునుపటిలా కాపాడుకోవచ్చు. దాని కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. పగిలిన పెదవుల కోసం: శీతాకాలంలో మీ పెదాలు పగలడం సహజం, దీనికి కారణం మీ శరీరంలో నీటి శాతం తగ్గడమే. అలాంటి సమయంలో మీ పెదవుల చుట్టూ ఉన్న చర్మం పొడిగా మారి పగిలిపోతుంది. ఈ సమయంలో మీరు లిప్ స్క్రబ్‌ని ఉపయోగించాలి. తర్వాత కావాలంటే లిప్ స్టిక్ వేసుకోవచ్చు. మీరు స్క్రబ్ ఉపయోగించకుండా లిప్‌స్టిక్‌ను అప్లై చేస్తే, అది మీ పెదాలను దెబ్బతీస్తుంది.   మాయిశ్చరైజర్ ఉపయోగించండి: చలికాలంలో ముఖం కూడా బాగా డ్రైగా మారి ముఖంపై మృతకణాలు పెరుగుతాయి. ఈ కారణంగా, మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం మర్చిపోవద్దు. మీ చర్మ రకాన్ని బట్టి  మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం వల్ల మీ చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పొడిగా మారదు. వేడి స్నానం అంత మంచిది కాదు: చలికాలంలో వేడి నీటి స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడమే కాకుండా చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చర్మ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మన చర్మం సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ కోల్పోతుంది. దీని వల్ల చర్మంలో తేమ స్థాయి మునుపటిలా ఉండదు. ఇది మీ చర్మాన్ని కఠినం చేస్తుందని చెప్పవచ్చు. హ్యాండ్ క్రీమ్‌ వాడాలి: చలికాలంలో మీ ముఖం, చేతులు మాత్రమే కాదు. మీ అరచేతులపై ఉన్న చర్మం కూడా పగిలి పోతుంది. ముఖ్యంగా కొంతమందికి అరచేతి చర్మం ముడతలు పడిపోతుంది. కాబట్టి మీ చర్మం మృదువుగా ఉండటానికి హ్యాండ్ క్రీమ్ అప్లై చేయడం మర్చిపోవద్దు. మాయిశ్చరైజర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి: చలికాలంలో మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీకు మాయిశ్చరైజర్ అవసరం. కాబట్టి స్నానం చేసిన తర్వాత లేదా ఫేస్ వాష్ ఉపయోగించిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.  

చలికాలంలో జుట్టు మెరవడానికి అదిరిపోయే అయిదు హెయిర్ ప్యాక్ లు!  జుట్టు అందంగా ఉంచుకోవడం అమ్మాయిలకు ఇష్టం. కానీ ఎంత ప్రయత్నం చేసినా చాలామంది జుట్టు అందంగా ఉండదు. మరీ ముఖ్యంగా చలికాలంలో జుట్టు సంబంధ సమస్యలు కూడా అధికం అవుతాయి. చలిగాలుల కారణంగా జుట్టులో తేమ కోల్పోయి పొడిబారుతుంది. జుట్టు జీవం కోల్పోయినట్టు టెంకాయ పీచులాగా కనిపిస్తుంది. కొందరికి చలికాలంలో చుండ్రు సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలేవీ ఉండకూదన్నా, జుట్టు ఆరోగ్యంగా పట్టుకుచ్చులా మెరవాలన్నా కింది అయిదు హెయిర్ ప్యాకులు వాడితే సరి.. గ్రీన్ టీ హెయిర్ ప్యాక్.. ఒక గిన్నెలో గుడ్డులోని పచ్చసొన తీసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల గ్రీన్ టీ వెయ్యాలి. దీన్ని బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుండి జుట్టు అంచుల వరకు మొత్తం పట్టించాలి. జుట్టు కుదుళ్లకు బాగా అంటేలా మసాజ్ చేయాలి. కేవలం ఇరవై నిమిషాలు దీన్ని జుట్టుమీద ఉంచుకుంటే సరిపోతుంది. తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. హెయిర్ ఫాల్ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టు మృదువుగా పట్టుకుచ్చులా మారుతుంది. మందారపూలు.. కప్పు మందార పూలతో జుట్టు మెరుస్తుందండోయ్. మందార పువ్వులను రెక్కలుగా విడదీసి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటిరోజు దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీన్ని కూడా జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. గంట సేపు  అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.  ఈ ప్యాక్ జుట్టును మెరిపిస్తుంది. పెరుగు.. ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే పెరుగు జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది. పెరుగులో ఒక చెంచా తేనె, చెంచా బాదం నూనె కలపాలి. దీన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచి తరువాత  గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. పాలు, తేనె.. పాలలో తేనె కలుపుని తాగితే అమృతంలా ఉంటుంది. కానీ ఈ రెండూ కలిపి మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. ఈ ప్యాక్ రిమూవ్ చేయడానికి గాఢత లేని షాంపూను మాత్రమే వాడాలి. లేదంటే మెరుపు కోల్పోతారు. ఇది జుట్టు పెరుగుదను కూడా ప్రోత్సహిస్తుంది. అరటిపండు.. అరటిపండు శరీర ఆరోగ్యానికే కాదు సౌందర్య సాధనంగా కూడా భలే ఉపయోగపడుతుంది. కాస్త పండిన అరటిపండు ముక్కలు, కొన్ని చుక్కల బాదం నూనె కలిపి మిక్సీ పట్టాలి. మెత్తగా అయిన ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి అంచుల వరకు అప్లై చెయ్యాలి.  ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇది తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది. డాండ్రఫ్ సమస్య తొలగిస్తుంది.                     (గమనిక: ఈ హెయిర్ ప్యాక్ లు  వివిధ వేదికలలో హెయిర్ కేర్ నిపుణులు సూచించినవి. సైనస్ సమస్యలు, జుట్టు సంబంధ సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)   *నిశ్శబ్ద.  

చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసా! చర్మం  ఆరోగ్యంగా ఉండటానికి  ప్రోటీన్లు, విటమిన్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా విటమిన్-కె చర్మసంరక్షణలో చాలా అవసరం. అందరూ విటమిన్-ఇ గురించి మాట్లాడతారు కానీ విటమిన్-కె గురించి అస్సలు తెలియనే తెలియదు. అందుకే  ముఖ చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చర్మానికి విటమిన్-కె చేసే మేలు.. విటమిన్-కె చర్మం మీద వాపులు, దురదలు తగ్గించడంలో సహాయపడుతుంది.  దీనికారణంగా ఇది తామర వంటి దారుణమైన సమస్యలను కూడా తగ్గించగలదు. చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే కొల్లాజెన్ చాలా అవసరం.  కొల్లాజెన్ చర్మానికి ఎలాస్టిక్ స్వభావాన్ని ఇస్తుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు పడకుండా చేస్తుంది. అయితే విటమిన్-కె కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. కళ్లకింద నల్లని వలయాల గురించి ఆందోళన చెందని వారు ఉండనే ఉండరు. కానీ విటమిన్-కె దీనికి చెక్ పెడుతుంది. కళ్ల కింద నల్లగా మారిన చర్మంలో రక్తనాళాలు బలహీనంగా ఉంటాయి. ఈ రక్తనాళాలను బలోపేతం చేయడం ద్వారా కళ్లకింద నల్లటి వలయాలు తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది. చర్మం మీద చాలామందికి నరాలు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి. వీటిని స్పైడర్ సిరలు అని అంటారు. ఈ స్పైడర్ సిరల రూపాన్ని తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది. చాలామందిలో పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయిన డార్క్ స్పాట్స్, వయసు వల్ల వచ్చే ముడతలు, మచ్చలు మొదలైనవాటికి విటమిన్-కె భలే పరిష్కారం. హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో కూడా విటమినే-కె సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మానికి కలిగే మంటలు, ఆక్సీకరణ ఒత్తిడి, సూర్యుని హానికరమైన యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో కూడా విటమిన్-కె సహాయపడుతుంది. విటమిన్-కె కొత్త చర్మకణాలు ఏర్పడటాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవి రెండూ గాయాలు తొందరగా నయం కావడానికి సహాయపడతాయి.                    *నిశ్శబ్ద.

ఇంట్లోనే అందుబాటులో ఉన్నవాటితో  బ్రాండ్ ను తలపించే బాడీ లోషన్!   చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు అధికం అవుతాయి. వీటిని తేలిగ్గా తీసుకుంటే ఆ తరువాత చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే అమ్మాయిలు చాలా మంది మార్కెట్లో బోలెడు బాడీ లోషన్లు కొనుగోలు చేస్తారు. బ్యూటీ ఉత్పత్తి దారులు కూడా చలికాలం మొదలైందంటే బాడీ లోషన్, మాయిశ్చరైజర్లకు సంబంధించి యాడ్స్ తో సావగొడుతుంటారు. అయితే ఇవన్నీ రసాయలతో కూడినివి కావడంతో వీటిని కొనుగోలు చేయడంలో చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో బ్రాండెడ్ బాడీ లోషన్ల లాగా  ఫలితాలు ఇచ్చే బాడీ లోషన్ ను తయారుచేయవచ్చు. దీనికి కావలసిన పదార్థాలేంటో.. పూర్తీగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. బాడీ లోషన్ తయారీకి కావసిన పదార్థాలు చాలా సింపుల్ గా ఇంట్లో లభ్యమయ్యేవే.. ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె నిమ్మకాయ అరచెక్క విటమిన్-ఇ క్యాప్సుల్స్ మూడు నుండి నాలుగు తయారుచేసుకునే విధానం.. ముందుగా  నిమ్మకాయ రసం తీయాలి. ఒక కప్పు కొబ్బరినూనెను ఒక గిన్నెలో వేసుకునే సన్నని మంట మీద కొద్దిగా వేడి చేయాలి. ఇందులో విటమిన్-ఇ క్యాప్సూల్, నిమ్మరసం వేయాలి. దీని ప్రభావం మరింత ధృడంగా ఉండటానికి దీనికి కొబ్బరి నూనెతో పాటు బాదం నూనెను సమంగా తీసుకుని ఉపయోగించవచ్చు. ఇవన్నీ కలిసి బాగా మిక్స్ చేసిన తరువాత దీన్ని ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేస్తూంటే ఏ బ్రాండ్ బాడీ లోషన్ కూడా ఇవ్వని గొప్ప ఫలితాలు ఇస్తుంది.                                       *నిశ్శబ్ద.

ముఖ చర్మం పాడవుతోందా... మీరూ  ఈ తప్పులు  చేస్తున్నారేమో!     అమ్మాయిలలో ఎక్కువగా ఆకర్షించేది ముఖమే. ముఖం అందంగా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ మరింత ఆకర్షణగా మారుతుంది.  చర్మం రంగు ఏదైనా సరే ముఖం చక్కగా, కాంతివంతంగా, మొటిమలు, మచ్చలు ఏవీ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ  అలాంటి ముఖం చాలా తక్కువ మందికి ఉంటుంది.  అయితే ముఖం మీద మచ్చలు, ముడతలు, మొటిమల తాలూకు గుర్తులు ఏవీ లేకుండా ఉండటం కోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడతారు. ఫేస్ క్రీములు, లోషన్లు, ఫేస్  వాష్ లు ఇలా చాలా ఉపయోగిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఉత్పత్తులన్నీ మంచి వాసన వస్తాయి తప్ప చర్మాన్నిమాత్రం బాగు చెయ్యవు.  చర్మం చక్కబడాలంటే దానికి కావల్సింది  వాణిజ్య ఉత్పత్తులు ఉపయోగించడం కాదు, చర్మాన్ని శుభ్రం చేసే విధానం తెలుసుకోవడం. ఫేస్ వాష్ చేయడంలో  చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని వాటిని  సరిచేసుకోవడం అవసరం. క్లెన్సర్.. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సరైన క్లెన్సర్ ఎంచుకోవడం తప్పనిసరి. చాలామంది కొంటున్నారనో, మార్కెట్లో వైరల్ అవుతోందనో క్లెన్సర్ కొనుగోలు చేయకూడదు.  చర్మాన్ని బట్టి క్లెన్సర్ ఎంచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి ఎటువంటి నష్టం కలగదు. ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి. ఒకవేళ ఏదైనా క్లెన్సర్ ఉపయోగించగానే ముఖం మీద గుల్లలు, దద్దుర్లు, ముఖ చర్మం ఎర్రబడటం వంటివి జరిగితే అలాంటి క్లెన్సర్ కు దూరం ఉండాలి. వేడినీరు వద్దు.. ముఖం శుభ్రం చేసుకోవడానికి కొందరు వేడినీరు ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మం శుభ్రపడుతుందని అంటారు. కానీ వేడినీటితో ముఖం కడిగితే ముఖ చర్మంలో ఉన్న తేమ కోల్పోతారు. అదే చల్లని నీటితో కడితే ముఖ చర్మం తేమ కోల్పోదు. రుద్దకూడదు.. ముఖం కడిగేటప్పుడు   క్లెన్సర్ లేదా సోప్ వంటివి ఉపయోగించే ముందు ముఖాన్ని గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇలా చేస్తే చర్మం దెబ్బతింటుంది.  మృదుత్వం కోల్పోయి చర్మం రఫ్ గా మారిపోతుంది. అంతేకాదు చర్మ రంధ్రాలు కూడా సాగిపోవడానికి అస్కారం ఉంటుంది. ముందు జాగ్రత్త.. ముఖం కడుక్కోవడానికి ముందు చేతులు  శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం కడుక్కుంటే  చేతులలో ఉన్న మురికి ముఖ చర్మానికి అంటుకుంటుంది. ఇది ముఖం మీద మొటిమలు, గుల్లలు, దద్దుర్లు, ముఖం రంగుమారడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.                                                    *నిశ్శబ్ద.

 ఈ నాలుగు  పదార్థాల ముందు  బ్యూటీ పార్లర్ లో ఖరీదైన ఫేషియల్స్ కూడా పనికిరావు.. అమ్మాయిలకు చర్మ సంరక్షణ మీద ఆసక్తి ఎక్కవ. చాలా మంది చర్మ సంరక్షణ పేరుతో  దృష్టి అంతా ముఖ కాంతిని పెంచడంపైనే ఉంచుతారు.   ముఖంలో  మెరుపు కనిపిస్తూ ఉంటే చాలు తాము యవ్వనంగా ఉన్నామని అనుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ లో వందలాది రూపాయలు ఖర్చు చేస్తారు.  పండుగలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్లు, పార్టీలు చాలా చిన్న వేడుకలలో కూడా అమ్మాయిలు తమ అందాన్ని మెరిపించడానికి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. బ్యూటీ పార్లర్లలో కాస్త ఖరీదైన ఫేషియల్ క్రీములు ఉపయోగించి వేలాది రూపాయలు  తీసుకుంటారు. వీటిని వాడటం వల్ల చర్మం మెరుపు వచ్చినా అది తాత్కాలికమే. కానీ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ ను తలదన్నే  పదార్దాలు చాలా సులువుగా, తక్కువ ధరకే  లభిస్తాయి. వీటిని ఉపయోగిస్తే ముఖం దగదగ మెరిసిపోతుంది. పచ్చిపసుపు.. పచ్చిపసుపు ముఖానికి మెరుపు ఇవ్వడంలోనూ, ముఖం మీద మచ్చలు, మొటిమలు, మొటిమల తాలుకూ గుర్తులను తగ్గించడంలోనూ బాగా సహాయపడుతుంది. రెండు చెంచాల పచ్చిపసుపును ఒక చెంచా శనగపిండితో కలపాలి. దీంట్లో తగినంత రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత చేతులను కొద్దిగా తడి చేసి ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. దీన్ని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి వాడాలి. కేవలం మూడు సార్లు వాడటంతోనే ముఖం లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీన్ని లైప్ స్టైల్ లో భాగం చేసుకుంటే ముఖానికి ఏ క్రీములు అక్కర్లేదు. జాజికాయ.. చర్మంపై మచ్చలు మరియు మచ్చలను తొలగించడంలో జాజికాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జాజికాయను గ్రైండ్ చేసి, దాని పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడికి  తేనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మొత్తం ముఖం మీద లేదా మచ్చలు, మొటిమలు ఉన్న ప్రాంతంలో అయినా   చేయవచ్చు. దీన్ని రాత్రి ముఖానికి రాసుకుని అలాగే వదిలేయవచ్చు.  తెల్లారేసరికల్లా ముఖం మెరిసిపోతుంది. దీన్ని పాలో అవుతుంటే అసలు ముఖానికి ఏ ఇతర ఉత్పత్తులు వాడక్కర్లేదు. చందనం.. చందనం చలువ చేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రెండు చెంచాల గంధపు పొడికి రోజ్ వాటర్ వేసి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.  దీన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత తడి చేత్తో సున్నితంగా స్ర్కబ్ చేస్తూ కడిగేసుకోవాలి. దీని వల్ల టానింగ్ సమస్య తొలగిపోయి గ్లో పెరుగుతుంది. దాల్చిన చెక్క.. వంటల్లోకే కాదు ముఖ సౌందర్యంలోనూ దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను  మిక్సీలో వేసి  పొడి చేసుకోవాలి. అందులో పండిన అరటిపండు వేసి బాగా  కలపాలి. దీన్ని మెత్తని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించాలి.  ఆరిన తరువాత శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మం మెరుపును మెరుగుపరుస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.                                                           *నిశ్శబ్ద.

ఫేషియల్ తరువాత ఈ తప్పులు అస్సలు చేయొద్దు! అమ్మాయిలు ఆరోగ్యం కంటే కూడా చర్మసంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందం ఎప్పుడూ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో  ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా  వస్తాయి. మరీ ముఖ్యంగా ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. సూర్యరశ్మి కారణంగా చర్మం కమిలిపోవడం, రంగు మారడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మహిళలు తమ ముఖానికి ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగి, ముఖచర్మం  శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా, ఇంట్లో సొంతంగానే పేషియల్ చేసుకున్నా.. ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న వయసులోనే ముసలితనం మొదలవుతుందని మీకు తెలుసా? చాలా మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించకపోతే.. ఫేషియల్స్  అందాన్ని ఇవ్వడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఫేషియల్ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. మేకప్‌కు దూరంగా ఉండాలి.. ఫేషియల్ చేసినప్పుడు ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటి సమయంలో  వెంటనే మేకప్ చేస్తే, అది చర్మ సమస్యలను కలిగిస్తుంది.మేకప్ తాలూకూ రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి చర్మానికి నష్టం చేకూరుస్తుంది. సూర్యరశ్మికి గురికాకూడదు.. ఫేషియల్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలో, దుమ్ములో బయటికి వెళితే దుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాహనాల పొగ, సూర్యకిరణాల ప్రభావం అన్నీ కలిపి చర్మాన్ని తొందరగా పాడుచేస్తాయి. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్న తరువాత స్కూటీ ప్రయాణం మానుకోవాలి, ఆటోలో వెళ్లడం మంచిది. స్యూటీలో వెళ్ళాలి అంటే ముఖానికి స్కార్ఫ్  వాడటం మరచిపోకూడదు.  ఫేస్‌వాష్‌తో అస్సలు చేయొద్దు..  ఫేషియల్ చేయించుకున్న తరువాత  రోజు మొత్తం  ఫేస్‌వాష్‌ని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. పొరపాటున ఫేస్ వాష్ ఉపయోగిస్తే ఫేషియల్ ద్వారా చర్మానికి అందిన మృదుత్వం పోతుంది. ఫలితంగా ఫేస్ వాష్ లో రసాయనాల వల్ల చర్మరంధ్రాలు దెబ్బతిని ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఫేషియల్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులను  దూరంగా ఉంచాలి . ఫేషియల్  ముఖచర్మం లోపలివరకు ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో చర్మసంరక్షణ ఉత్పత్తులు వాడితే అందులో ఉన్న రసాయనాల వల్ల చర్మం మరింత సున్నితమైపోయి దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఫేషియల్  తర్వాత  స్క్రబ్ చేయడం, ఇతర ఉత్పత్తులు వాడటం చేయకూడదు.                                    ◆నిశ్శబ్ద.

గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. ఇలా వాడితే  అందాన్ని  కూడా మెరిపిస్తుంది..   ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది  గ్రీన్ టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉండటం నుండి, బరువు తగ్గడం వరకు, ఇమ్యునిటీ పెరగడం నుండి రోజంతా ఉల్లాసంగా ఉండటం వరకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గ్రీన్ టీని కేవలం ఆరోయానికే కాదు, అందాన్ని మెరిపించడానికి కూడా ఉపయోగించవచ్చు. మారుతున్న జీవనశైలి, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లలో మార్పు, దుమ్ము, ధూళి కారణంగా చర్మం దెబ్బతింటుంది. దీన్ని తిరిగి మెరిసేలా చేయడానికి బ్యూటీ పార్లర్లలో బోలెడు డబ్బు పోస్తుంటారు. కానీ అవన్నీ వద్దండోయ్.. కేవలం  గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని మెరిపిస్తాయి. గ్రీన్ టీ తో తయూరుచేసి వాడాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే.. ముల్తాని మట్టి, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. జిడ్డు చర్మం ఉన్నవారికి ముల్తానిమట్టి చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెంచా ముల్తానీ మట్టికి 2 చెంచాల గ్రీన్ టీ వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మందంపాటి పొరగా ముఖం మీద అప్లై చేసి కనీసం 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది జిడ్డును తొలగించడమే కాదు మృదువుగా ఉంచుతుంది. ముఖ చర్మాన్ని మెరిపిస్తుంది. ఆరెంజ్ పీల్, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. ఆరెంజ్ తొక్కలను  ముఖానికి ఉపయోగించడం ద్వారా చర్మం మెరుస్తుంది. ఇక దీనికి గ్రీన్ టీ కూడా జోడిస్తే రెట్టింపు ఫలితాలు పొందుతారు.  . తాజా నారింజ తొక్కలను అయినా ఉపయోగించవచ్చు. లేదా నారింజ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు.  ఒక చెంచా గ్రీన్ టీలో ఒక చెంచా నారింజ తొక్క పొడి,  అర చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను  ముఖం,  మెడపై  అప్లై చేయాలి. దీన్ని 15నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ నీటిలో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే కేవలం మూడే మూడు ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల పార్లర్ టైప్ మెరుపు సొంతమవుతుంది.                                                         *నిశ్శబ్ద.

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే వారి చదువు ఎలా ఉండాలో తెలుసా?   చదువుకోరా గాడిదా అని చిన్నపిల్లలను  పెద్దలు ఒక్కసారి అయినా తిట్టే ఉంటారు, ఇప్పటి పెద్దలు కూడా తమ చిన్నతనంలో  తమ తల్లిదండ్రులతో తిట్టించుకునే ఉంటారు. చదువుకోవాల్సిన వయసులో దాని విలువ అర్థం కాలేదు, వయసైపోయిన తరువాత చదువు విలువ అర్థం అవుతుందని చాలామంది చెబుతారు. ఈ కారణంగానే  పెద్దలు తమ పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటుంటారు. కానీ పిల్లలు అందరూ ఒకేలా చదవరు, ఒక్కొక్కరు  ఒకోవిధంగా చదువుతుంటారు. చదువుతున్నప్పుడు పిల్లలు తరచూ ఒక అంశాన్ని పునరావృతం చేస్తూ  నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దీనిని రోట్ లెర్నింగ్ అని తెలుగులో బట్టీ పట్టడం అని అంటారు. ఒకరి జ్ఞాపకశక్తి ఎంత మెరుగ్గా ఉంటే పరీక్షలో సమాధానాలు అంత బాగా వ్రాస్తారని, దాని ద్వారా వచ్చే  ఫలితం ఆధారంగా అతన్ని తెలివైన పిల్లవాడు అని పిలుస్తారు. అయితే లోతుగా ఆలోచిస్తే అలాంటి పిల్లలు నిజంగా తెలివైన వారా?  నిజంగా భవిష్యత్తులో  గొప్పగా మారుతార? అంటే ఖచ్చితమైన సమాధానం లేదు! పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే  పిల్లలు  ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడంలో చాలా మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.  కానీ  జీవితానికి సంబంధించిన నిజమైన జ్ఞానాన్ని కోల్పోతారని పరిశోధకులు కూడా చెబుతున్నారు.   వారు  తమ చదువును కూడా సరిగా వినియోగించుకోలేరు.  విద్య అంటే నేర్చుకోవడం.  జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి  పాఠశాల విద్య ఆధారమవుతుంది. అందువల్ల జీవితంలో సక్సెస్ కావడానికి ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకోవడం కావాలి తప్ప విషయాన్ని గుర్తుంచుకోవడం కాదు కావాల్సింది. అంటే పిల్లలు ఏదైనా విషయాలను గుర్తుంచుకోవడం కంటే ఆ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడం వల్ల పిల్లల  జీవితం  అటు విద్యాపరంగానూ, ఇటు జీవితపరంగానూ  ఎదుగుతుంది. గుర్తుంచుకోవడం కంటే విషయాలను అర్థం చేసుకోవడం ఎందుకు మంచిదంటే.. బట్టీ పట్టడం ద్వారా పిల్లలు  శబ్ద జ్ఞానాన్ని పొందుతారు అప్పుడు వారికి  పదాలు మాత్రమే మనస్సులో నిలిచిపోతాయి. పిల్లవాడు ఇలా చదివితే అతను  కంఠస్థం చేసిన పదాల సంఖ్యకు అతని అభివృద్ది  పరిమితమవుతుంది.  అదే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే విషయ పరిజ్ఞానం పెరుగుతూ పోతుంది. బట్టీ పట్టే ప్రక్రియ కారణంగా పిల్లల మానసిక ఎదుగుదల  సరిగా ఉండదు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం అనేది ఒకరి మేధో సామర్థ్యాన్ని పెంచే విషయాలపై మంచి అవగాహనకు దారి తీస్తుంది. బట్టీ పట్టడం వల్ల పిల్లలు అలసిపోతారు. పిల్లలు కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోకుండా విషయాలను కంఠస్థం చేసినప్పుడు  నీరసం వస్తుంది. మెదడు అలసిపోతుంది. బట్టీ పట్టి చదివే పిల్లలు నిజ జీవితంలో ఏ విషయాన్ని ఒక పద్దతి ప్రకారం ఆచరించలేరు.  విషయాన్ని అర్థం చేసుకోవడం,  రాయడం ద్వారా పిల్లలు మరింత సమర్థవంతంగా ఉంటారు.  జీవితంలోని కష్ట సమయాల్లో కూడా  ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వారి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. జ్ఞాపకం అనేది స్వల్పకాలిక ప్రక్రియ. ఇది కొద్దికాలం మాత్రమే  ప్రభావవంతంగా ఉంటుంది. కొన్నిరోజుల తరువాత విషయాన్ని మరచిపోతారు. అందుకే పదే పదే రివిజన్ చేయాల్సి ఉంటుంది. అదే  విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత  దాన్ని రాయడం అలవాటు చేసుకుంటే అది చాలాకాలం పాటు గుర్తిండిపోతుంది. అందుకే పెద్దలు పిల్లలకు విషయాన్ని అర్థం చేసుకుని చదివే దిశగా మార్గనిర్దేశం చేయాలి.  అవసరమైతే చిన్న చిన్న ఉదాహరణలు చెబుతుండాలి. ఎంతసేపు మార్కుల కోణంలో పిల్లలను సతాయించకుండా పిల్లల ఆలోచనా పరిధి ఏంటి అనే విషయాన్ని గుర్తించాలి.                                                                  *నిశ్శబ్ద. 

పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పాలి.. ప్రయోజనాలు ఏంటి.. ప్రతిఒక్కరికీ  క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యం. దీని ద్వారా పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారు. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. మీరు మీ పిల్లలకు క్రమశిక్షణను చిన్నతనంలోనే నేర్పించాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించాలి. ఇలా పెంచిన పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం. మీరు పిల్లలకి ఎక్కువ పనిని అప్పగించాల్సిన అవసరం లేదు.  బదులుగా మీరు వారి మానసిక, ప్రవర్తనా అలవాట్లను గమనించి వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధికి ఎలా సహకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు క్రమశిక్షణ నేర్పండి: పిల్లల భవిష్యత్తు అనేది వారి క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సలహాలు ఇస్తూ క్రమశిక్షణతోపాటు ప్రేమను కూడా వ్యక్తపరుస్తుండాలి. క్రమశిక్షణ అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని ప్రోత్సహించినప్పుడు, వారు పట్టుదల, సంకల్పం వంటి లక్షణాలను నేర్చుకుంటారు. ఈ విషయాలు పిల్లల పాత్రచ పరస్పర చర్యలు, ఇతరులతో సంబంధాలను ఏర్పరుస్తాయి. కష్టపడి పనిచేసే పిల్లలు భవిష్యత్తులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. ఇదంతా తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. పని విషయంలో కఠినమైన నియమాలను రూపొందించండి: పిల్లలు బలమైన పని-సంబంధిత నీతిని అభివృద్ధి చేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని పనులు చేయగలరని విశ్వాసం కలిగించాలి.దీని ద్వారా, పిల్లలు తాము చేసిన పనికి బాధ్యత వహించడం నేర్చుకుంటారు. వారి పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇదొక ప్రత్యేక నైపుణ్యం: క్రమశిక్షణ ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది పిల్లలు పాఠశాలలో, వృత్తిలో, వారి వ్యక్తిగత జీవితంలో ఈ నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందేందుకు అనుమతిస్తుంది. మీ పిల్లలలో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి సమయం పట్టవచ్చు. అలాగే, దీనికి తల్లిదండ్రుల నుండి చాలా ఓపిక అవసరం. పిల్లలను అనవసరమైన ఒత్తిడికి గురిచేయకూడదు. ఒత్తిడికి గురిచేయవద్దు: క్రమశిక్షణ పేరుతో మీ పిల్లలను ఒత్తిడికి గురిచేయకూడదు. పిల్లల వయస్సుకు తగిన అంచనాలు ఉండాలి. పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెడితే చిన్న వయసులోనే డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు ముందుగా సులభమైన పనులు ఇచ్చి, క్రమంగా వారి స్థాయిని పెంచుతుండాలి.  దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే పిల్లవాడు చాలా నేర్చుకోవచ్చు. మంచి దినచర్యలో ఇంటి పని కూడా ఉంటుంది. అది అబ్బాయి అయినా సరే... అమ్మాయి అయినా సరే. పిల్లలు ప్రశంసిస్తుండాలి: పొగడ్తలను ప్రేమించే పిల్లలను ప్రశంసించడం ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పించవచ్చు. కల్మషం లేని హృదయానికి ప్రేమ, శ్రద్ధ అవసరం. ఇది మీ బిడ్డకు తల్లిదండ్రులుగా ఇవ్వవచ్చు. పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. వారి ప్రయత్నాలను గుర్తించడం ద్వారా వారి విజయానికి బాసటగా మారుతుంది.

ముప్పై ఏళ్ళకే  ముఖం మీద ముడతలా.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు! వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం మొదట  ముఖంపైనే కనిపిస్తుంది. వృద్ధాప్యం అనేది ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి, కానీ  దాని కారణంగా ముఖం ముసలిగా కనిపిస్తుంది.  ముఖ్యంగా  30 ఏళ్లు దాటిన తర్వాత ముఖంపై  గీతలు,  ముడతలు క్రమంగా చోటు చేసుకోవడం గమనించవచ్చు. వీటిని చూసి చాలామంది అమ్మాయిలు చాలా నీరసపడతారు, అందం గురించి భయపడతారు. ముడతలు పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు,  లోషన్ల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు.   కానీ ఇవి ధీర్ఘకాలిక  ఫలితాలను ఇవ్వవు. అయితే ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్  రెమిడీస్ ఉన్నాయి. ఇవి  పురాతన వైద్య శాస్త్రంలో ప్రస్తావించిన ఔషదాలు. ఇవి  చర్మ సంరక్షణకు, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో అధ్బుతంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఎంత వయసయినా యవ్వనంగా కనిపిస్తారు. తులసి.. ఇది యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన ఔషదం. ఇది ముడుతలతో పోరాడటానికి చక్కగా  సహాయపడుతుంది. ముఖంపై తులసిని పూయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది, ఎందుకంటే ఇది తేమను లాక్ చేస్తుంది.  ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనితో చర్మం  మీద ఉండే కరుకుదనం పూర్తిగా తొలగిపోయి చర్మం నునుపుగా మారుతుంది. అశ్వగంధ.. అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  చర్మం  రూపాన్ని చాలా వరకు  మార్చవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల  చర్మం యవ్వనంగా,  మునుపటిలా చిన్న వయసు వారిలా మెరిసిపోతుంది . అంతే కాదు ఇది ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేందుకు  సహాయపడుతుంది. ఉసిరి.. యాంటీ-ఆక్సిడెంట్లు,  విటమిన్ సి ఆమ్లా లేదా అమలాకిలో లేదా ఉసిరిలో  సమృద్ధిగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా  మెరుగుపరుస్తుంది, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జిన్సెంగ్.. జిన్సెంగ్ ఒక యాంటీ ఏజింగ్ హెర్బ్ . జపనీస్,  కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ హెర్బ్‌లో ఉండే ఫైటోకెమికల్స్ వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతాయి. ఇది   చర్మం సూర్యరశ్మి వల్ల కలిగే నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది. సరస్వతి.. సరస్వతి మరొక అత్యంత ముఖ్యమైన,  ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్  ఔషదం. ఇందులో ఫ్లేవనాయిడ్లు,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి,  వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ మూలిక శరీరం  మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పసుపు.. పసుపు ఒక అద్భుత మూలిక. పసుపులో ఉండే కర్కుమిన్ వయసును  తగ్గించడంలో  అద్బుతంగా సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా పోరాడుతుంది.  సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పసుపు ఆహారంలో తీసుకోవడం, ముఖానికి  పూయడం రెండూ ముఖంలో మెరుపును తెసుకొస్తాయి.                                         *నిశ్శబ్ద. 

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!   వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

చుండ్రు తగ్గించే తేలికైన ఉపాయాలు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి .. * వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. * కొబ్బరి నూనెతోనూ చుండ్రు ని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది. * తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి. * పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.