సాయిమాధవ్ బుర్రా చేతిలో ఎన్టీయార్ బయోపిక్!
on Oct 11, 2017
ప్రతిష్టాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు సాయిమాధవ్ బుర్రా. గత సంక్రాంతి విజయాలు... ఖైదీనంబర్ 150, గౌతమీ పుత్రశాతకర్ణి.. సాయిమాధవ్ కలం పవర్ ఏంటో తెలియజేశాయ్. ప్రస్తుతం సాయిమాధవ్ చేతిలో ఉన్న ‘సైరా నరసింహారెడ్డి‘, ‘మహానటి’.. రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే కావడం విశేషం. ఇప్పుడు ఈ కలంయోధుని చెంతకు మరో ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. అదే ‘ఎన్టీయార్ బయోపిక్’. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రానికి తేజా దర్శకునిగా ఇప్పటికే ఖరారయ్యాడు. ఎన్టీయార్ గా ఇందులో బాలకృష్ణే నటించనుండటం విశేషం. ఈ చిత్రానికి మాటలు రాసే బాధ్యతను సాయిమాధవ్కి బాలయ్య అప్పగించారు.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంతో తన సంభాషణలతో జనాన్ని సమ్మోహితుల్ని చేసిన సాయి... ఎన్టీయార్ బయోపిక్ ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. పైగా ఎన్టీయార్ కి సాయిమాధవ్ వీరాభిమాని. తన అభిమాన నటుని కథకు మాటలు రాసే భాగ్యం దొరకడంతో చెప్పలేనంత ఆనందంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’.. మరో వైపు ‘ఎన్టీయార్ బయోపిక్’.. ఇంకో వైపు ‘మహానటి’.. దేనికదే అద్భుతం. ఇలాంటి అవకాశాలు రావడం వెనుక.. సాయిమాధవ్ ప్రతిభ మాత్రమే కాదు.. అదృష్టం కూడా ఉందనాలి. త్రివిక్రమ్ తర్వాత మాటల రచయితగా ఆ స్థాయి పేరు ప్రఖ్యాతులు లభించిన రైటర్ సాయి. మరి రాబోతున్న సంచలనాలకు తన కలంతో ఏ విధంగా సొగబులద్దుతాడో చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ సాయిమాధవ్..