కరోనా విరాళాల్లో విజయ్ దేవరకొండ పేరెక్కడ?
on Mar 31, 2020
కరోనాపై పోరాటం కోసం టాలీవుడ్లోని అనేక మంది ముందుకువచ్చి ఎవరికి తోచినంత, సాధ్యమైనంత విరాళాలు, ఆర్థిక సాయాలు అందిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు, ప్రధాని సహాయ నిధితో పాటు టాలీవుడ్లో పేద కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి విరాళాలు అందించారు. కొంతమంది ముఖ్యమంత్రి సహాయనిధులకు, ఇంకొంతమంది సీసీసీకి మాత్రమే విరాళాలిచ్చారు. ఈ లిస్టులు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడవుతున్నాయి. ఆ లిస్టులో కనిపించని పేరుపొందిన నటులు, దర్శకులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
అలా ప్రముఖంగా విమర్శకు గురవుతున్న పేరు.. వరుసగా రెండో ఏడాది కూడా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్గా హైదరాబాద్ టైమ్స్ ఎంపిక చేసిన విజయ్ దేవరకొండ! అవును. ఈ రౌడీ హీరో ఇంతవరకూ కరోనా సంక్షోభంలో ఎవరికీ విరాళం ప్రకటించలేదు. చిన్న చిన్న హీరోలు, నటులు సైతం తమకు తోచినంత విరాళం ప్రకటిస్తూ వస్తుండగా, స్వల్ప కాలంలోనే స్టార్గా మారిన విజయ్ విరాళం ప్రకటించకపోవడం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. నిజానికి విరాళాలను ప్రారంభించింది తెలంగాణకు చెందిన మరో హీరో నితిన్తోనే. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు చెరో రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన నితిన్, ఆ వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి మరీ చెక్కు అందజేసి వచ్చాడు.
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రచారం చేసిన విజయ్ దేవరకొండ.. విరాళం విషయానికి వచ్చేసరికి మౌనంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఓవైపు సినిమాలు, మరోవైపు ఎండార్స్మెంట్లతో విజయ్ బాగానే సంపాదిస్తున్నాడు. పలు విషయాల్లో అందరికంటే ముందుగా స్పందిస్తూ హైపరాక్టివ్ అనిపించుకొనే అతను ఇటు సినీ కార్మికులకు సహాయం చేయడానికి గానీ, అటు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వడానికి గానీ ఇప్పటివరకు ముందుకు రాకపోవడం మాత్రం ఆశ్చర్యకరమే.
Also Read