శర్వానంద్ 'మహాసముద్రం' పట్టాలెక్కేదెప్పుడు?
on Apr 3, 2020
సమంతతో చేసిన 'జాను' సినిమా కూడా డిజాస్టర్ కావడంతో శర్వానంద్ కెరీర్ చిక్కుల్లో పడింది. ఇది అతడికి హ్యాట్రిక్ ఫ్లాప్. అదివరకు 'పడిపడి లేచే మనసు', 'రణరంగం' సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిలైన విషయం తెలిసిందే. దీంతో అతడిపై ఒత్తిడి పెరిగింది. అతడు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే రైతు కొడుకుగా నటించిన 'శ్రీకారం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కిశోర్ బి. అనే కొత్త దర్శకుడు తీసిన ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో వాయిదా పడింది. నిజానికి ఈ సంక్షోభం లేకపోయినా 'శ్రీకారం' విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఫిల్మ్నగర్ వర్గాలు అంటున్నాయి. కారణం.. ఈ సినిమాకు బిజినెస్ కాకపోవడం, మార్కెట్లో దీనికి క్రేజ్ లేకపోవడం!
ఆ సినిమా విషయం పక్కనపెడితే, అజయ్ భూపతి డైరెక్షన్లో చేయడానికి అతను ఒప్పకున్న 'మహాసముద్రం' మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది మిలియన్ డాలర్ క్వశ్చన్లా మారింది. కారణం.. ఇప్పటిదాకా ఆ సినిమాలో నటించే మరో హీరో ఎంపిక పూర్తి కాకపోవడం. ఏడాది పైనుంచే 'మహాసముద్రం' వార్తల్లో నలుగుతూ ఉంది. ఇద్దరు హీరోలుండే ఆ సినిమాలో తారాగణం ఎంపిక అజయ్ భూపతికి బ్రహ్మప్రళయంగా మారింది. మొదట్లో రవితేజ, తర్వాత నాగచైతన్య.. ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చినా.. రెండో హీరో ఎంపిక కొలిక్కి రాకపోవడం.. దాంతో వాళ్లు ఈ సినిమాను వదులుకొని వేరే సినిమాలతో బిజీ అయిపోవడం చూశాం. ఇప్పుడు శర్వానంద్ 'మహాసముద్రం'కు ఓకే చెప్పి మూడు నెలలు గడిచిపోయినా మరో హీరో ఎంపిక ఇప్పటివరకూ జరగకపోవడం గమనార్హం.
'శ్రీకారం' తర్వాత ఇప్పటికే శ్రీకార్తీక్ అనే కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. రీతూ వర్మ హీరోయిన్గా నటించే ఆ సినిమాలో శర్వా తల్లిగా అమల అక్కినేని నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమా షూటింగ్ మొదలవడమే ఆలస్యం. కరోనా గొడవ ముగిసి, షూటింగ్లు మళ్లీ మొదలయ్యేలోగా 'మహాసముద్రం' క్యాస్టింగ్ ఓ కొలిక్కి రావాలని అతను కోరుకుంటున్నాడు. అజయ్ భూపతి ఏం చేస్తాడో చూడాలి.