బెల్లంకొండ చెప్పింది నిజం కాదన్న వినాయక్!
on Aug 8, 2019
అవును. కొడుకు సాయిశ్రీనివాస్ విషయంలో బెల్లంకొండ సురేశ్ చెప్పింది నిజం కాదని డైరెక్టర్ వి.వి. వినాయక్ అన్నారు. రెండు రోజుల క్రితం సురేశ్ మాట్లాడుతో 'రాక్షసుడు' సినిమాతోటే సాయిశ్రీనివాస్ను ఆర్టిస్టుగా ప్రేక్షకులు గుర్తించారని చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని వినాయక్ తోసిపుచ్చారు.
గురువారం ప్రసాద్ ల్యాబ్స్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ "మొన్న సురేష్ గారు మాట్లాడుతూ మా అబ్బాయిని ఆర్టిస్టుగా ఈ సినిమాతోనే గుర్తించారు అన్నారు. అది నిజం కాదు. సాయిని అన్ని సినిమాల్లోనూ మంచి ఆర్టిస్టుగా గుర్తించారు. లేకపోతే అన్ని సినిమాలు చేయలేడు. సాయి తన ఫస్ట్ సినిమాకే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి సినిమా టెంపో ఎక్కడా తగ్గకుండా కథలోకి వెళ్లి నటించాడు. సాయి ఎలాంటి పాత్రని అయినా చేయగలడు. ఫ్యూచర్ లో ఇంకా మంచి పాత్రల్లో కనిపిస్తాడు. 'అల్లుడు శీను' సినిమాలో సాయిని ఒక కమర్షియల్ హీరోగా చూపించడానికి అవసరమైన అన్ని యాంగిల్స్ చూపించాను. కొన్ని అవసరం లేకపోయినా కథలోకి తీసుకువచ్చి హీరోయిజంని ఎలివేట్ చేయడం జరిగింది. అది ఒక మ్యాజిక్. అది వర్కవుట్ అయింది" అని చెప్పారు.
కాగా సాయిశ్రీనివాస్ను ప్రమోట్ చెయ్యడానికి వినాయక్ ప్రత్యేకంగా ముందుకు రావడం గమనార్హం. వినాయక్తో మీడియా సమావేశాన్ని బెల్లంకొండ సురేశ్ ఏర్పాటు చేయించారు. 'అల్లుడు శీను' సినిమాతో సాయిని హీరోగా పరిచయం చేసింది వినాయక్ కావడం గమనార్హం.
"నేను ఇంట్రడ్యూస్ చేసిన సాయి శ్రీనివాస్ కి హిట్ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. సాయి కన్నా నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. దానికి కారణమైన డైరెక్టర్ రమేష్ వర్మకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు నాకు మంచి సన్నిహితుడు. చాలా గొప్ప వ్యక్తి. వాళ్లబ్బాయి (హవీష్) హీరో అయుండి కూడా ఈ కథకు సాయి అయితే పర్ఫెక్ట్ అని సాయిని ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాగే సినిమాకు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాకు ఏది అవసరమో అన్ని సమకూర్చి ఒక సూపర్ హిట్ సినిమా చేశారు" అని ప్రశంసించారు వినాయక్.