బ్రేకింగ్: కలిసి నటించనున్న విక్రమ్-ధ్రువ్!
on Jun 3, 2020
తమిళ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి - అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తోన్న 'కోబ్రా' కాగా, ఇంకొకటి మణిరత్నం రూపొందిస్తోన్న మెగా మల్టీస్టారర్ 'పొన్నియన్ సెల్వన్' మూవీ. 'కోబ్రా'లో విక్రమ్ పలు పాత్రలు చేస్తుండటం గమనార్హం. ఇక 'పొన్నియన్ సెల్వన్'లో జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్లతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
వీటి తర్వాత ఆయన కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఆయనకు 60వ చిత్రం. విజయ్ టైటిల్ రోల్ చేస్తోన్న మాస్టర్ మూవీని నిర్మిస్తోన్న సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించనున్నది. ఇక ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్ ఏమంటే.. విక్రమ్ కుమారుడు ధ్రువ్ ఈ సినిమాలో తండ్రితో కలిసి తెరను పంచుకోనున్నాడు. ఈ తండ్రీకొడుకులు కలిసి తొలిసారి నటించనున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో ఇద్దరివీ పవర్ఫుల్ క్యారెక్టర్లని వినిపిస్తోంది.
'అర్జున్రెడ్డి' తమిళ రీమేక్ 'ఆదిత్యవర్మ' ద్వారా ధ్రువ్ హీరోగా పరిచయమయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినా అందులో టైటిల్ రోల్లో ధ్రువ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. నటనలో ఈజ్తో తండ్రికి సరైన వారసుడనిపించుకున్నాడు. ఆ తండ్రీకొడుకులను తెరపై కార్తీక్ సుబ్బరాజ్ ఎలా చూపిస్తాడా అని అందరూ ఆసక్తి కనపరుస్తున్నారు.