'పాన్ ఇండియా మాడ్నెస్'లో ఊగిపోతున్న టాలీవుడ్ రౌడీ హీరో!
on Jan 21, 2020
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పాన్-ఇండియా ఇమేజ్పై కన్నేశాడు. ఈమధ్య హైదరాబాద్లో కంటే ముంబైలో జరుగుతున్న ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తూ, అక్కడి మీడియాను ఆకర్షిస్తూ వస్తోన్న అతను తన లేటెస్ట్ ఫిలింను మొదలుపెట్టాడు. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ దీనికి దర్శకుడు. నిజానికి తమ కలయికలో ఒక సినిమా వస్తున్నదని ప్రకటించినప్పుడే సినిమా టైటిల్ను 'ఫైటర్' అని కూడా వాళ్లు వెల్లడించారు. కానీ సోమవారం ముంబైలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు సినిమా టైటిల్ను ప్రస్తావించలేదు. విజయ్ దేవరకొండ పదో సినిమా, పూరి జగన్నాథ్ 37వ సినిమా అనీ మాత్రమే క్లాప్ బోర్డుపై పేర్కొన్నారు. అధికారిక ప్రెస్నోట్లోనూ టైటిల్ తెలపలేదు. దీన్ని బట్టి ఈ మూవీ టైటిల్ మారే అవకాశం ఉందనే విషయం స్పష్టం. బహుశా హిందీలో 'ఫైటర్' టైటిల్ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని వినిపిస్తోంది.
పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నాడు. అందుకు తగ్గట్లే బాలీవుడ్ నిర్మాతలు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. తెలుగు, హిందీతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాని ఏక కాలంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్గా ప్రభాస్ అవతరించడంతో, సౌత్ నుంచి మరికొంతమంది స్టార్లు కూడా తమ సినిమా మార్కెట్ పరిధిని తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర భాషల ప్రాంతాలకు కూడా విస్తరింపజేసుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ మాత్రం పాన్ ఇండియా ఇమేజ్కు ఉబలాటపడటం లేదు. తాను తెలుగు సినిమాల్లోనే నటిస్తాను తప్ప హిందీ సినిమాల్లోకి వెళ్లే ఆలోచన చెయ్యనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నాడు. బాలీవుడ్కు వెళ్లి ఎటూ కాకుండా పోయే రిస్కును ఎదుర్కోడానికి ఆయన సిద్ధపడటం లేదు. తెలుగు సినిమాల్లోనే తనకు నచ్చిన స్క్రిప్ట్స్ చేస్తూ సేఫ్గా ఉండాలనే ఉద్దేశం ఆయనలో కనిపిస్తోంది. ఇదివరకు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి మహామహులే బాలీవుడ్కు వెళ్లి, అక్కడ తమ ప్రయాణాన్ని కొంత కాలానికే పరిమితం చేసుకోవాల్సి వచ్చిన విషయం ఆయనకు బాగా గుర్తుంది.
అయితే మహేశ్ ఫ్యాన్ అయిన విజయ్ దేవరకొండ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ కావాలని తపిస్తున్నాడు. అందుకు తగ్గట్లే సోమవారం తన కొత్త సినిమా స్టార్ అయిన సందర్భంగా 'పాన్ ఇండియా మాడ్నెస్ 2020' అని ట్వీట్ చేశాడు. హిందీలో 'కబీర్ సింగ్' మూవీ బ్లాక్బస్టర్ హిట్టయ్యాక, దాని ఒరిజినల్ 'అర్జున్రెడ్డి' హీరోగా విజయ్ సైతం బాలీవుడ్ జనాలకు బాగానే రీచ్ అయ్యాడు. అక్కడి సెన్సేషనల్ స్టార్ కియారా అద్వానీతో కలిసి ఒక యాడ్ ఫిలింలో నటించడం, అక్కడి పార్టీల్లో, ఈవెంట్స్లో మెరవడం వల్ల విజయ్ పేరు వాళ్లకు సుపరిచితమైంది. పైగా అక్కడి అగ్ర దర్శకనిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ కూడా ప్రమోట్ చేస్తుండటం విజయ్కు కలిసొస్తున్న అంశం. విజయ్ మునుపటి సినిమా 'డియర్ కామ్రేడ్' సరిగా ఆడకపోయినా, దాని హిందీ రీమేక్ హక్కుల్ని కరణ్ కొనడం గమనార్హం. అయితే ఇంకా ఆ సినిమా పట్టాలెక్కకపోవడం వేరే విషయం.
ఇప్పుడు విజయ్, పూరి కాంబినేషన్లో సినిమా రూపొందుతుందనే విషయం తెలిశాక కరణ్ కూడా ఆ సినిమాలో పార్టనర్గా చేరాడు. ఆయన కంపెనీ ధర్మా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తోంది. ఇలా బాలీవుడ్ బిగ్ షాట్ సపోర్ట్ లభించడంతో పాన్ ఇండియా స్టార్ కావాలనే కలను నిజం చేసుకోవాలని అడుగులు వేస్తున్నాడు విజయ్. అయితే అతను పగటి కలలు కంటున్నాడనీ, తనకు ఇవాళ యూత్లో వచ్చిన క్రేజ్ చూసి, ఎక్కువగా ఊహించుకుంటున్నాడనీ అంటున్నవాళ్లూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమేరకు ట్రోల్ చేస్తున్నవాళ్లూ, నెగటివ్ కామెంట్స్ చేస్తున్నవాళ్లూ ఉన్నారు. అయితే కలని నిజం చేసుకోవాలని ప్రయతించడంలో తప్పులేదు కదా.. ఎవరేమనుకుంటే నాకేమిటి?.. అనే ధీమాతో 'పాన్ ఇండియా మాడ్నెస్' ప్రదర్శిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అతని కల నిజమవుతుందా? కాలమే జవాబిస్తుంది.