ఇక విజయ్ దృష్టి ఆ మూవీపైనే!
on Aug 8, 2019
'డియర్ కామ్రేడ్' బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'గీత గోవిందం' తర్వాత మరో బ్లాక్బస్టర్ ఖాయమనుకున్న విజయ్ దేవరకొండ నమ్మకం వమ్మయింది. అతని ఖాతాలో మరో భారీ ఫ్లాప్ చేరిపోయింది. దాదాపు అన్ని ఏరియాల్లో 'డియర్ కామ్రేడ్' వసూళ్లు నామమాత్రంగా నమోదవుతున్నాయి. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న విజయ్.. ఇక తన తర్వాతి సినిమాపై దృష్టిపెట్టే యత్నం చేస్తున్నాడు. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఆ ముగ్గురు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసాబెల్లే లీటే. ఇందులో విజయ్ కాసనోవా టైప్ రోల్ చేస్తున్నాడని ఒక వైపూ, రైటర్గా కనిపించనున్నాడనీ ఇంకో వైపూ ప్రచారం జరుగుతోంది.
సెన్సిబుల్ సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ వస్తున్న క్రాంతిమాధవ్ ఈ సినిమానీ అలాంటి సబ్జెక్టుతోనే తీస్తున్నాడని సమాచారం. అయితే ఇప్పటివరకూ అతని నుంచి బిగ్ హిట్ రాలేదు. తొలి సినిమా 'ఓనమాలు' విమర్శకుల ప్రశంసలు పొందినా కమర్షియల్గా ఆడలేదు. రెండో సినిమా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రేక్షకులు ఓ మోస్తరుగా ఆదరించారు. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన 'ఉంగరాల రాంబాబు' ఎవర్నీ మెప్పించలేకపోయింది.
ఈ నేపథ్యంలో క్రాంతిమాధవ్ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ఎప్పుడో 2018 ఆగస్టులోనే ఈ సినిమా ప్రారంభమైంది. అంటే మేకింగ్ మొదలై ఏడాది గడిచింది. విజయ్ని చురుకైన కుర్రాడిగానో, యాంగ్రీ యంగ్మేన్గానో చూడ్డానికి ఇష్టపడుతున్న ప్రేక్షకులు 'డియర్ కామ్రేడ్'లో మొదట యాంగ్రీ యంగ్మేన్గా కనిపించి, తర్వాత దేశదిమ్మరిగా మారిన అతడిని చూడలేకపోయారు. ఇప్పుడు క్రాంతిమాధవ్ మూవీలో అతడెలా కనిపిస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. సూపర్ హిట్ కావడం వినా ఈ సినిమాకు మరో దారిలేదు. ఈ మూవీతో విజయ్ ఆశలు నెరవేరతాయా?