అర్జున్రెడ్డితో తెలుగమ్మాయి!
on Oct 12, 2018
'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సినిమాలు చాలు... దర్శకుడిగా క్రాంతిమాధవ్ అభిరుచి ఏంటో చెప్పవచ్చు. తొలి రెండు సినిమాలతో ఆయనకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు. 'అర్జున్రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏస్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరి కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్. ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు సినిమాలో చోటుందట! అంటే.. మొత్తం ముగ్గురు అన్నమాట. ముగ్గురిలో ఒకరిగా ఐశ్వర్య రాజేష్ని సెలెక్ట్ చేశారు. ఇటీవల విడుదలైన 'నవాబ్'లో రేణు పాత్రలో నటించారీమె. అంతకు ముందు తమిళ అనువాద సినిమా 'లక్ష్మీ'తోనూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఐశ్వర్య రాజేష్కి విజయ్ దేవరకొండది తొలి తెలుగు సినిమా. ఈ అమ్మాయి తమిళంలో ఇరవైకి పైగా సినిమాలు చేశారు. మలయాళంలో రెండు, హిందీలో ఒక సినిమా చేశారు. అయితే ఈ అమ్మాయి తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు.
ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మీ మేనకోడలు ఈ ఐశ్వర్య రాజేష్. ఈమె తండ్రి రాజేష్ హీరో కూడా. సీనియర్ నరేష్ హీరోగా నటించిన 'రెండుజళ్ళ సీత' సినిమా గుర్తుందా? అందులో మోహన్ పాత్రలో నటించిన వ్యక్తి ఐశ్వర్య తండ్రి రాజేషే. ఆయన తెలుగులో 40 సినిమాలు చేశారు. ఐశ్వర్య తాతయ్య అమరనాథ్ ఒకప్పుడు తెలుగులో నిర్మాత. కాకపోతే ఐశ్వర్య చెన్నైలో సెటిలయ్యారు. 'లక్ష్మీ' ఆడియోకి, 'నవాబ్' ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఐశ్వర్య తెలుగులో సినిమా చేయాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అది నెరవేరింది. ఇన్నాళ్ళకు తెలుగులోకి తెలుగమ్మాయి కథానాయికగా వస్తుంది.