గురువు కోసం శిష్యుడి రివేంజ్ శత్రువు
on Oct 29, 2018
భారత దేశం న్యాయ వ్యవస్థ యొక్క శక్థి సామర్ధ్యాలు చెప్పే కథాంశంతో రూపొందిన చిత్రం `శత్రువు`. వెంకటేష్ , విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రం 1991లో విడుదలైంది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎమ్మెస్ రాజు నిర్మించారు. ఆయన నిర్మాత మాత్రమే కాదు బేసిక్ పాయింట్ ని కూడా ఆయనే ఇచ్చారు. దాన్ని ప్రముఖ రచయిత సత్యమూర్తి డెవలప్ చేసిచ్చారు. ఈ సినిమా కోసం వెంకటేష్ లాయర్ పాత్ర కోసం కొంత మంది లాయర్లను కలిసి వారి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుని నటించారట. హీరోయిన్ పాత్ర కోసం మొదట చాలా మంది హీరోయిన్లను అనుకున్నప్పటికీ చివరికి విజయశాంతిని తీసుకున్నారట. ఆమె ఏసిపి పాత్రలో నటించింది. అప్పటికే విజయశాంతి నటించిన కర్తవ్యం చిత్రం పెద్ద హిట్టై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందడం విశేషం.
అలాగే వెంకటేష్ అప్పటికే నటించిన ధృవ నక్షత్రం, బొబ్బిలి రాజా చిత్రాలు పెద్ద సక్సెస్ అయ్యాయి. ఇలా వెంకటేష్, విజయశాంతి ఇద్దరి సినిమాలు సక్సెస్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న `శత్రువు` సినిమాకు విపరీతమైన క్రేజ్ రావడంలో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా ప్రారంభానికి ముందే కర్చీఫ్ లు వేసేశారట. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకోసం ఎంతో మందిని అనుకుని కోడిరామకృష్ణ చివరికి కోట శ్రీనివాసరావుని తీసుకున్నారట. కానీ , కోట శ్రీనివాసరావుని తీసుకోవడం ఏమాత్రం ఎమ్మెస్ రాజుకు ఇష్టం లేదట. అయినా కానీ కోడి రామకృష్ణ పట్టుబట్టి కోటతో ఆ వేషం వేయించాడట. కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో ఆ పాత్ర ద్వారా డిఫరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకుని సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు కోటశ్రీనివాసరావుని ప్రత్యేకంగా పిలిచి అభినందించారట. రివేంజ్ తీర్చుకునే పాత్రలో తొలిసారిగా అద్బుతమైన నటన ప్రదర్శించాడు వెంకటేష్. సినిమా విడుదలై విజయవంతగా ప్రదర్శించపడింది. లాయర్లు, న్యాయం, అంటూ సినిమా వాటి చుట్టూ తిరగడంతో రూరల్ ప్రాంతాలలో ఈ సినిమా పెద్ద గా కలెక్షన్స్ రాబట్టకపోయినప్పటికీ ఓవారాల్ గా సినిమా హిట్ టాక్ తో వెంకీ హిట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాకు రాజ్ కోటి ల సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచిందనడంలో సందేహం లేదు. పొద్దున్నే పుట్టింది చందమామా పాట ఇప్పటికీ వీనుల విందుగా,కనువిందుగా ఉంటుంది.