నేటి స్టార్ హీరో, నిన్నటి స్టార్ హీరోయిన్కు కరోనా!
on Dec 4, 2020
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, నిన్నటి తరం నాయిక నీతూ కపూర్లకు కొవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వరుణ్ ధావన్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న 'జుగ్ జుగ్ జియో' మూవీ షూటింగ్ నవంబర్ మధ్యలో చండీగఢ్లో మొదలైంది. ఇందులో వరుణ్ తల్లిదండ్రులుగా అనిల్ కపూర్, నీతూ కపూర్ (దివంగత రిషి కపూర్ భార్య) నటిస్తున్నారు. పాపులర్ యూట్యూబర్ ప్రజక్తా కోలి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతున్నారు. చండీగఢ్లో నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు.
ఆ తర్వాత వారంతా ముంబైకి తిరుగు ప్రయాణమవుతారు. ఈలోగా వరుణ్ ధావన్, నీతూ కపూర్తో పాటు డైరెక్టర్ రాజ్ మెహతా కొవిడ్ 19 బారినపడ్డారు. కియారా, అనిల్ కపూర్లకు మాత్రం టెస్టుల్లో నెగటివ్ అని తేలింది. ముంబై నుంచి వెళ్లేటప్పుడు వాళ్లంతా టెస్టులు చేయించుకున్నారు. చండీగఢ్లో వేసిన సెట్స్ దగ్గర కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలూ తీసుకొని షూటింగ్ జరుపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వారిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. దీంతో షూటింగ్ నిలిపివేశారు. మిగతా యూనిట్ అంతా ఐసొలేషన్లోకి వెళ్లినట్లు సమాచారం.