దసరా స్పెషల్.. మహిళా దర్శకుల పోటీ!
on Sep 27, 2021
2021 దసరా.. కొత్త చిత్రాలతో సరదా సరదాగా సాగనుంది. `కొండ పొలం`, `వరుణ్ డాక్టర్`, `పెళ్ళి సందD`, `మహా సముద్రం`, `ఎనిమీ`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, `వరుడు కావలెను`.. ఇలా అరడజనుకి పైగా సినిమాలు విజయదశమి కానుకగా థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. వీటిలో `వరుణ్ డాక్టర్`, `ఎనిమీ` డబ్బింగ్ చిత్రాలు కాగా.. మిగిలినవన్నీ స్ట్రయిట్ పిక్చర్సే. వీటిలో ఏ సినిమాకుండే క్రేజ్ ఆ సినిమాకున్నప్పటికీ.. అంతిమంగా ఏయే చిత్రాలు విజయపథంలో పయనిస్తాయన్నది ఆసక్తికరమే.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దసరాకి విడుదలవుతున్న సినిమాల్లో రెండింటిని మహిళా దర్శకులు రూపొందించారు. విశేషమేమిటంటే.. పెళ్ళి చుట్టూ తిరిగే కథాంశాలతోనే తెరకెక్కిన సదరు చిత్రాల కోసమే వారిద్దరు కూడా తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. ఆ వివరాల్లోకి వెళితే.. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన `వరుడు కావలెను`తో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుంటే.. రోషన్, శ్రీ లీల జోడీగా నటించిన `పెళ్ళి సందD`తో గౌరీ రోణంకి డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తున్నారు. మరి.. పాటలతో, ప్రచార చిత్రాలతో ఇంప్రెస్ చేసిన ఈ మహిళా దర్శకులు.. పూర్తిస్థాయి చిత్రాలతోనూ అలరించి శుభారంభం అందుకుంటారేమో చూడాలి.
Also Read