మూడో పెళ్లితోనూ మోసపోయాను.. కన్నీళ్లు పెట్టుకున్న మంజుల కుమార్తె!
on Oct 22, 2020
కొవిడ్-19 మహమ్మారి కాలంలో జరిగిన పెళ్లిళ్లలో ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించింది వనితా విజయ్కుమార్, పీటర్ పాల్ పెళ్లి. తమిళ సీనియర్ యాక్టర్ విజయ్ కుమార్, అలనాటి గ్లామర్ హీరోయిన్ దివంగత మంజుల దంపతుల ముగ్గురు కుమార్తెల్లో పెద్దదైన వనితకు రెండు విఫల వివాహ బంధాల తర్వాత ఇది మూడో పెళ్లి. 2020 జూన్ 27న ఆమె డైరెక్టర్ పీటర్ పాల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ఆకాష్ ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు.. కొడుకు విజయ శ్రీహరి, కూతురు జోవిక.. ఉన్నారు.
కొన్నేళ్ల తర్వాత ఆకాష్, వనిత విడిపోయారు. ఆ తర్వాత వ్యాపారవేత్త ఆనంద్ జయ్ రంజన్ను 2007లో పెళ్లాడింది వనిత. ఆ ఇద్దరికీ జైనిత అనే కుమార్తె పుట్టింది. గొడవలతో అతడి నుంచి కూడా విడాకులు తీసుకుంది వనిత. రెండు విఫల బంధాల తర్వాత మరోసారి ప్రేమలో పడిన ఆమె పీటర్ పాల్ను వివాహం చేసుకుంది. కానీ ఈ మూడో బంధం కూడా సాఫీగా సాగడం లేదనీ, పీటర్ వల్ల ఆమె నానా ఇబ్బందులూ పడుతోందనీ తెలియడంతో సినీ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. పీటర్ పాల్ కూడా వివాహితుడే. అతనికి ఇద్దరు టీనేజ్ పిల్లలు ఉన్నారు.
తన సొంత యూట్యూబ్ చానల్లో షేర్ చేసిన వీడియోలో పీటర్ పాల్తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అతని ఆరోగ్యం, ఆల్కహాల్కు బానిస కావడం గురించీ ఆమె వెల్లడించింది. తానెప్పుడూ ప్రేమలో నమ్మకం ఉంచానని చెప్పిన ఆమె, పెళ్లి వల్ల ఆ ప్రేమను పొందలేకపోతున్నానని, ఈ విషయంలో తాను దురదృష్టవంతురాలిననీ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. "పీటర్ పాల్ను నా మనసారా నిజంగా ప్రేమించాను. ఏదేమైనా నేను మోసపోయాను. స్మోకింగ్, డ్రింకింగ్ మానేశానని నాతో అబద్ధం చెప్పాడు. మరింత ఎక్కువగా వాటికి ఎడిక్ట్ అయ్యాడు. నేను పూర్తిగా నష్టపోయాను" అని చెప్పింది వనిత.
విడాకుల ప్రచారం గురించి మాట్లాడుతూ, సాధ్యమైనంత వరకూ ఆ పరిస్థితి రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాననీ, కానీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. "నా పని, నా పిల్లలు డిస్టర్బ్ కాకుండా ఈ ఛాలెంజ్ను ఎదుర్కోవడానికి ప్రిపేరవుతున్నా" అని స్పష్టం చేసింది వనిత.
Also Read