చిరుతో వంశీ సంప్రదింపులు
on Apr 19, 2021
పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినా.. స్టార్ హీరోల కాంబినేషన్స్ తోనే ముందుకు సాగుతున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తొలి చిత్రం `మున్నా`ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన వంశీ.. ఆపై సెకండ్ వెంచర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో `బృందావనం`గా చేశారు. మూడో చిత్రం `ఎవడు`ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తీర్చిదిద్దారు. అలాగే నాలుగో సినిమా `ఊపిరి`ని కింగ్ నాగార్జునతో చేసి.. ఐదో చిత్రం `మహర్షి` కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జట్టుకట్టారు.
కట్ చేస్తే.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ హీరోతోనే చేసేందుకు వంశీ ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించి ఓ ఆసక్తికరమైన కథ చెప్పారట వంశీ. చిరు కూడా వంశీ స్క్రిప్ట్ కి ఇంప్రెస్ అయ్యారని టాక్. అయితే, తన చేతిలో ఇప్పటికే నాలుగు చిత్రాలు ఉండడంతో కొంతకాలం వేచిఉండమని సూచించారట మెగాస్టార్. దీంతో.. ఈ లోపు వంశీ కూడా సబ్జెక్ట్ ని మరింత డెవలప్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారని వినికిడి. త్వరలోనే చిరు, వంశీ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.