సగం తమన్ చేసేశాడు.. మిగతా సగం త్రివిక్రమ్ చేస్తాడా?
on Nov 25, 2019
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న 'అల.. వైకుంఠపురములో' మూవీ జనవరి 12న రిలీజవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాతో చాలా కాలం తర్వాత బాలీవుడ్ వెటరన్ బ్యూటీ టబు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరం. ఇప్పటికే ప్రచారం విషయంలో మిగతా సంక్రాంతి సినిమాలన్నింటి కంటే చాలా ముందుగా పబ్లిసిటీ స్టార్ట్ చేసిన ఈ సినిమాకు పెద్ద బూస్ట్ నిచ్చింది తమన్ మ్యూజిక్. సెప్టెంబర్ ఎండింగ్లోనే 'సామజవరగమన' ఫుల్ లిరికల్ సాంగ్తో ఈ మూవీకి ధూం ధాం క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ హిస్టరీలో యూట్యూబ్ ప్లాట్ఫాంపై అత్యధిక రియల్ టైం వ్యూస్ సాధించిన సాంగ్గా అది సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే 95 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్ సమీప కాలంలోనే 100 మిలియన్ వ్యూస్ మార్కును అందుకోవడం ఖాయం.
ఆ తర్వాత నెల రోజులకు, అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేసిన 'రాములో రాములా' సాంగ్ సైతం దుమ్ము దులిపేస్తూ 'సామజవరగమన' సాంగ్ను అందుకునేందుకు వేగంగా పరుగులు తీస్తోంది. అది ఇప్పటివరకూ 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే నవంబర్ 22న రిలీజ్ చేసిన థర్డ్ సాంగ్ 'ఓ మై గాడ్ డాడీ' కూడా ఫాస్ట్ బీట్స్ను ఇష్టపడే మ్యూజిక్ లవర్స్ను, పిల్లల్నీ కూడా అమితంగా అలరిస్తోంది. అది ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ను దాటింది. డిసెంబర్లో మరో సాంగ్ను రిలీజ్ చెయ్యాలని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టం. 'అల.. వైకుంఠపురములో' సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏం చెయ్యాలో, అంచనాలకు మించి చేశాడు తమన్. అతని సంగీతం ఈ సినిమాకు విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. అతను సంగీతం అందించిన పాటల్ని విజువల్గా చూడాలని బన్నీ ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. తమన్ కొట్టిన బ్లాక్బస్టర్ ట్యూన్స్కు బన్నీ ఎలాంటి స్టెప్పులేశాడో చూడాలనేది వాళ్ల ఆరాటానికి కారణం.
సినిమాకు తమన్ మ్యూజిక్ సగం బలాన్నిస్తే, మిగతా సగం బలం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ మీదనే ఉంది. అందుకే అందరి కళ్లూ ఇప్పుడు ఆయన మీదనే నిలుస్తున్నాయి. త్రివిక్రమ్ మునుపటి సినిమా 'అజ్ఞాతవాసి' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నిచ్చిందో అందరికీ తెలుసు. అటు పవన్ కల్యాణ్ కెరీర్లో కానీ, ఇటు త్రివిక్రమ్ కెరీర్లో కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన అపఖ్యాతి ఆ సినిమా సొంతం. తనే తీసిన బ్లాక్బస్టర్ మూవీ 'అత్తారింటికి దారేది' ఫార్మట్లోనే ఈ మూవీని తీసి, దెబ్బతిన్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు 'అల.. వైకుంఠపురములో' మూవీని ఏ ఫార్మట్లో ఆయన రూపొందిస్తున్నాడో తెలుసుకోవాలని బన్నీ ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఏదైనా ఇతర భాషా సినిమా ఆధారంగా సినిమాలు తీస్తూ వస్తున్నాడనే ఫిర్యాదును చాలా కాలంగా ఆయన ఎదుర్కొంటూ వస్తున్నాడు. దీన్నైనా తన బ్రైన్చైల్డ్గా తీస్తున్నాడా, లేదా.. అని చాలామందే ఆరా తీస్తున్నారు.
బన్నీతో త్రివిక్రమ్ తీసిన మునుపటి సినిమాల్లో 'జులాయి' హిట్టవగా, 'సన్నాఫ్ సత్యమూర్తి' యావరేజ్గా నిలిచింది. ఈ నేపథ్యంలో వాళ్ల కలయికలో తయారవుతున్న మూడో సినిమా 'అల.. వైకుంఠపురములో'పై భారీ అంచనాలున్నాయి. బన్నీకి ఈసారైనా త్రివిక్రమ్ బ్లాక్బస్టర్ని ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీని ఆయన తీర్చిదిద్దుతున్నాడు. తమన్ బ్లాక్బస్టర్ మ్యూజిక్ ఇవ్వడంలో త్రివిక్రమ్ పాత్ర ఉందనీ, తనకు ఎలాంటి మ్యూజిక్ కావాలో చెప్పి, ఆ విధంగా తమన్ నుంచి ఆయన మ్యూజిక్ రాబట్టుకున్నాడనీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. బన్నీ క్యారెక్టరైజేషన్ హైలైట్గా 'అల.. వైకుంఠపురములో' చిత్రాన్ని త్రివిక్రమ్ రూపొందిస్తున్నాడనీ, ఆ పాత్రను ప్రేక్షకుల ఊహలకు మించి ఆసక్తికరంగా ఆయన మలచాడనీ తెలుస్తోంది. బన్నీ- పూజా హెగ్డే మధ్య సన్నివేశాలు, బన్నీ- మురళీశర్మ మధ్య సీన్లు బాగా అలరిస్తాయని సమాచారం. 'నా పేరు సూర్య' సినిమాతో పాఠం నేర్చుకున్న బన్నీ, అలాంటిది మళ్లీ రిపీట్ కాకూడనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు. ఆయనకూ, ఆయన ఫ్యాన్స్కూ త్రివిక్రమ్ ఎలాంటి కానుకనిస్తాడో చూడాల్సిందే.
Also Read