రష్మికా వర్రీ అవకు.. మీకూ, మాకూ మధ్య 50 నిమిషాలే దూరం!
on Feb 18, 2020
రష్మికా మందన్న వర్రీ అవ్వాల్సిన పనిలేదనీ, టాలీవుడ్ చాలా విశాలమైందనీ, ఎంతమంది వచ్చినా అక్కున చేర్చుకుంటుందనీ అన్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ సందర్భం 'భీష్మ' ప్రి రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకుంది. నితిన్ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ప్రి రిలీజ్ ఈవెంట్లో మొదట మాట్లాడిన రష్మిక తనను 'ఛలో' సినిమా కోసం డైరెక్టర్ వెంకీ కుడుముల ఎంచుకున్నందువల్లే ఈరోజు టాలీవుడ్లో ఉండగలిగాననీ, అయితే 'ఛలో' మూవీ చెయ్యడానికి తాను ఓ పట్టాన ఒప్పుకోలేదనీ చెప్పింది. దానికి కారణం.. టాలీవుడ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ కాబట్టి, అక్కడ తనకు స్థానం లభిస్తుందో, లేదోనని సందేహించాననీ తెలిపింది. అయితే డైరెక్టర్ వెంకీ తనను కన్విన్స్ చేసి 'ఛలో' సినిమాలో నటింపజేశాడనీ, ఇప్పుడు అతని డైరెక్షన్లోనే రెండో సినిమా 'భీష్మ' చెయ్యడం సంతోషంగా ఉందనీ తెలిపింది. దాంతో పాటు తాను మొదటగా చూసిన తెలుగు సినిమాల్లో 'అ ఆ' ఒకటనీ, ఆ సినిమా చూసినప్పుడు, తాను సినిమాల్లోకి వెళ్తే, అలాంటి సినిమా చెయ్యాలనుకున్నాననీ కూడా రష్మిక చెప్పింది. త్రివిక్రమ్ ఎంత అందంగా ఉంటారో, ఆయన సినిమాలూ అంతే అందంగా ఉంటాయని చెప్పిన ఆమె, ఆయన నుంచి సపోర్టును కోరుకుంటున్నానని కూడా అన్నది. అంటే.. ఇన్డైరెక్టుగా ఆయన సినిమాలో తనకు ఛాన్స్ ఇవ్వమని చెప్పేసిందన్న మాట. అంతకు ముందు త్రివిక్రమ్ కళ్లకు ఆమె దండం కూడా పెట్టింది.
తనకు మాట్లాడే సమయం వచ్చినప్పుడు రష్మిక విషయం ప్రస్తావించాడు త్రివిక్రమ్. "రష్మికా.. 'సరిలేరు నీకెవ్వరు'తో నువ్వు మంచి సక్సెస్ మార్గంలో ఉన్నావు. ఇప్పుడు 'భీష్మ' వస్తోంది. నీకు మరిన్ని విజయాలు రావాలి. టాలీవుడ్ విశాలమైంది. ఎంతమంది వచ్చినా అక్కున చేర్చుకుంటుంది. బెంగళూరు నుంచి 50 నిమిషాలే ప్రయాణం కాబట్టి నువ్వు వర్రీ అవ్వాల్సిన పనిలేదు. మీరెప్పుడూ మాకు బాగా దగ్గరిగానే ఉంటారు" అని ఛలోక్తి విసిరాడు. మరి రాబోయే రోజుల్లో తన సినిమాల్లో రష్మికకు ఆయన చాన్స్ ఇస్తాడో, లేదో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తను తీయబోయే సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇంకా పెండింగులో ఉంది కాబట్టి, ఆ సినిమాకు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. తారక్తో రష్మిక ఇంతదాకా జోడీ కట్టలేదు కాబట్టి ఫ్రెష్ పెయిర్గా కూడా ఉంటుంది.