మళ్ళీ మెస్మరైజ్ చేసిన త్రిష
on Apr 15, 2021
చెన్నై పొన్ను త్రిష పేరు చెప్పగానే `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా`, `అతడు`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`.. ఇలా పలు బ్లాక్ బస్టర్స్ కళ్ళముందు కదలాడతాయి. తెలుగులోనే కాదు తమిళంలోనూ `విన్నైతాండి వరువాయా`, `96` లాంటి క్లాసిక్స్ లో మురిపించింది ఈ నిషా కళ్ళ సుందరి. దాదాపు రెండు దశాబ్దాలుగా నాయికగా రాణిస్తున్న త్రిష.. ఇటీవల కాలంలో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది.
అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్లో ఒకటైన `పరమపదమ్ విలయాట్టు`.. తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ రోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. 2 గంటల 12 నిమిషాల పాటు సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ను కె. తిరుజ్ఞానమ్ రూపొందించాడు. త్రిష, నందా, రిషి, దీపా శంకర్, బేబి మనస్వి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫిల్మ్కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, డాక్టర్ గాయత్రి పాత్రలో త్రిష నటనకి మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.
ఓ మూగ, చెవిటి అమ్మాయికి తల్లిగా.. బాధ్యతాయుతమైన వైద్యురాలిగా.. రాజకీయ వలలో చిక్కుకునే మహిళగా.. ఇలా ఎన్నో ఛాయలున్న పాత్రలో త్రిష తన అభినయంతో మెస్మరైజ్ చేసింది. వెర్సటైల్ యాక్ట్రస్ గా మన్ననలు పొందుతోంది. మరి.. రాబోయే కాలంలోనూ త్రిష ఇంకెన్ని వైవిధ్యభరితమైన పాత్రలతో మురిపిస్తుందో చూడాలి.