తారాలోకమంతా 9 నిమిషాలు దీపాలు పట్టినవేళ..!
on Apr 5, 2020
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 9 గంటలకు 9 నిమిషాలు పిలుపుకు యావత్ సినీ తారాలోకం సంఘీభావం ప్రకటించింది. ఐక్యతా స్ఫూర్తిని చాటింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇళ్లల్లోని విద్యుద్దీపాలను ఆర్పి, ప్రమిదల దీపాలు లేదా కొవ్వొత్తులు లేదా టార్చిలైట్లు లేదా మొబైల్ ఫ్లాష్లను వెలిగింది అఖండ భారతావని అని ఒక్కటేనని చాటాలనీ, కరోనా వైరస్పై పోరాటంలో అందరూ పాలు పంచుకుంటున్నామనే ఏకభావనను ప్రకటించాలనీ మోదీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, దేశంలోని ఇతర భాషలకు చెందిన తారలంతా రాత్రి సరిగ్గా 9 గంటలకు తమ ఇళ్లల్లోని విద్యుద్దీపాలను ఆర్పివేశారు. కొందరు కొవ్వొత్తులు లేదా నూనెతో వెలిగించిన దీపాలను పట్టుకొని ఆరుబయటకు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే, కొందరు బాల్కనీలు లేదా టెర్రెస్లపై దీపాలు వెలిగించారు.
మొత్తానికి టాలీవుడ్లోని అతిరథ మహారథులైన తారలంతా 9 గంటలకు 9 నిమిషాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కరోనాపై పోరాటంలో తామంతా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో రజనీకాంత్, చిరంజీవి కుటుంబం, మోహన్బాబు, కృష్ణంరాజు దంపతులు, నాగార్జున కుటుంబం, వెంకటేశ్, మహేశ్, మురళీమోహన్ కుటుంబం, అల్లు అరవింద్-అర్జున్ కుటుంబం, జీవితా రాజశేఖర్ కుటుంబం, సాయికుమార్ దంపతులు, బోయపాటి శ్రీను కుటుంబం, గోపీచంద్, అర్జున్ దంపతులు, మంచు విష్ణు, తమన్నా కుటుంబం, పూజా హెగ్డే, కార్తికేయ, ఈషా రెబ్బా తదితరులు ఉన్నారు.