లాక్డౌన్ ఎఫెక్ట్: టీవీ ఇండస్ట్రీ లాస్ ఎంతంటే?
on May 25, 2020
థియేటర్లు మూత పడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. నిజమే. మరి, టీవీ ఇండస్ట్రీ సంగతి ఏంటి? లాక్డౌన్ వలన బుల్లితెర కూడా బాగా నష్టపోయింది. టీవీ సీరియళ్లు, షోలు చేసే నటీనట సాంకేతిక వర్గం సైతం ఖాళీగా ఇంట్లో కూర్చుంటోంది. కొత్త షోలు చేయడం కుదరక పాత హిట్ సీరియళ్లు, షోలను రీటెలికాస్ట్ చేస్తున్నారు. దీనివల్ల యాడ్స్ తగ్గాయి. యాడ్ రెవిన్యూ తగ్గింది. కరోనా దెబ్బకు బుల్లితెర కూడా బాగా కుదేలైంది.
లాక్డౌన్ ఎఫెక్ట్ వలన టీవీ ఇండస్ట్రీకి ఎంత లాస్ వచ్చిందో తెలుసా? నెలకు ఇంచుమించు రూ. 500 కోట్లు. అవును... అక్షరాలా ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతినెలా టీవీ ఇండస్ట్రీ నష్టపోతోంది. తెలుగు ఛానల్స్ లో సుమారు 60 సీరియళ్లు, 20 షోలు నడుస్తున్నాయని అంచనా. మొత్తం మీద ఏడువేల మంది పని చేస్తున్నారట. వాళ్లందరికీ పని లేకుండా పోయింది. అలాగే, ఒకప్పుడు మెయిన్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ యాడ్ రెవెన్యూ నెలకు 500 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు అటు ఇటుగా 100 కోట్లు కూడా రావడం లేదట. యాడ్ రెవెన్యూ 30 శాతం తగ్గిందని టాక్. మొత్తం మీద అన్ని ఛానల్స్ కలుపుకుంటే, లెక్కలు సరిగా తీస్తే నష్టాలు ఇంకా ఎక్కువ ఉంటాయని అంచనా.