తెలంగాణలో అనుమతులకు ఆంధ్ర ప్రభుత్వాన్ని అడగాలా?
on May 24, 2020
చైనాలో కరోనా పుట్టింది. తర్వాత దేశమంతా పాకింది. ఇప్పుడు ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్నారు. ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. ఏ దేశంలో వైద్యులు ఆ దేశంలో చికిత్స చేస్తున్నారు. వ్యాక్సీన్ కనిపెట్టే పనుల్లో ఉన్నారు. పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. పరిష్కారాలను అన్వేషించే క్రమంలో అందరూ చైనా అనుమతులు తీసుకోవాలా? ఏంటి? అవసరం లేదు కదా! ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ అనుకూల వర్గాలు, మీడియా, నాయకులను అడిగితే చైనా అనుమతులు తీసుకోవాలని చెబుతారేమో? ఇదేం వింత వాదన అంటారా? అదంతే. తెలంగాణలో షూటింగులు చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు టాలీవుడ్ పెద్దలు వెళ్లడాన్ని జీర్ణించుకోలేని అనుకూల వర్గాలు చెప్పే మాటలు వింటే... కరోనాకు ముందు కనిపెట్టడానికి చైనా అనుమతి తీసుకోవాలని అన్నట్టు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడినా టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది. ఏపీకి తరలి వెళ్లలేదు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు టాలీవుడ్కి ఇంపార్టెంటే. అయితే, షూటింగులకు హైదరాబాద్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ స్టూడియోలు, సకల సౌకర్యాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా హీరోలు, ఆర్టిస్టులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ సెటిల్ అయ్యారు. ఉన్నట్టుండి ఏపీకి షిఫ్ట్ అవ్వాలంటే ఎలా అవుతారు? అవ్వలేరు. ఇండస్ట్రీలో మెజారిటీ పర్సెంటేజ్ హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం షూటింగులు చేసుకోవడానికి అనుమతులు ఇస్తే అందరికీ పని దొరుకుతుంది. అందుకని, కేసీఆర్ దగ్గరకు వెళుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ కేసీఆర్ దగ్గరకు వెళుతున్నట్టు జగన్ దగ్గరకు రావడం లేదని కుళ్ళుకుంటున్నాయి. టాలీవుడ్ ప్రవర్తనపై ఏపీ ప్రభుత్వం గుర్రుగా ఉందని వార్తలు రాయడం ప్రారంభించాయి.
తెలంగాణలో షూటింగులు జరుగుతున్నప్పటికీ ఏపీ నుండి టాలీవుడ్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి థియేటర్ల లెక్కల విషయంలో గట్టిగా ఉండాలని అనుకుంటున్నట్టు వివరించారు. షూటింగులు మొదలయితే, ఆ తర్వాత థియేటర్ల సంగతి. ముందు సినిమాలు రెడీ అయితే రిలీజ్ చేయడానికి థియేటర్లు కావాలి. తమిళనాడు, కర్ణాటకలో టీవీ షూటింగులకు అనుమతులు ఇచ్చారు. తెలంగాణలో ఇస్తే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి కాలి, వేలికి ముడివేసినట్టు ఏపీ ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వకుండా కరోనా క్రైసిస్ ఛారిటీ – సీసీసీ పెట్టి నిధులు మళ్లించారని వాపోతున్నారు. ఇండస్ట్రీ కార్మికులకు సీసీసీ వల్ల జరిగిన మేలు మాత్రం చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన గౌరవం జగన్కి ఇవ్వడం లేదని వైసీపీ అభిమానుల బాధ. ఒకవేళ తెలంగాణకు జగన్ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కేసీఆర్ని కలిసినట్టు ఆయన్ను టాలీవుడ్ పెద్దలు కలిసేవారు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో??