ఆ నిర్మాతలకు నిద్ర పట్టడం లేదట!
on Jan 18, 2018
ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు సినిమా హీరోగా ఆయన పారితోషికం పాతిక లక్షలు. ఆయన తర్వాత నంబర్ వన్ అయిన చిరంజీవి... ‘ఘరానా మొగుడు’ టైమ్ లో తొలిసారి కోటి పాతిక లక్షలు పారితోషికంగా తీసుకున్నారు. ఆ అంకె విని... యావత్ తెలుగు నేల ఉలిక్కి పడింది. ‘వామ్మో... అంత డబ్బా..’ అని ఆశ్చర్యానికి లోనయ్యింది. ఇప్పుడు కోటి రూపాయలంటే అసలు లెక్కే లేదు. కోటి తీసుకోని హీరో లేడంటే అతిశయోక్తి కాదు. శర్వానంద్ కూడా మూడ్నాలుగు కోట్లు తీసుకుంటున్నాడు.
పవన్ కల్యాణ్ పారితోషికం 20 కోట్లు.
మహేశ్ బాబు తీసుకునేది 18 నుంచి 20 మధ్య
ఎన్టీయార్ పారితోషికం 15 కోట్లు
ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత పారితోషికం 20 కోట్లు చేసినట్లు వినికిడి. నిజానికి ఆ సినిమా దర్శకుడు విజయం. అది అందరికీ తెలిసిందే. ప్రభాస్ స్థానే ఏ హీరో చేసినా ఫలితం మారదు. కానీ... ప్రభాస్ మాత్రం పారితోషికం పవన్ కంటే పెంచేశాడని టాక్. బన్నీ, చరణ్ ల పారితోషికాలు కూడా పది కోట్లకు పై మాటే.
స్టార్ హీరోల్లో అందరికంటే తక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయకుడు బాలకృష్ణ. ఆయన పారితోషికం అయిదు కోట్లు. ఆయన కంటే తక్కువ స్టార్లయిన.. రవితేజ, నాని, సాయిధరమ్ లు కూడా అయిదు కోట్ల కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. కానీ.. బాలయ్య మాత్రం స్టార్ డమ్ ఉన్నా తక్కువే తీసుకుంటున్నారు. నాగార్జున, వెంకటేశ్ లు కూడా బాలయ్య కంటే ఎక్కువే తీసుకుంటున్నట్టు టాక్.
సినిమా ఓ జూదం. ప్రతి సారీ విజయాలు రావ్. తీసిన ప్రతి సినిమా విజయం సాధిస్తే.. పారితోషికాలు ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ.. పరిస్థితి అలా లేదు. అలాంటప్పుడు నిర్మాతల శ్రేయస్సును గమనించకుండా కోట్లుకు కోట్లు పారితోషికాలు పెంచుకుంటూ పోతే.. నష్టం ఎవరికి? నిర్మాత లేకపోతే.. సినిమా బతుకుతుందా? ఎగ్జిబిటర్లు లేకపోతే.. సినిమా గమనం ఉంటుందా? దీన్ని ప్రతి ఒక్క హీరో గమనించాలి.
‘అజ్ఙాతవాసి’ సినిమానే తీసుకోండి... ఆ సినిమా తీసిన నిర్మాత పరిస్థితి, కొన్న బయ్యర్ల పరిస్థితి అగమ్య గోచరం. ఇప్పటివరకూ భారీ డామేజ్ చేసిన సినిమాల్లో మొదటి స్థానం ‘స్పైడర్’ ది కాగా, ఆ రికార్డును సైతం ‘అజ్ఙాతవాసి’ అధిగమించేసింది. దానికి కారణం.. కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ కంటే ఎక్కువ మొత్తం ఇచ్చి ఈ సినిమా కొనడమే. బయ్యర్లు పెట్టిన ప్రతి పైసా.. బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. దాదాపు ఈ సినిమాకు 150 కోట్లు బిజినెస్ అయ్యింది. పారితోషికాలన్నింటినీ కలుపుకొని వంద కోట్లు ఖర్చు పెట్టాడు నిర్మాత. కానీ.. ఈ సినిమాకు ఇప్పటివరకూ వచ్చింది 50 కోట్లు. ప్రస్తుతం థియేటర్లన్నీ ఈగలు తోలుకుంటున్నాయ్.
పవన్, త్రివిక్రమ్ తమ పారితోషికాలను వెనక్కు ఇచ్చేసినట్లు సమాచారం అందుతోంది. అయినా.. డ్యామేజ్ పూడని పరిస్థితి. పెరిగిన నిర్మాణ విలువలే దీనికి కారణం. త్వరలో రాబోతున్న పెద్ద సినిమాలు ‘భరత్ అను నేను, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, రంగస్థలం... ప్రస్తుతం ఈ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయ్. ప్రతి సినిమాకూ డబ్బులు కుమ్మరించేశారు. మరి ‘అజ్ఙాతవాసి’ దెబ్బ చూసిన బయ్యర్లు తమ సినిమాలను సరైన రేట్ ఇచ్చి కొంటారా? పెట్టిన పెట్టుబడైనా వస్తుందా? ఒక వేళ కొన్నా.. ఇవి విజయాలు సాధిస్తాయా? ఈ ప్రశ్నలు నిర్మాతలకూ, బయ్యర్లకూ నిద్ర పట్టకుండా చేస్తున్నాయట.
అందుకే.. కథను నమ్మండి... కాస్ట్ ని తగ్గించుకోండి... సినిమాను బతికించండి