'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు?
on Apr 21, 2021
తెలంగాణలో థియేటర్లు నేటి నుంచి మూతపడుతున్నాయి. అయితే.. అందులో 'వకీల్' సాబ్ థియేటర్లకు మినహాయింపు ఇచ్చారు. ఇచ్చింది ప్రభుత్వం కాదు, థియేటర్లు మూసెయ్యాలని తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానిది కాదు. తెలంగాణ థియేటర్ల సంఘానిది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే.. మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా నెలాఖరు దాకా రాత్రిపూట కర్ఫ్యూను ప్రభుత్వం విధించడం.
హాస్పిటల్స్, మెడికల్ షాపులు, అత్యవసర సేవలకు సంబంధించిన కేంద్రాలకు సంబంధించి మిగతావేవీ తెరవడానికి వీలులేదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఫస్ట్ షో, సెకండ్ షో వేసే వీలు థియేటర్లకు లేకుండా పోయింది. కేవలం రెండు షోలతో థియేటర్లను రన్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది కాబట్టి, థియేటర్ల నిర్వహణ కష్టమైపోతుంది కాబట్టి థియేటర్లను మూసివేయడం వినా వేరే దారి లేదని భావించిన థియేటర్ల సంఘం ఆ నిర్ణయం తీసుకుంది.
అయితే పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వకీల్ సాబ్' మూవీ ఆడుతున్న థియేటర్లను ఈ మూసివేత నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది. నిజానికి తెలంగాణలోని ఎక్కువ థియేటర్లలో ఆడుతున్న సినిమా 'వకీల్ సాబ్'. దీంతో చాలా థియేటర్లు మూతపడకుండా 'వకీల్ సాబ్'తో రన్ అవనున్నాయి. మరి ఈ సినిమా ఫస్ట్ షో, సెకండ్ షో మాటేమిటి? అనే సందేహం రావచ్చు. దానికి ఓ పరిష్కార మార్గాన్ని థియేటర్ల సంఘం కనిపెట్టింది. నాలుగు షోల బదులు మూడు షోలు ఆడిస్తారంట.
రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది కాబట్టి, 8 గంటలకల్లా థియేటర్లను బంద్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఈ లోపే ఫస్ట్ షో పూర్తయ్యేటట్లు టైమింగ్స్ను మారుస్తున్నారు. అంటే ఆరు గంటలకో లేదా 7 గంటలకో వేసే ఫస్ట్ షోను 5 గంటలకే వేయనున్నారు. దీనివల్ల 8 లోపలే ఆ షో పూర్తవుతుంది. దానికి అనుగుణంగా మార్నింగ్ షో, మ్యాట్నీ టైమింగ్స్లో స్వల్ప మార్పులు చేస్తున్నారు.
ఇలా 'వకీల్ సాబ్' బయ్యర్లను కొంత కాకపోయినా కొంతయినా ఆదుకోవాలని థియేటర్ల సంఘం ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఏదేమైనా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి కారణంగా ఇప్పటికే థియేటర్లలోని సీట్లు చాలావరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 'వకీల్ సాబ్' ఆడుతున్న థియేటర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మే 1 నుంచి కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించినట్లయితే ఆ థియేటర్లు కూడా మూతపడటం ఖాయమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.