అనుమతులొచ్చినా.. బొమ్మపడలే! డిసెంబర్ 4 తర్వాతేనట?
on Nov 24, 2020
అనుమతులు వచ్చినా తెలంగాణలో బొమ్మ పడలేదు. థియేటర్లు, మల్టిప్లెక్స్లు రీ ఓపెన్ కాలేదు. కరోనా లాక్ డౌన్ తో మూత పడిన థియేటర్లు, మల్టిప్లెక్స్లు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం రోజున అనుమతులు ఇచ్చింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో ఇవాళ బొమ్మ పడాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. థియేటర్ల యాజమాన్యాలు సినిమా హాళ్ల రీఓపెనింగ్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ చేసినా ప్రేక్షకులు వస్తారా లేదా అన్న సందిగ్ధంలో వారు ఉన్నట్లు
సమాచారం. దీంతో వచ్చేనెల 4వ తేదీ నుంచి థియేటర్లు తెరవాలని యజమానులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త సినిమాల విడుదలకు కొంత సమయం పడుతుందని నిర్మాతలు చెప్పారట. నిర్మాతల నిర్ణయంపైనే థియేటర్లు, మల్టిప్లెక్స్ల ఓపెనింగ్ ఆధారపడి ఉందంటున్నారు.
తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో టికెట్ ధరలపై పెంపుపై థియేటర్ల సంఘాలు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ రూల్స్ పాటిస్తూ 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడపాలంటే అధిక భారం పడుతుందని యజమానులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లులు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలు రకాల కారణాలతో థియేటర్ల తెరుచుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం. కరోనా లాక్ డౌన్ తో మార్చిలో మూతపడ్డాయి థియేటర్లు, మల్టిప్లెక్స్లు. కరోనా లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇటీవలే కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. తెలంగాణలోనూ థియేటర్లు తెరవాలని డిమాండ్లు వచ్చినా.. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గ్రేటర్ ఎన్నికల వేళ.. థియేటర్లు, మల్టిప్లెక్స్ యజమానులకు కొన్ని తాయిలాలు ప్రకటిస్తూ రీ ఓపెనింగ్ కు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఏపీ సర్కార్ గతంలోనే అనుమతి ఇచ్చినా అక్కడ కూడా థియేటర్లు, మల్టిప్లెక్స్లు తెరుచుకోలేదు.