ఆమిర్ ఖాన్ విడాకులు ఈ ఇద్దరు మిత్రుల్ని మళ్లీ కలిపాయి!
on Nov 21, 2020
'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఆమిర్ ఖాన్, జుహీ చావ్లా.. ఆ సినిమా మ్యూజికల్ బ్లాక్బస్టర్ కావడంతో ఓవర్నైట్లో స్టార్స్ అయిపోయారు. ఇద్దరి కెరీర్లకూ మైలురాయిలా నిలిచిన ఈ సినిమాతో ఆ ఇద్దరి మధ్య పెనవేసుకున్న స్నేహబంధం పెరుగుతూ వచ్చింది. బాలీవుడ్ హిట్ పెయిర్స్లో ఆ జంట కూడా ఒకటిగా నిలిచింది. స్క్రీన్ మీద ఆ ఇద్దరి కెమిస్ట్రీ సూపర్బ్ అని అందరూ ప్రశంసించారు. అలాంటిది 'ఇష్క్' సినిమాలో జంటగా నటించే సమయంలో ఆ ఇద్దరి మధ్యా ఏదో కారణంతో గొడవ జరిగి, చాలా కాలం మాట్లాడుకోకుండా ఉండిపోయారు.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ స్వయంగా వెల్లడించాడు. ఓ చిన్న విషయం మీద తాము తగాదా పడ్డామనీ, దాంతో మాట్లాడుకోవడం మానేశామనీ ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. 'ఇష్క్' సినిమా సెట్స్ మీద జుహీ కూర్చొని ఉంటే, ఆమెకూ చాలా దూరంగా.. దాదాపు 50 అడుగుల దూరంలో కూర్చొనేవాడు. కనీసం ఆమెను పలకరించేవాడు కూడా కాదు. కేవలం సీన్స్లో నటించేప్పుడు మాత్రమే ఆ ఇద్దరి మధ్య మాటలుండేవి. కెమెరా ముందు నుంచి ఇవతలకు వస్తే, ఎవరి దారి వారిదే అన్నట్లు ఉండేవారు. దాదాపు 7 సంవత్సరాల సుదీర్ఘ కాలం వారు మాట్లాడుకోలేదు.
ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరి మధ్య గొడవ ఎప్పుడు ముగిసిందంటే.. మొదటి భార్య రీనాకు ఆమిర్ విడాకులు ఇచ్చిన సందర్భంలో! అవును. ఆ ఇద్దరికీ జుహీ ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే వారు విడాకులు తీసుకోవాలనుకుంటున్న విషయం తెలిసి, వారి మధ్య గొడవలను పరిష్కరించడానికి ప్రయత్నించింది జుహీ. ఆ క్లిష్ట కాలంలో జుహీ తనకు అండగా నిలిచిందని కూడా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమిర్, ఆమె లాంటి ఫ్రెండ్ తనకు ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పాడు.
Also Read