తమన్ 'సామజవరగమన'కు దేవి శ్రీప్రసాద్ సమాధానం?
on Nov 11, 2019
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్ట్ చేసొన్న 'అల.. వైకుంఠపురములో' మూవీలో రెండు పాటలు యూట్యూబ్లో విడుదలై సంచలనం సంచలనం సృష్టించాయి. తమన్ స్వరాలు కూర్చగా, సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన 'సామజవరగమన' పాట ఎంతటి సెన్సేషనల్ హిట్టయిందో మనకు తెలుసు. యూట్యూబ్లో మోస్ట్ వ్యూడ్ తెలుగు సాంగ్గా అది రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాని తర్వాత రిలీజ్ చేసిన 'రాములో రాములా' సాంగ్ సైతం సూపర్ పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ను కాసర్ల శ్యామ్ రాశాడు. ఈ పాటల పాపులారిటీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్పై ఒత్తిడిని కలిగిస్తున్నాయని ఫిలింనగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కారణం.. మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'కి మ్యూజిక్ ఇస్తోంది ఆయనే. 'సరిలేరు.. నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలు రెండూ ఒకే రోజు జనవరి 12న విడుదలవుతున్నాయి.
దాంతో సహజంగానే రెండింటి మధ్యా తీవ్ర పోటీ నెలకొంది. మహేశ్, బన్నీ.. ఇద్దరూ మాస్లో అమితమైన క్రేజ్ ఉన్న స్టార్స్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఆ సినిమాల పబ్లిసిటీ విషయంలో సీరియస్గా దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియాలో వాటిని అసాధారణ రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. అయితే 'అల.. వైకుంఠపురములో' దర్శక నిర్మాతలు ఆ సినిమా పబ్లిసిటీని రెండు పాటల రిలీజ్తో చాలా ఘనంగా ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. క్రమం తప్పకుండా ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్తో ఆడియెన్స్లో అంచనాల్ని పెంచుకుంటూ పోతున్నారు.
అయితే దానికి భిన్నంగా 'సరిలేరు నీకెవ్వరు' దర్శక నిర్మాతలు అడపాదడపా పండగ, పుట్టినరోజు సందర్భాల్లో పోస్టర్ల రిలీజ్తో పబ్లిసిటీని సరిపెడుతూ వస్తున్నారు. 'సామజవరగమన' సాంగ్ బయటకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసి ఒకటిన్నర నెల గడిచినా, 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఇంతవరకూ ఒక్క పాటా బయటకు రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ ఎప్పుడు ఫస్ట్ సాంగ్ను బయటకు తెస్తాడా అని అత్యంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటల్ని దేవి ఇచ్చేశాడనీ, దర్శక నిర్మాతలే తొందరపడకుండా వాటిని సరైన సమయంలో విడుదల చేయడానికి ఒక పబ్లిసిటీ ప్లాన్ను అమలు చేయాలని డిసైడ్ చేసుకున్నారనీ వినిపిస్తోంది.
ప్రస్తుతానికి ప్రచార పరంగా 'సరిలేరు నీకెవ్వరు'పై 'అల.. వైకుంఠపురములో' మూవీది పైచేయిగా కనిపిస్తోందనేది వాస్తవం. దానికి తమన్ స్వరాలు కూర్చిన పాటలే కారణం. యూట్యూబ్లో ఆదిత్యా మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేసిన 'సామజవరగమన' సాంగ్ రికార్డు స్థాయిలో ఇప్పటివరకూ 77 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాటతో తమన్ క్రేజ్, తద్వారా మూవీ క్రేజ్ అమాంతం అనేక రెట్లు పెరిగింది. నెల తర్వాత ఆదిత్యా మ్యూజిక్ 'రాములో రాములా' సాంగ్ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 27న బయటకు వచ్చిన ఈ పాట సైతం బ్లాక్బస్టర్ హిట్టయి ఇప్పటి దాకా 43 మిలియన్ వ్యూస్ రాబట్టింది. హై రేంజిలో హిట్టయిన ఆ పాటలు సినిమాపై ఆసక్తిని విపరీతంగా పెంచాయి.
బన్నీ మునుపటి సినిమా 'నా పేరు నా ఇల్లు ఇండియా' డిజాస్టర్ కావడంతో, 'అల.. వైకుంఠపురములో' మూవీపై అందరి కళ్లూ నిలుస్తున్నాయి. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాని బ్లాక్బస్టర్ హిట్ చేయాలనే సంకల్పంతో దానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ పాజిటివ్ బజ్గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ రెండు పాటలూ ఒకదాన్ని మించి మరొకటి సంగీత ప్రియుల్ని అమితంగా అలరించడంతో దేవి శ్రీప్రసాద్పై తీవ్ర ఒత్తిడి నెలకొన్నదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. తమన్ స్వరాలు కూర్చిన పాటల స్థాయికి 'సరిలేరు నీకెవ్వరు' పాటల స్థాయి ఏమాత్రం తగ్గినా సహించడానికి మహేశ్ ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. ఫుట్ ట్యాపింగ్ నంబర్స్ ఇవ్వడంలో దేవిని మించినవాడు ఎవ్వరూ లేరని ఇప్పటి దాకా టాలీవుడ్లో పేరుంది. అందుకే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
గత ఏడాది 'రంగస్థలం' మూవీకి అతడిచ్చిన సాంగ్స్ ఏ రేంజి హిట్టయ్యాయో మనం చూశాం. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'కు దాన్ని మించిన మ్యూజిక్ ఇవ్వాల్సిన ఒత్తిడిని అతను ఫీలవుతున్నాడు. గతంలో అతనెప్పుడూ ఈ స్థాయి ఒత్తిడిని ఎదుర్కోలేదు. మహేశ్ మునుపటి రెండు సినిమాలు 'భరత్ అనే నేను', 'మహర్షి'కి మ్యూజిక్ డైరెక్టర్ అతనే. వాటికి అతడిచ్చిన మ్యూజిక్ బాగానే పాపులర్ అయ్యింది. అయితే ఆ స్థాయి మ్యూజిక్ 'సరిలేరు నీకెవ్వరు'కు ఇస్తే చాలదు. ఎందుకంటే 'సామజవరగమన', 'రాములో రాములా' పాటల స్థాయిలో ఆ సినిమాల్లోని పాటలు హిట్టవలేదు. అందుకే 'సరిలేరు నీకెవ్వరు'కు దేవి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడోనని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకు డిసెంబరులో తొలి పాటను రిలీజ్ చెయ్యాలనుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని నవంబరులోనే ఆ పాటను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. చూద్దాం.. తమన్ ట్యూన్స్కు దేవి ట్యూన్స్ ఎలాంటి పోటీ ఇస్తాయో!