ఇకనుంచీ టాలీవుడ్లో ఫేక్ కలెక్షన్స్కు చెక్పోస్ట్ పడుతోంది!
on Feb 11, 2020
ఇటీవల ఫేక్ కలెక్షన్ల జాతర సినిమా ఇండస్ట్రీనీ, ట్రేడ్ వర్గాల్నీ కుదిపేసింది. సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు.. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' నిర్మాతలు ఎవరికివాళ్లు తమ సినిమాయే 'నాన్ బాహుబలి 2' రికార్డుల్ని సాధించిందంటూ ఊదరగొట్టడం మనకు తెలుసు. ఆ నిర్మాతలు ఇష్టం వచ్చినట్లు తమ సినిమా అంత సాధించింది, ఇంత సాధించిందని ప్రకటించడం.. ఆ ప్రకటనల్లో నిజాయితీ లేదనీ, అవి ఫేక్ కలెక్షన్లనీ దుమారం చెలరేగడం మనం చూశాం. ఈ విషయంలో రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. వాస్తవ కలెక్షన్లు ఒక రకంగా ఉంటే, బయటకు ఇంకో రకంగా చెప్పాల్సి వస్తున్నదంటూ వారు వాపోతున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాల రికార్డుల పిచ్చి చిత్రసీమలోని అనారోగ్యకర వాతావరణాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ కలెక్షన్ వార్ ఆయా స్టార్ల ఫ్యాన్స్ మధ్య వార్ను పెంచి పెద్దచేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ధోరణికి చెక్ చెప్పాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆలోచిస్తోంది. ఇకనుంచీ ఏ సినిమా కలెక్షన్లయినా తామే ప్రకటిస్తామనీ, తాము ప్రకటిస్తేనే అవి అధికారిక లెక్కలనీ, ఆయా సినిమాల నిర్మాతలు కానీ, మరెవరైనా ప్రకటించినవి పరిగణనలోకి తీసుకోవద్దనీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుడైన కె.ఎల్. దామోదర్ ప్రసాద్ చెబుతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాల మధ్య విడుదల తేదే గొడవ తలెత్తినప్పుడు జోక్యం చేసుకొని, సమస్యను పరిష్కరించింది కూడా గిల్డే. అదేవిధంగా కలెక్షన్లను కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని, వాస్తవ వసూళ్లను ప్రకటించాలని గిల్డ్ నిర్ణయం తీసుకుందని దామోదర్ ప్రసాద్ తెలిపారు. గిల్డ్ నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుందో చూడాలి.
Also Read