జగన్పై పవన్ కల్యాణ్ కామెంట్స్కు, ఇండస్ట్రీకి సంబంధం లేదన్న ఫిల్మ్ చాంబర్!
on Sep 26, 2021
మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా 'రిపబ్లిక్' ప్రి రిలీజ్ ఈవెంట్లో ఏపీ ప్రభుత్వం, జగన్, మంత్రి పేర్ని నానిపై విరుచుకుపడి, వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కల్యాణ్. ఆయన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్గా మారాయి. ఏపీలో ఆన్లైన్ టికెటింగ్ వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు పవన్కల్యాణ్. తనపై కోపంతో సినిమాను చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇండస్ట్రీ జోలికొస్తే కాలిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్ టికెట్ల ఆదాయం చూపి అప్పులు తెచ్చుకోడానికే అలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. ‘సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై విరుచుకుపడ్డారు.
దీంతో సహజంగానే ఆయన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వ పెద్దల్లో కాకను రేకెత్తించాయి. మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్పై రివర్స్లో దుమ్మెత్తిపోశారు. పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల వల్ల అక్కడ సినిమాలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని భయపడిన సినీ పెద్దలు.. పవన్వి వ్యక్తిగత వ్యాఖ్యలనీ, వాటికీ, ఇండస్ట్రీకీ సంబంధం లేదనీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆదివారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటన వెలువరిస్తూ, పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా వివిధ్య వ్యక్తుల అభిప్రాయాలు పరిశ్రమ అభిప్రాయం కాదని తెలిపింది. ఇండస్ట్రీ సమస్యలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓపిగ్గా అర్థం చేసుకున్నారనీ, ఇండస్ట్రీ వ్యక్తం చేసిన ఆందోళనలకు సానుకూలంగా స్పందించారనీ చెప్పుకొచ్చింది.
ఫిల్మ్చాంబర్ ప్రకటన పూర్తి పాఠం...
"మహమ్మారి కరోనా కారణంగా అనేక ఇతర సమస్యల గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేం ప్రభుత్వానికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకున్నారు, మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించారు. అలాగే మేం వ్యక్తం చేసిన ఆందోళనలకు సంబంధించిన అంశాలన్నీ సమీప భవిష్యత్తులో సానుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చారు. అందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు.
రాష్ట్ర విభజన తాకిడికి గురై విపత్కర స్థితిలో పడిన పరిశ్రమ, కరోనా మహమ్మారి, ఇతర సమస్యల కారణంగా అత్యంత దయనీయ స్థితిలో పడిపోయింది. వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను, ఆవేదనను వివిధ వేదికలపై వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ అభిప్రాయం కాదు. మా పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పునరుద్ఘాటించాలని అనుకుంటున్నాం. సంవత్సరాల నుంచీ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించలేదు.
ఈ పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది, వారి కుటుంబాలు 2020 మార్చి నుండి ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో మన నాయకులు, ప్రభుత్వాలు పెద్ద మనసుతో వారి నిరంతర మద్దతు అందించడం చిత్ర పరిశ్రమకు అవసరం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలు మన చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు. మన గౌరవనీయ ముఖ్యమంత్రులు ఇద్దరూ చురుగ్గా పనిచేస్తున్నారు. వారి ప్రోత్సాహం, మద్దతు ఎల్లప్పుడూ మాకు అందించారు. వారి నిరంతర ఆశీస్సులు, మద్దతు కోరుతూ....
నారాయణ దాస్ నారంగ్
అధ్యక్షుడు"
Also Read