క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి.. ఎందుకంటే...
on Apr 16, 2021
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి హేతువాదులకు క్షమాపణలు చెప్పారు. ఆయన పరమశివభక్తుడనే విషయం మనకు తెలుసు. 'ఆటగదరా శివా' పేరిట ప్రచురించిన శివ తత్వాలు ఆయనకు అమిత పేరుప్రఖ్యాతులు తెచ్చాయి. కొంతకాలంగా ఆయన తన ఫేస్బుక్ హ్యాండిల్ ద్వారా 'శబ్బాష్రా శంకరా' పేరుతో రోజుకో కొత్త శివతత్త్వాన్ని ఆయన పోస్ట్ చేస్తున్నారు. అలా ఇటీవల ఆయన చేసిన ఓ పోస్ట్ వివాదానికి దారి తీసింది. దానిపై హేతువాదులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో భరణి వారికి క్షమాపణలు తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయడమే కాకుండా, వివాదానికి కారణమైన పోస్ట్ను తొలగించారు.
"కొన్ని రోజులుగా నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న 'శబ్బాష్రా శంకరా' కవితల్లో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొంతమంది మనసుల్ని నొప్పించడం, బాధ కలిగించడం జరిగింది. దానికి నేను ఏ వివరణ ఇచ్చుకున్నా కవరింగ్ లాగా ఉంటుంది కాబట్టి, నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పోస్ట్ డిలీట్ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత ఏమీ లేదు. ఏ మనిషికీ ఇంకొకర్ని నొప్పించే హక్కూ అధికారం లేదు. జరిగిన పొరపాటుకి మరోసారి మన్నించమని కోరుకుంటున్నా." అని ఆ వీడియోలో ఆయన చెప్పారు.
ఇది ఎవరినీ నొప్పించని భరణి సున్నిత మనస్తత్వానికి నిదర్శనమని పలువురు అభిమానులు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదనీ, మీరు నమ్మింది చెప్పడంలో తప్పులేదనీ మరికొంతమంది ఆయన పోస్టును సపోర్ట్ చేస్తున్నారు.
Also Read