దోషిగా తేలితే.. అతడితో అన్ని సంబంధాలు తెంచుకుంటా!
on Sep 23, 2020
దర్శకుడు అనురాగ్ కశ్యప్ వర్సెస్ యాక్ట్రెస్ పాయల్ ఘోష్ వివాదంలో అనురాగ్కి హీరోయిన్ తాప్సి మద్దతు పలికింది. అతడి దర్శకత్వంలో 'మన్ మార్జియాన్', నిర్మాణంలో 'సాండ్ కి ఆంఖ్' సినిమాలు తాప్సి చేసింది. ఇద్దరి మధ్య స్నేహం ఉందని చెప్పుకోవచ్చు. అయితే, అనురాగ్ మీద పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తరవాత అతడికి మద్దతుగా తాప్సి మాట్లాడింది. అనురాగ్ 'బిగ్గెస్ట్ ఫెమినిస్ట్' అని పేర్కొంది. ఒకవేళ అనురాగ్ దోషిగా తేలితే... అతడితో ఉన్న సంబంధాలు అన్నీ తెంచుకుంటానని వ్యాఖ్యానించింది.
"మహిళలు అంటే అనురాగ్ కశ్యప్కి ఎంతో గౌరవం. ఎవరి గురించి తప్పుగా మాట్లాడడు. అతడి సాంకేతిక బృందంలో మగవాళ్ళతో పాటు మహిళల సంఖ్య సమానంగా ఉంది. మహిళలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే అరుదైన సెట్స్ లో అనురాగ్ కశ్యప్ సెట్ ఒకటి. అతడి దగ్గర పనిచేసే మహిళలు అందరూ అతడి గురించి మంచిగా చెబుతారు" అని తాజా ఇంటర్వ్యూలో తాప్సి అన్నారు.
ఎవరైనా వేధింపులకు గురైతే వాళ్ళను దర్యాప్తు ప్రారంభించనివ్వమని, నిజాన్ని బయటకు రానివ్వమని తాప్సి వ్యాఖ్యానించారు. ఒకవేళ అనురాగ్ కశ్యప్ దోషిగా తేలితే అతడితో తన సంబంధాలను పూర్తిగా తెంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. దర్యాప్తు అసంపూర్తిగా ఉంటే "మీ టూ" ఉద్యమ పవిత్రత ఎలా కొనసాగించాలో ఆలోచన చేయాలని ఆమె సూచించారు. ఉద్యమాన్ని తప్పుదారి పట్టించడం మహిళలకు చేటు చేస్తుందని తాప్సి అన్నారు.