'సైరా' విషయంలో రాంచరణ్ మోసం చేశారు!
on Sep 22, 2019
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ దగ్గర నుంచి సేకరించి, 'సైరా' షూటింగ్ విషయంలో సహకరించే నిమిత్తం తమకు రూ. 50 కోట్లు ఇస్తామని మాటిచ్చి రాంచరణ్ తమను మోసం చేశారని నరసింహారెడ్డి కుటుంబీకులు ఆరోపించారు. ఈ మేరకు 'సైరా' నిర్మాత రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, మరో నలుగురిపై వారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నరసింహారెడ్డి కథ కోసం రాంచరణ్ ఏడాది క్రితం తమను కలిశారనీ, 'సైరా.. నరసింహారెడ్డి' పేరుతో సినిమా తీస్తున్నట్లు చెప్పి, 22 మంది కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి నరసింహారెడ్డి కథను పూర్తిగా తెలుసుకున్నారనీ ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. సినిమాకు సహకరించడానికి తమకు రూ. 50 కోట్లు ఇస్తామని 2018 ఆగస్ట్ 20న రాంచరణ్ మాటిచ్చారనీ, కానీ ఇంతవరకూ ఆ డబ్బు ఇవ్వలేదనీ వారు ఆరోపించారు. అందుకు భిన్నంగా 2019 మార్చి 13న తమ కుటుంబ సభ్యుల్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆఫీసుకు పిలిపించి కేవలం రూ. 25 వేలు ఇచ్చి, బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారనీ, త్వరలోనే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారనీ వారు ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయమై ఆగస్ట్ 8న, సెప్టెంబర్ 16న రాంచరణ్ను కలవడానికి ప్రయత్నించామనీ, కానీ ఆయన మనుషులు తమను చంపుతామని బెదిరించారనీ వారు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ తమకు న్యాయం చెయ్యకపోతే సెప్టెంబర్ 22 సాయంత్రం ఎల్బీ స్టీడియంలో జరిగే 'సైరా' ప్రి రిలీజ్ వేడుకను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ ఆరోపణలకు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా వారు చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినవారిలో నంద్యాలకు చెందిన దొరవారి దస్తగిరిరెడ్డి, దొరవారి లక్ష్మీకుమారి, సాంబశివారెడ్డి, జయరామిరెడ్డి, జగదీశ్రెడ్డి ఉన్నారు.
Also Read