తెలుగునాట 'సేఫ్' దిశగా 'సైరా'!
on Oct 8, 2019
బ్రిటిష్ వాళ్లపై వీరోచితంగా పోరాడి, స్వాతంత్ర్య కాంక్షను జనంలో రగిలించిన తొలినాటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా తెలుగునాట సంతృప్తికర కలెక్షన్లను సాధిస్తూ ముందుకు పోతోంది. దేశంలోని మిగతా ఏరియాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ కలెక్షన్లు బాగున్నాయి. ఆరు రోజుల్లోనే బయ్యర్ల పెట్టుబడిలో మూడింట రెండు వంతులు పైగా వసూలు చేసిన 'సైరా'.. సేఫ్ దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిపి 69.6 శాతం షేర్ రాబట్టింది ఈ సినిమా. అంటే బయ్యర్లు వెచ్చించిన సుమారు 108 కోట్ల రూపాయల పెట్టుబడిలో 75 కోట్ల రూపాయలను 'సైరా' తిరిగి అందించిందని ట్రేడ్ విశ్లేషకులు తెలియజేశారు. ఆరో రోజు.. అంటే సోమవారం 'సైరా' సుమారు 5.5 కోట్ల షేర్ వసూలు చేయడం బయ్యర్లలో సంతోషాన్ని నింపింది.
ఈ ఆరు రోజుల కాలంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల కంటే తెలంగాణలో ఎక్కువ షేర్ రావడం గమనించాల్సిన అంశం. ఇక్కడ 72 శాతం పైగా షేర్ నమోదయింది. ఈ ప్రాంత బయ్యర్లు 30 కోట్ల రూపాయలు 'సైరా'పై వెచ్చించగా, 21.5 కోట్ల రూపాయల షేర్ వసూలయిందని విశ్లేషకులు చెప్పారు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత ప్రాంతం రాయలసీమలోనే తక్కువ శాతం షేర్ రావడం ఆశ్చర్యకరం. ఈ ప్రాంతంలో 66.5 శాతం షేర్ మాత్రమే వచ్చింది. 20 కోట్ల రూపాయల పెట్టుబడిపై ఇక్కడ వచ్చింది 13 కోట్ల రూపాయల చిల్లర.
ఆరు ఉప ప్రాంతాలున్న ఆంధ్రా ఏరియాలో 69 శాతం షేర్ రాబట్టింది 'సైరా'. ఈ ప్రాంతం మొత్తమ్మీద బయ్యర్లు ఈ సినిమాపై వెచ్చించింది దగ్గర దగ్గర 58 కోట్లు కాగా, వచ్చిన షేర్ 40 కోట్ల రూపాయల చిల్లర. విడిగా చూసినప్పుడు ఆంధ్రాలోని వైజాగ్ ఏరియాలో అత్యధికంగా 74.5 శాతం పైగా షేర్ వచ్చింది. తూర్పు గోదావరి, నెల్లూరు ప్రాంతాల ప్రేక్షకులు కూడా 70 శాతం పైగా వసూళ్లను సాధించిపెట్టారు.
గ్రహించాల్సిన విషయమేమంటే విడుదలైన తొలిరోజు తెలుగునాట 'సైరా' వసూలు చేసిన షేర్ 37.5 కోట్లయితే, తర్వాత ఐదు రోజులు కలిపి వసూలు చేసింది కూడా దాదాపు అదే ఫిగర్. శాతాల వారీగా చూసినప్పుడు ఆంధ్రా ప్రాంతం కంటే తెలంగాణ, రాయలసీమ ప్రాతాల్లో ఈ ఐదు రోజుల్లో వసూళ్లు మెరుగయ్యాయి. ఆంధ్రాలోని గుంటూరు, ఉభయ గోదావరి ఏరియాల్లో వసూళ్ల శాతం తగ్గింది.
బుధవారంతో దసరా సెలవులు ముగుస్తున్నాయి కాబట్టి అక్టోబర్ 10 నుంచి కలెక్షన్లు ఏ రీతిన ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి అక్టోబర్ 9వ తేదీ నాటికి బయ్యర్లు సేఫ్ అయితే, తర్వాత షేర్ తగ్గినా భయపడాల్సిన పని ఉండదు. అయితే తాజా అంచనా ప్రకారం రెండు వారాల తర్వాతే 'సైరా' సేఫ్ జోన్లోకి అడుగుపెట్టే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. సినిమాని ఎక్కువ థియేటర్లలో వెయ్యడం వల్ల షేర్ వాల్యూ తగ్గిందనే అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.
రిస్క్ అని తెలిసినా తెలుగువాళ్లు మరిచిపోయిన ఒక మహాయోధుడి కథను, అది కూడా.. మనల్ని బానిసల్ని చేసి పీడించిన తెల్లవాళ్లపై రాజీలేని పోరాటం చేసి, ఆ పోరాటంలో ప్రాణాన్ని సైతం త్యాగంచేసిన వీరుడి కథను మనముందుకు తెచ్చిన 'సైరా' మూవీని ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా తెలుగువాళ్లంతా చూడాలని, అప్పుడే ఇలాంటి గొప్ప సినిమాలు తెలుగులో మరిన్ని రావడానికి ఆస్కారం ఏర్పడుతుందనీ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read