పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' హీరోయిన్ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా?
on Feb 25, 2021
దేవయాని అనగానే మనకు 'సుస్వాగతం'లో పవన్ కల్యాణ్ హీరోయిన్ కళ్లముందు కదలాడుతుంది. తెలుగులో ఆమె నటించిన ఫస్ట్ ఫిల్మ్ అది. అయితే దానికంటే ముందుగానే ఓ డబ్బింగ్ ఫిల్మ్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది దేవయాని. ఆ.. సినిమా 'ప్రేమలేఖ'. అజిత్ హీరోగా అగస్త్యన్ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో దేవయానిలోని ఇన్నోసెంట్ బ్యూటీకి దాసోహం కాని వాళ్లెవరు! 'సుస్వాగతం' సినిమా బ్లాక్బస్టర్ హిట్టవడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆమెకు అనేకమంది ఆరాధకులు తయారయ్యారు.
అయితే ఎక్కువగా తమిళ సినిమాలకే ఆమె ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అడపాదడపా మాత్రమే తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. 'నాని' మూవీలో మహేశ్కు అమ్మగా నటించిన ఆమె, ఈమధ్య 'జనతా గ్యారేజ్'లో జూనియర్ ఎన్టీఆర్కు పెద్దమ్మగా కనిపించారు. తన కెరీర్లో మూడు సార్లు ఉత్తమ నటిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డులను అందుకోవడంతో పాటు, రెండు సార్లు కలెమామణి పురస్కారాలను పొందారు.
దేవయానిది ప్రేమ వివాహం. తమిళ సినిమాల దర్శకుడు రాజకుమారన్ను ఆమె 2001లో పెళ్లాడారు. ఆయన దర్శకత్వం వహించిన 'విన్నుకుమ్ మన్నుకుమ్' సినిమాలో ఆమె హీరోయిన్గా చేసినప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించి, క్రమేణా బలపడింది. కానీ వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దాంతో ఇద్దరూ పెద్దల అభీష్టానికి విరుద్ధంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరికీ ఇద్దరు కూతుళ్లు.. ఇనియా, ప్రియాంక. ఇనియా అచ్చుగుద్దినట్లు వాళ్లమ్మలాగే ఉంటుంది. ప్రియాంకకు వాళ్ల నాన్న పోలికలు వచ్చాయి.
గమనించదగ్గ విశేషమేమంటే, పెళ్లి తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్సును పూర్తిచేసిన ఆమె, చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్లో టీచర్గా పనిచేశారు. కొంత కాలం నుంచి తిరిగి సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్లోనూ నటిస్తూ వస్తున్నారు. త్వరలో శేఖర్ కమ్ముల సినిమా 'లవ్ స్టోరీ'లో ఆమె కనిపించబోతున్నారు. ఒకవైపు గృహిణిగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు కెరీర్నూ కొనసాగిస్తున్నారు బ్యూటిఫుల్ దేవయాని.