అప్పుడు వినాయక్.. ఇప్పుడు సురేందర్ రెడ్డి!
on Mar 21, 2020
'సైరా.. నరసింహారెడ్డి' సినిమా 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదలైంది. ఆ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' మూవీతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం కోవిడ్-19 భయం కారణంగా షూటింగ్ ఆగిపోవడం వేరే విషయం. అయితే 'సైరా' డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం ఇంకా యాక్షన్లోకి దిగలేదు. ఫిల్మ్నగర్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అతను తన తదుపరి మూవీలో అఖిల్ అక్కినేనిని డైరెక్ట్ చేయబోతున్నాడు. అదే నిజమైతే స్టార్ హీరోతో కాకుండా ఒక మామూలు హీరోతో అతను తీయబోయే సినిమా 'అతనొక్కడే' తర్వాత ఇదే అవుతుంది.
మెగాస్టార్తో సినిమా తీశాక వెంటనే ఒక సాధారణ హీరోతో సినిమా తీయడం సురేందర్ రెడ్డి విషయంలో మాత్రమే జరగలేదు. ఇదివరకు వి.వి. వినాయక్ విషయంలోనూ అదే జరిగింది. చిరంజీవి కమ్బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150'ని డైరెక్ట్ చేసిన వినాయక్, దాని తర్వాత సాయిధరమ్ తేజ్తో 'ఇంటిలిజెంట్' మూవీ తీశాడు. అది ఘోరంగా ఫ్లాపైంది. 2018లో వచ్చిన ఆ మూవీ తర్వాత మళ్లీ ఇంతదాకా వినాయక్ మెగాఫోన్ చేపట్టలేదు. అందుకు బదులుగా 'శీనయ్య' అనే సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తూ యాక్టర్ అవుదామనుకున్నాడు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత అర్ధంతరంగా ఆ సినిమాని ఆపేశాడు.
ఇప్పుడు 'సైరా' తర్వాత సురేందర్ రెడ్డికి స్టార్ హీరోల నుంచి పిలుపులేవీ వచ్చినట్లు లేవు. అందుకే అఖిల్కు అతను ఒక స్క్రిప్ట్ వినిపించాడనీ, ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్తో నిండిన ఆ స్క్రిప్టును అఖిల్ ఇష్టపడ్డాడనీ వినిపిస్తోంది. 2020 సెకండాఫ్లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈలోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్ చేస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ విడుదల కానున్నది. కాగా సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబో మూవీని హీరో నితిన్ నిర్మించనున్నట్లు సమాచారం. అఖిల్ డెబ్యూ ఫిల్మ్ 'అఖిల్'ను నిర్మించింది కూడా నితినే. సందర్భవశాత్తూ ఆ మూవీ డైరెక్టర్ వినాయక్ కావడం గమనార్హం.