విజయ్ సేతుపతి సినిమా కోసం జైపూర్ వెళ్లొచ్చిన సురేఖావాణి
on Sep 15, 2020
నటి సురేఖావాణి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూస్తే, తన భావాలను ఆమె ఎంత స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తుందో అర్థమవుతుంది. కొన్ని పోస్టుల వల్ల ఆమె విమర్శలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం చలించలేదు. తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వదులుకోలేదు. తెలుగు సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ వస్తోన్న ఆమె తాజాగా ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పింక్ సిటీ జైపూర్లో జరుగుతోంది. సురేఖావాణి కూడా ఈ షూటింగ్లో పాల్గొన్నారు.
జైపూర్లోని సిటీ ప్యాలెస్, రాంబాగ్ ప్యాలెస్, సమోద్ ప్యాలెస్లలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. 20 రోజుల నుంచి అక్కడ షూటింగ్ జరుపుతున్నారు. జైపూర్కు వెళ్లే ముందు నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ హోమ్ క్వారంటైన్లో ఉండి, కొవిడ్ 19 టెస్ట్ చేయించుకొని, నెగటివ్ అని రిపోర్ట్లో వచ్చాకే అక్కడకు వెళ్లారు. జైపూర్లోని సమోద్ ప్యాలెస్లో అందరూ బస చేశారు. బయటి వాళ్లెవరూ లోపలికి రాకుండా ఆ ప్యాలెస్లో మూడు దశల సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ఆదివారం కూడా అక్కడ షూటింగ్ జరిపారు. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న రాధికా శరత్కుమార్ తన ఇన్స్టా హ్యాండిల్లో విజయ్ సేతుపతితో తీసుకున్న సెల్ఫీ పిక్చర్ను షేర్ చేసి, "Sunday is shoot day" అనే క్యాప్షన్ రాశారు. మొత్తం అక్కడ 40 రోజుల పాటు షూటింగ్ జరపనున్నట్లు చిత్రం బృందం తెలిపింది.
కాగా ఈ షెడ్యూల్లో సురేఖావాణికి సంబంధించిన సన్నివేశాలు ముగియడంతో ఆమె హైదరాబాద్ వచ్చేశారు. ఈ సందర్భంగా తోటి నటీనటులతో తీసిన రెండు పిక్చర్లను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఒక పిక్చర్ సహ నటి దేవదర్శిని తీసిన సెల్ఫీ ఫొటో. అందులో సురేఖావాణితో పాటు రాధిక, తమిళ నటి మధుమిత ఉన్నారు. మరో పిక్చర్లో సురేఖ, మధుమిత, కమెడియన్ జోగిబాబు తదితరులున్నారు. "మిస్ యు గైస్" అనే క్యాప్షన్తో దేవదర్శిని, మధుమిత, రాధికలను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు సురేఖావాణి.
దీపక్ సుందర్రాజన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కూడా నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.