నలుగురు ఫ్రెండ్స్... మూడు బయోపిక్స్!
on Feb 2, 2019
జనవరిలో తెలుగు తెరపై ఓ బయోపిక్ వచ్చింది. అదే ఎన్టీఆర్ కథానాయకుడు. దీనికి విష్ణు ఇందూరి సహ నిర్మాత. అసలు ఎన్టీఆర్ జీవితంపై ఓ సినిమా తీయాలనే వచ్చిన ఆయనదే. ఈ విషయాన్ని సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ స్వయంగా చెప్పారు. విష్ణు ఇందూరికి, తెలుగు తెరపై రాబోతున్న మరో రెండు బయోపిక్స్ కి చిన్న కనెక్షన్ ఉంది. అదేంటో తెలుసా? ఫిబ్రవరిలో తెలుగు తెరపై మరో బయోపిక్ వస్తుంది. అదే యాత్ర. దీన్ని పూర్తిస్థాయి బయోపిక్ అనలేం. కాకపోతే... బయోపిక్ లాంటిదే. దీనికి విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మాతలు. ఈ రెండూ కాకుండా... ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో పుల్లెల గోపీచంద్ పాత్రను ప్రముఖ హీరో సుధీర్ బాబు పోషించనున్నాడు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే... సుధీర్ బాబు, విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి, విష్ణు ఇందూరి క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నలుగురు సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. అనుకోకుండా వచ్చిన ఈ నలుగురు ఒకే ఏడాది బయోపిక్స్ చేయడం విశేషమే.