బన్నీతో మాస్ ఎంటర్ టైనర్?
on Apr 5, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` చేస్తున్నారు. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారాయన. రష్మిక నాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్టు 13న పలు భాషల్లో సందడి చేయనుంది. ఆ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సోషల్ డ్రామా చేయబోతున్నారు బన్నీ. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అల్లు అర్జున్. ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల బన్నీని సంప్రదించి ఓ స్క్రిప్ట్ వినిపించారట. మాస్ ఎంటర్ టైనర్ గా సాగే ఆ కథకి బన్నీ వెంటనే ఫిదా అయ్యారని సమాచారం. త్వరలోనే అల్లు అర్జున్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, అనిల్ రూపొందిస్తున్న మల్టిస్టారర్ `ఎఫ్ 3` చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టు 27న ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ జనం ముందుకు రానుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.